
రికార్డు స్థాయిలో ఓటింగ్ - బీహార్ ప్రజాస్వామ్యానికి కొత్త శక్తి
బీహార్ అసెంబ్లీ ఎన్నికల తొలి దశలో ఓటర్ల స్పందన రికార్డు స్థాయికి చేరింది. సుమారు 64.66 శాతం మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇది బీహార్ రాజకీయ చరిత్రలోనే అత్యధికం. ఈ సంఖ్యలు కేవలం గణాంకాలే కావు అవి ప్రజాస్వామ్యంపై ప్రజల నమ్మకాన్ని ప్రతిబింబిస్తున్నాయి. 18 జిల్లాల్లోని 121 నియోజకవర్గాల్లో సుమారు 3.75 కోట్ల మంది ఓటర్లు పాల్గొన్నారు. హింసా రహితంగా, శాంతియుతంగా ఓటింగ్ జరగడం బీహార్ ఎన్నికల చరిత్రలో సానుకూల మలుపు. గతంలో హింస, బెదిరింపులు, దందాలు సహజంగా కనిపించిన ఈ రాష్ట్రంలో, ఈసారి ఓటర్లు ధైర్యంగా తమ హక్కును వినియోగించారు.
ఎన్నికల నిర్వహణలో నూతనత్వం
ఈసారి ఎన్నికల కమిషన్ అనేక సాంకేతిక, ప్రణాళికాత్మక మార్పులు చేసింది. ప్రతి పోలింగ్ కేంద్రం లైవ్ వెబ్కాస్టింగ్ కిందకు తీసుకురావడం బీహార్లో ఇదే మొదటిసారి. అదనంగా, సుమారు 90 వేల “జీవిక దిదీలు” అనే మహిళా వాలంటీర్లను నియమించి, పర్దా కట్టుకున్న మహిళా ఓటర్లకు సహాయపరిచే విధంగా ఏర్పాట్లు జరిగాయి. ప్రతి బూత్లో ఓటర్ల సంఖ్యను 1,200లోపే పరిమితం చేశారు. ఇవన్నీ కలిసి ఓటర్లకు సౌకర్యవంతమైన వాతావరణం కల్పించాయి. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్ (EVM) లోపాలు గత ఎన్నికలతో పోలిస్తే గణనీయంగా తగ్గాయి మొత్తం యంత్రాలలో కేవలం 1.2 శాతం మాత్రమే మార్చాల్సి వచ్చింది. ఎన్నికల రోజున 143 ఫిర్యాదులు నమోదయ్యాయి, వాటిని అదే రోజున పరిష్కరించడం కూడా గమనార్హం.
ఓటర్ జాబితా సవరణపై వివాదం
ఎన్నికల కమిషన్ తన ప్రత్యేక పునఃపరిశీలన (Special Intensive Revision) ద్వారా మృతులు, మారినవారు, అనర్హులు ఉన్న పేర్లను తొలగించి జాబితాను శుభ్రపరిచిందని తెలిపింది. కానీ ప్రతిపక్ష పార్టీలు మాత్రం సుమారు 47 లక్షల పేర్లు తొలగించబడ్డాయని, వాటిలో పేదలు, వలస కార్మికులు ఎక్కువగా ఉన్నారని ఆరోపిస్తున్నాయి. ఈ ఆరోపణలు నిర్ధారించబడనప్పటికీ, ఎన్నికల న్యాయబద్ధతపై సందేహాలు మిగిలాయి. ఓటరు జాబితాలో పారదర్శకత లేకపోతే, రికార్డు ఓటింగ్ కూడా నమ్మకాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది.
శాంతియుత వాతావరణం, కానీ కొంత అసమానత
మొత్తంగా ఓటింగ్ శాంతియుతంగా జరిగినప్పటికీ, కొన్ని జిల్లాల్లో బక్సర్, ఫతూహా, సూర్యగఢా పోలింగ్ సమయాలు తగ్గించడం, లేదా రవాణా సమస్యలు ఎదురవడం జరిగింది. కొన్ని బూత్లలో భద్రతా కారణాల వల్ల ఓటింగ్ ఒక గంట ముందే ముగిసింది. ఈ తరహా నిర్ణయాలు కొన్ని ప్రాంతాల ఓటర్లను నష్టపరిచే అవకాశం ఉంది. అయితే హింస లేకుండా, స్త్రీలు, వృద్ధులు, దివ్యాంగులు కూడా ధైర్యంగా పాల్గొనడం బీహార్ ఎన్నికల పరిపక్వతను సూచిస్తుంది. నదీదీవి ప్రాంతాల్లో బోట్లు ద్వారా ఈవీఎంలను తరలించడం వంటి వినూత్న ఏర్పాట్లు కూడా కనిపించాయి.
మహిళా ఓటర్ల చురుకుగా
ఈ ఎన్నికలలో అత్యంత ప్రేరణాత్మక దృశ్యం మహిళా ఓటర్ల చురుకుదనం. అనేక నియోజకవర్గాల్లో మహిళల ఓటింగ్ శాతం పురుషులను మించి ఉంది. “జీవిక దిదీలు” మహిళలలో అవగాహన పెంచి, పర్దా వెనుక ఉన్న స్త్రీలను కూడా బయటకు తెచ్చారు. బీహార్ మహిళలు తమ ఓటు విలువను అర్థం చేసుకుంటున్న కొత్త దశ ఇది.
ఇంకా మెరుగుపరచాల్సిన అంశాలు
ప్రజాస్వామ్య ఉత్సవం విజయవంతమైనా, కొంత మార్పు అవసరం ఉంది. బీహార్ రాజకీయాల్లో డబ్బు శక్తి, కుల ప్రభావం, క్రిమినల్ అభ్యర్థులు ఇంకా ప్రభావం చూపుతున్నారు. ఎన్నికల ప్రచారంలో మద్యం, నగదు పంపిణీ ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ఎన్నికల కమిషన్ ప్రతి బూత్ స్థాయిలో తొలగించిన లేదా చేర్చిన ఓటర్ల వివరాలు ప్రజల ముందుంచి, లింగం, వయస్సు, ప్రాంతాల వారీగా వివరాలు ఇవ్వాలి. ఫిర్యాదుల పరిష్కారాన్ని సమయపాలనతో, పారదర్శకంగా చేయాలి. భవిష్యత్ దశల్లో మొబైల్ పోలింగ్ బూత్లు, రవాణా సౌకర్యం, మహిళా సిబ్బంది పెంపు వంటి చర్యలు తీసుకుంటే దూరప్రాంతాల ఓటర్ల భాగస్వామ్యం మరింత పెరుగుతుంది.
విశ్వాసమే ప్రజాస్వామ్య బలం
ఈ దశలో బీహార్ చూపిన ఉత్సాహం దేశానికి ఉదాహరణ. ఓటింగ్ శాతం పెరగడం మాత్రమే కాదు, ఓటు విలువపై ప్రజల అవగాహన పెరుగుతుండటం ముఖ్యమైంది. సాంకేతికత, పారదర్శకత, స్థానిక భాగస్వామ్యం ఇవి కలిస్తే స్వచ్ఛమైన ఎన్నికలు సాధ్యమవుతాయి. కానీ ప్రజాస్వామ్యం సంఖ్యలపై కాకుండా నమ్మకంపై నిలబడాలి. ప్రతి ఓటు సమాన విలువ కలిగి ఉందని ప్రజలు నమ్మే పరిస్థితి ఏర్పడితేనే బీహార్ నిజమైన మార్పుకు దారితీస్తుంది. మిగిలిన దశల్లో కూడా ఇదే ఉత్సాహం కొనసాగితే, ఈ ఎన్నికలు కేవలం అధిక ఓటింగ్ రికార్డుతో కాకుండా, విశ్వాసం మరియు పారదర్శకతతో కూడిన ప్రజాస్వామ్య నమూనాగా గుర్తింపును పొందగలవు
