
రాష్ట్రంలో పడిపోతున్న ఉష్ణోగ్రతలు.. రానున్న రెండు రోజుల పాటు అలర్ట్
తెలంగాణ రాష్ట్రంలో చలి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ముఖ్యంగా రాబోయే రెండు నుంచి మూడు రోజులలో రాష్ట్రంలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు గణనీయంగా తగ్గే సూచనలు ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.సాధారణ స్థాయి కంటే 3 నుంచి 4 డిగ్రీల సెల్సియస్ వరకు కనిష్ట ఉష్ణోగ్రతలు తక్కువగా నమోదయ్యే అవకాశం ఉంది.ప్రస్తుతం తెలంగాణలో పలుచోట్ల రాత్రి పూట 10 డిగ్రీల లోపే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ పరిస్థితి మరికొన్ని రోజులు కొనసాగే అవకాశం ఉండటంతో ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు.
ఈ నేపథ్యంలో వృద్ధులు, పిల్లలు చలి నుంచి రక్షణ పొందేందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, అలాగే రాత్రి సమయాల్లో ప్రయాణాలు చేసేవారు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది.తక్కువ ఉష్ణోగ్రతల నేపథ్యంలో పొగమంచు ఏర్పడే అవకాశం ఉండటంతో రహదారులపై ప్రయాణించే వారు అప్రమత్తంగా ఉండాలని ,చలి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం ప్రకటించింది.
