
రాజకీయ పరిస్థితులు అర్థం చేసుకోవడానికే హుమాయూన్ను కలిశా: సీపీఎం సలీం
పశ్చిమ బెంగాల్లో వామపక్షాల తరఫున హుమాయూన్ కబీర్ నేతృత్వంలోని పార్టీతో జరిగిన చర్చలు వామపక్షాల లౌకిక ధోరణికి విరుద్ధమని కొందరు విమర్శించిన నేపథ్యంలో ఎండీ.సలీం వివరణ ఇచ్చారు. ఆ చర్చలు కేవలం రాష్ట్రంలో ఉద్భవిస్తున్న రాజకీయ ధోరణులను అర్థం చేసుకోవడానికే నిర్వహించామని తెలిపారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ), బీజేపీలకు వ్యతిరేకంగా సమాన ఆలోచనలు కలిగిన విభిన్న వర్గాలను ఒకే వేదికపైకి తేవాలన్న ఉద్దేశంతో వివిధ సంస్థలతో సంప్రదింపులు జరిపినట్లు చెప్పారు. హుమాయూన్ కబీర్ను సలీమ్ జనవరి 28న కొల్కత్తాలోని ఒక హోటల్లో కలవడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది. కొందరు దీనిని సీపీఎం రాజకీయంగా బలహీనపడడంతో తీసుకున్న ప్రయత్నంగా భావించారు. వామపక్ష కూటమి భాగస్వామ్య పార్టీల నుంచి కూడా విమర్శలు వచ్చాయి.
మతపరమైన రాజకీయాలకు సీపీఎం వ్యతిరేకం
హుమాయూన్ కబీర్ నేతృత్వంలోని ‘ఆమ్ జనతా ఉన్నయన్ పార్టీ’తో జరిగిన సీట్ల పంచాయితీ చర్చలు మొదలయ్యేలోపే ముగిశాయని సలీం తెలిపారు. కారణం—మతపరమైన రాజకీయాలకు వ్యతిరేకంగా సీపీఎం స్పష్టమైన షరతు పెట్టడమే అని చెప్పారు. ముర్షీదాబాద్ జిల్లా భరత్పూర్ నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్యే అయిన హుమాయూన్ కబీర్ గతంలో కాంగ్రెస్, బీజేపీల్లో కూడా పనిచేశారు. గత సంవత్సరం డిసెంబరులో బెల్డంగా ప్రాంతంలో బాబ్రీ మసీదు తరహా మసీదు నిర్మాణానికి ప్రయత్నించడం వల్ల ఆయనను టీఎంసీ నుంచి బహిష్కరించారు. అనంతరం ఆయన పార్టీని స్థాపించి ఏఐఎంఐఎంతో కలిసి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు.
ఏప్రిల్ 1న వామపక్ష కూటమి తరఫున పార్టీ నాయకుడు బిమన్ బోస్ సీట్ల వివరాలు ప్రకటిస్తూ, మొత్తం 294 అసెంబ్లీ స్థానాల్లో 252 స్థానాల్లో వామపక్షాలు నేరుగా పోటీ చేస్తాయని తెలిపారు. మిగిలిన 42 స్థానాల్లో ఇండియన్ సెక్యూలర్ ఫ్రంట్, సీపీఐ(మార్క్సిస్ట్–లెనినిస్ట్) లిబరేషన్ వంటి అనుబంధ పార్టీలకు మద్దతు ఇస్తామని చెప్పారు. హుమాయూన్ కబీర్తో చర్చలు ఎందుకు విఫలమయ్యాయో వివరిస్తూ, మా మధ్య ఉన్న సిద్ధాంత భేదాలు చాలా పెద్దవి. మతపరమైన రాజకీయాలు బెంగాల్లో నిలబడవని మేము ఆయనకు స్పష్టంగా చెప్పామని సలీమ్ తెలిపారు. గతంలో కాంగ్రెస్, బీజేపీ, టీఎంసీలో పనిచేసిన విషయాన్ని ప్రజల ముందు అంగీకరించి క్షమాపణ కోరాలని కూడా కబీర్కు సూచించామని చెప్పారు. ఏఐఎంఐఎం వంటి పార్టీలతో వామపక్షాలకు ఎలాంటి రాజకీయ పొత్తులు ఉండవని కూడా స్పష్టం చేశామని అన్నారు.
సీనియర్ నేతలు పోటీ చేయడం లేదు
ఈసారి తాను సహా పలువురు సీనియర్ నేతలు ఎన్నికల్లో పోటీ చేయకపోవడం గురించి కూడా వివరణ ఇచ్చారు. పార్టీ ప్రచారాన్ని బలోపేతం చేయడం, సంస్థను పునర్నిర్మించడం కోసం సీనియర్ నేతలను ఎన్నికల ప్రచారంలో వినియోగించాలనే నిర్ణయం తీసుకున్నామని చెప్పారు.
రాష్ట్ర స్థాయి పార్టీ సమావేశంలో తీసుకున్న నిర్ణయం ప్రకారం రాష్ట్ర కార్యదర్శివర్గంలోని ఇద్దరు మహిళా నేతలు తప్ప మిగతా సభ్యులు ఎవరూ ఎన్నికల్లో పోటీ చేయరని తెలిపారు. ఈసారి అభ్యర్థుల ఎంపికలో యువత, అనుభవజ్ఞులు, మధ్యతరగతి నాయకులు కలగలిపి ఎంపిక చేశామని సలీమ్ చెప్పారు. సాధారణ స్థానాల్లో కూడా గిరిజనులు, ఎస్సీ వర్గాలకు చెందిన అభ్యర్థులను నిలబెట్టామని తెలిపారు.
రాష్ట్రంలో వామపక్షాలకు ప్రస్తుతం అసెంబ్లీలో ఒక్క సీటు కూడా లేకపోయినా ఈ పరిస్థితి ఒక పెద్ద అవకాశమని ఆయన అభిప్రాయపడ్డారు. నిరుద్యోగం, ధరల పెరుగుదల, వ్యవసాయ సంక్షోభం, ఆరోగ్య–విద్య రంగాల పతనం వంటి సమస్యల వల్ల ప్రజల్లో అసంతృప్తి పెరిగిందని అన్నారు. విభిన్న సామాజిక వర్గాల మద్దతుతో ఈసారి వామపక్షాలు ఐక్యంగా నిలబడ్డాయని, అవినీతి, మతపరమైన రాజకీయాలకు ప్రత్యామ్నాయంగా మళ్లీ వామపక్ష శక్తులు ఎదుగుతున్నాయని సలీం తెలిపారు.
