
రాష్ట్రపతి భవన్ లో చక్రవర్తి రాజగోపాలచారి విగ్రహావిష్కరణ
భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సోమవారం రాష్ట్రపతి భవన్ లో చక్రవర్తి రాజగోపాలచారి (రాజాజీ) విగ్రహాన్ని(బస్ట్ ఆవిష్కరించారు. స్వతంత్ర భారతదేశపు తొలి, ఏకైక గవర్నర్ జనరల్గా రాజాజీ సేవలందించారు. గ్రాండ్ ఓపెన్ స్టెయిర్కేస్ సమీపంలోని అశోక మండపం వద్ద ఏర్పాటు చేసిన ఈ విగ్రహాన్ని, అక్కడ ముందుగా ఉన్న ఎడ్విన్ లుటెయిన్స్ విగ్రహాన్ని ప్రత్యామ్నాయంగా ప్రతిష్ఠించారు. రాష్ట్రపతి అధికారిక ఎక్స్ హ్యాండిల్లో ఈ సందర్భంగా వలస పాలన మనస్తత్వానికి సంబంధించిన అవశేషాలను తొలగిస్తూ, భారత సంస్కృతి, వారసత్వం, శాశ్వత సంప్రదాయాల గౌరవాన్ని కాపాడే దిశగా తీసుకున్న చర్యలలో ఇది ఒక భాగమని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి సీ.పీ. రాధాకృష్ణన్, కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జగత్ ప్రకాశ్ నడ్డా, విదేశాంగ శాఖ మంత్రి సుబ్రమణ్యం జై శంకర్, విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ , సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ , సమాచార ప్రసార శాఖ సహాయ మంత్రి ఎల్.మురుగన్ తదితరులు, అలాగే రాజాజీ కుటుంబ సభ్యులు హాజరయ్యారు. ఇదిలా ఉండగా, ప్రధాన మంత్రి నరేంద్రమోడీ తన ‘మన్ కీ బాత్’ 131వ ఎపిసోడ్లో ‘రాజాజీ ఉత్సవం’ను రాష్ట్రపతి భవన్లో నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. దేశం బానిసత్వ చిహ్నాలను విడిచిపెట్టి, భారతీయ సంస్కృతికి సంబంధించిన ప్రతీకలను గౌరవించే దిశగా ముందుకు సాగుతోందని ఆయన పేర్కొన్నారు.
రాజాజీ జీవితం – ముఖ్యాంశాలు
జననం: డిసెంబర్ 10, 1878, మద్రాస్ ప్రెసిడెన్సీ
వృత్తి: న్యాయవాది, స్వాతంత్ర్య సమరయోధుడు, రాజకీయవేత్త, మహాత్మా గాంధీకి సన్నిహిత సహచరుడు
రౌలట్ చట్టం, సహయనిరాకరణ, సివిల్ డిసొబీడియెన్స్ ఉద్యమాల్లో కీలక పాత్ర
రాజ్యాంగ సభ సభ్యత్వం (మద్రాస్ నుంచి)
1954లో భారత రత్న పురస్కారం అందుకున్నారు. రాజాజీ సేవలను స్మరించుకుంటూ రాష్ట్రపతి భవన్లో ఈ విగ్రహాన్ని ప్రతిష్ఠించడం ఒక చారిత్రాత్మక ఘట్టంగా భావిస్తున్నారు.
బస్ట్ అంటే ఒక వ్యక్తి తల, మెడ, భుజాల వరకు మాత్రమే ఉండే విగ్రహం.
