Let's talk: editor@tmv.in
రాష్ట్ర వన్య ప్రాణి బోర్డు స్టాండింగ్ కమిటీ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్

రాష్ట్ర వన్య ప్రాణి బోర్డు స్టాండింగ్ కమిటీ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్

Dantu Vijaya Lakshmi Prasanna
25 అక్టోబర్, 2025

గురువారం మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అధ్యక్షతన రాష్ట్ర వన్య ప్రాణి బోర్డు స్టాండింగ్ కమిటీ సమావేశం జరిగింది.

సమావేశంలో చర్చించిన అంశాలు

అడవి ఏనుగుల వలన పంటల నష్టం

పార్వతీపురం మన్యం జిల్లా సరిహద్దు ప్రాంతానికి ఒడిశా వైపు నుంచి వస్తున్న మదపుటేనుగుల సమస్యను నివారించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. మన్యంలో ఏనుగుల సంచారం వల్ల జరుగుతున్న పంట నష్టం, ప్రాణ నష్టంపై నివేదిక ఇవ్వాలని సూచించారు. మదపుటేనుగుల గుంపుల జాడను ఎప్పటికప్పుడు తెలుసుకుని పంటలకు నష్టం వాటిల్లకుండా వాటిని మళ్లించే ఏర్పాట్లు చేయాలన్నారు. ఏనుగుల కదలికలపై నిరంతర నిఘా అవసరం. ఒడిశా నుంచి వచ్చే ఏనుగులను తిరిగి మళ్లించే చర్యలు తీసుకోండి అన్నారు. ఒడిశా నుండి రాష్ట్రంలో ప్రవేశించిన రెండు గుంపులు పంటలను ధ్వంసం చేస్తున్నాయని క్షేత్ర స్థాయి నుంచి తెలిసింది. రైతుల ఇబ్బందుల దృష్ట్యా ఏనుగుల కదలికలను ఎప్పటికప్పుడు ట్రాక్ చేయాలి. ట్రాకర్లు ఇచ్చిన సమాచారం ఆధారంగా వాటిని తిరిగి అడవిలోకి మళ్లించాలి. ఒడిశా వైపు నుంచి వస్తున్నాయి కాబట్టి అవసరం అయితే ఆ రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి వాటిని వెనక్కి పంపే విధంగా చర్యలు తీసుకోవాలని పవన్ కళ్యాణ్ అన్నారు.

అటవీ భూముల సేకరణపై జాతీయ వన్యప్రాణి బోర్డుకు నివేదిక

రాష్ట్ర పరిధిలో పలు జాతీయ రహదారుల నిర్మాణానికి అటవీ భూములు అవసరం అవుతాయి. అటవీ భూములతో పాటు ఎకో సెన్సిటివ్ జోన్, టైగర్ రిజర్వ్ జోన్ పరిధిలో ఉన్న భూములను దీని నిమిత్తం సేకరించాల్సి ఉంది. బద్వేల్, నెల్లూరు మధ్య 67వ నంబర్ నాలుగు లైన్ల జాతీయ రహదారి నిమిత్తం 34.67 హెక్టార్ల అటవీ భూమి అవసరం ఉంటుందని అధికారులు తెలియజేశారు. ఈ ప్రాంతం ఎకో సెన్సిటివ్ జోన్ లో ఉంది. ఈ భూములను బదిలీ చేసేందుకు జాతీయ వన్య ప్రాణి బోర్డు స్టాండింగ్ కౌన్సిల్ అనుమతి కోసం పంపించనున్నాం. బెంగళూరు, కడప, విజయవాడ ఎక్స్ ప్రెస్ కారిడార్ కోసం నాగార్జున సాగర్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ తో పాటు శ్రీ వెంకటేశ్వర నేషనల్ పార్క్ నుంచి 40.86 హెక్టార్లు భూమి బదిలీ చేసేందుకు నేషనల్ టైగర్ కన్జర్వేటివ్ అథారిటీ, వైల్డ్ లైఫ్ ఇండియా అనుమతులతో పాటు జాతీయ వన్య ప్రాణి బోర్డుకు నివేదిక అందజేయనున్నాం. ఈ నెల 29వ తేదీన గౌరవ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్రమోడీ గారి అధ్యక్షతన జాతీయ వన్యప్రాణి బోర్డు స్టాండింగ్ కమిటీ సమావేశానికి పై ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నాం అని అధికారులు ఉప ముఖ్యమంత్రికి తెలిపారు.

రాష్ట్ర సీతాకోక చిలుకగా లిమినియేసి బ్లూ టైగర్

రాష్ట్రంలో కనిపించే అరుదైన సీతాకోక చిలుక అయిన తిరుమల లిమినియేసి బ్లూ టైగర్ సీతాకోక చిలుకను, రాష్ట్ర సీతాకోక చిలుకగా గుర్తించాలని జాతీయ వన్య ప్రాణి బోర్డు ప్రతిపాదన పంపుతున్నామన్నారు.

లిమినియేసి బ్లూ టైగర్ .........

"లిమినియేసి బ్లూ టైగర్" అనేది సాధారణంగా బ్లూ టైగర్ సీతాకోకచిలుక. దీని శాస్త్రీయ నామం తిరుమల లిమ్నియేస్ఎక్సోటికస్ (గ్మెలిన్, 1790). ఓరియంటల్ బ్లూ టైగర్ బ్లూ టైగర్ సీతాకోకచిలుక నింఫాలిడే కుటుంబానికి చెందినది. ఈ కుటుంబంలో బ్రష్-ఫుటెడ్ బటర్‌ఫ్లైస్ ఉంటాయి. ఇది ఆసియా, ఆగ్నేయాసియాలో విస్తృతంగా కనిపిస్తుంది.ఈ జాతి భారతదేశంలో వన్యప్రాణుల (రక్షణ) చట్టం, 1972 లోని ఏ షెడ్యూల్ ప్రకారం చట్టబద్ధంగా రక్షించబడలేదు.

భౌతిక లక్షణాలు:

• దీని రెక్కల పైభాగం ప్రధానంగా ముదురు గోధుమ - నలుపు రంగులో ఉండి, దానిపై నీలి - తెలుపు రంగులో సెమీ - ట్రాన్స్‌పరెంట్ మచ్చలు , చారలు ఉంటాయి. ఈ నమూనా పురుష, స్త్రీ సీతాకోకచిలుకలలో దాదాపు ఒకే విధంగా ఉంటుంది.

• దీని రెక్కల విస్తీర్ణం సాధారణంగా 70 నుండి 105 మి.మీ. వరకు ఉంటుంది.

• ఇది తన లార్వా దశలో మిల్క్‌వీడ్ మొక్కలను తింటుంది. ఆ మొక్కల నుండి విషపూరిత సమ్మేళనాలను గ్రహిస్తుంది. ఈ విషం దీనిని పక్షులు, బల్లుల వంటి వేటాడే జీవుల నుండి రక్షిస్తుంది, దీనివల్ల ఇది విషపూరితమైనదని తెలుస్తుంది.

జీవనశైలి మరియు ప్రవర్తన

ఇది భారతదేశంలోని మైదాన ప్రాంతాలలో, కొండ ప్రాంతాలలో సర్వసాధారణంగా కనిపిస్తుంది. ఉష్ణమండల అడవులు, తోటలు, పొలాలలో దీనిని చూడవచ్చు.

బ్లూ టైగర్ సీతాకోకచిలుక వ‌లస జీవి. దక్షిణ భారతదేశంలో, ఋతుపవనాల సమయంలో ఇవి పశ్చిమ కనుమల నుండి తూర్పు కనుమలకు, తిరిగి తూర్పు కనుమల నుండి పశ్చిమ కనుమలకు వలస వెళ్లడం గమనించవచ్చు. ఈ వలసల కాలంలో వేలాది సీతాకోకచిలుకలు గుంపులుగా ప్రయాణిస్తాయి, ఇది ఒక అద్భుతమైన దృశ్యం.

గొంగళి పురుగుగా ఉన్నప్పుడు డ్రాగియా వాల్యు బిల్స్ లేదా వట్టకాక వాల్యు బిల్స్ వంటి మిల్క్‌వీడ్ కుటుంబానికి చెందిన మొక్కల ఆకులను తింటుంది. పెద్ద సీతాకోకచిలుక వివిధ రకాల మొక్కల నుండి తేనెను తాగుతుంది. పింక్ కాంబ్‌స్కబ్ వంటి పూలను తరచుగా సందర్శిస్తుంది.

వలసల సమయంలో, మగ సీతాకోకచిలుకలు నేలపైని తడి మట్టిలో లేదా గుంటలలోని ఖనిజ లవణాలను గ్రహించడానికి గుంపులుగా చేరడం (మడ్ పుడ్డింగ్) అనేది సర్వసాధారణం.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వన్యప్రాణి బోర్డు ఈ బ్లూ టైగర్ సీతాకోకచిలుకను రాష్ట్ర సీతాకోకచిలుకగా గుర్తించడానికి ప్రతిపాదన చేసింది. ఈ ప్రతిపాదన ద్వారా, రాష్ట్రంలో జీవవైవిధ్య పరిరక్షణకు, ముఖ్యంగా కీటకాల సంరక్షణకు ప్రాధాన్యత ఇవ్వబడుతుంది.

రాష్ట్ర వన్య ప్రాణి బోర్డు స్టాండింగ్ కమిటీ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ - Tholi Paluku