
రాష్ట్రపతి శీతాకాల విడిది ముగింపు
హైదరాబాద్లోని రాష్ట్రపతి నిలయంలో తన సంప్రదాయ శీతాకాల పర్యటనను పూర్తి చేసిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సోమవారం సాయంత్రం ఢిల్లీకి బయలుదేరారు. ఈ సందర్భంగా హకీంపేట్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్లో ఆమెకు ఘనంగా వీడ్కోలు పలికారు. తెలంగాణ గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ, ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి, కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి సహా పలువురు ప్రముఖులు రాష్ట్రపతికి హృదయపూర్వక అభివాదం తెలియజేశారు.
డిసెంబర్ 17న ప్రారంభమైన రాష్ట్రపతి ముర్ము పర్యటనలో భాగంగా ఆమె పలు కీలక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. డిసెంబర్ 19న ప్రజాసేవా కమిషన్ల చైర్పర్సన్ల జాతీయ సదస్సును ఉద్దేశించి ప్రసంగించారు. అలాగే డిసెంబర్ 20న బ్రహ్మకుమారీస్ శాంతి సరోవర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘టైమ్లెస్ విజ్డమ్ ఆఫ్ భారత్: పాత్వేస్ ఆఫ్ పీస్ అండ్ ప్రోగ్రెస్’ సదస్సులో పాల్గొన్నారు. ఈ కార్యక్రమం బ్రహ్మకుమారీస్ సంస్థ 21వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని హైదరాబాద్లో నిర్వహించారు.
రాష్ట్రపతి ప్రతి ఏడాది కనీసం ఒకసారి అయినా హైదరాబాద్లోని రాష్ట్రపతి నిలయాన్ని సందర్శించి, అక్కడి నుంచే అధికారిక విధులను నిర్వహించడం ఆనవాయితీ. దేశంలోని ఉత్తర భాగంలో ఉన్న షిమ్లాలోని ‘ది రిట్రీట్ బిల్డింగ్’తో పాటు దక్షిణ భారతంలో ఉన్న హైదరాబాద్ రాష్ట్రపతి నిలయం, దేశ ఐక్యతను ప్రతిబింబించే ప్రతీకలుగా నిలుస్తున్నాయి. విభిన్న సంస్కృతులు, ప్రజల మధ్య ఐక్యతను చాటిచెప్పేలా ఈ రెండు రాష్ట్రపతి నివాసాలు దేశ సమగ్రతకు నిదర్శనంగా నిలుస్తున్నాయి.
హైదరాబాద్ నగరంలోని బోలారం ప్రాంతంలో ఉన్న రాష్ట్రపతి నిలయం భవనాన్ని 1860లో నిర్మించారు. స్వాతంత్య్రం అనంతరం నిజాం నుంచి ఈ భవనాన్ని స్వాధీనం చేసుకుని రాష్ట్రపతి కార్యాలయానికి అప్పగించారు. సుమారు 90 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉన్న ఈ ఒక అంతస్తుల భవనంలో 11 గదులు ఉన్నాయి. అదనంగా భోజనశాల, సినిమా హాల్, మార్నింగ్ రూమ్, డైనింగ్ రూమ్ తదితర సౌకర్యాలు కూడా ఉన్నాయి. రాష్ట్రపతి పర్యటనలతో ఈ చారిత్రక కట్టడం మరింత విశిష్టతను సంతరించుకుంటోంది.
