
రష్యా తీరంలో భారీ భూకంపం
రష్యాను వరుస భూకంపాలు కలవరపెడుతున్నాయి. ఇటీవల వచ్చిన భూకంపాల నుంచి తేరుకోకముందే గురువారం మరోసారి భారీ భూకంపం భయభ్రాంతులకు గురి చేసింది. తూర్పు కమ్చట్కా ద్వీపకల్పంలో శక్తివంతమైన భూకంపం సంభవించినట్లు అధికారులు వెల్లడించారు. దీంతో అలస్కా, హవాయి ప్రాంతాలకు సునామీ హెచ్చరికలు జారీ చేశారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదని అధికారులు వెల్లడించారు. 7.8 తీవ్రతతో భూకంపం సంభవించిందని అమెరికా జియోలాజికల్ సర్వే వెల్లడించింది. భూకంపం 10 కిలోమీటర్ల లోతులో వచ్చినట్లు తెలిపింది.
వేగవంతంగా స్పందించిన అధికారులు
ఈ భూకంపం సంభవించిన అనంతరం వెంటవెంటనే మళ్లీ ప్రకంపనలు వచ్చాయి. రిక్టర్ స్కేలుపై వీటి తీవ్రత 5.8గా నమోదైంది. రష్యా అత్యవసర మంత్రిత్వ శాఖ భూకంప తీవ్రత 7.2గా నమోదైందని చెప్పింది. ఈ ఘటనపై ప్రాంతీయ గవర్నర్ వ్లాదిమిర్ సోలోడోవ్ మాట్లాడుతూ.. సహాయక సిబ్బంది అప్రమత్తంగా ఉన్నారని, ఎలాంటి నష్టం జరగకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు. భూకంపం సంభవించిన తర్వాత నిమిషాల్లోనే అధికారులు స్పందించి నివాస భవనాలు, ప్రజా సౌకర్యాల పరిశీలన ప్రారంభించారు. ద్వీపకల్పం తూర్పు తీరానికి సునామీ హెచ్చరిక జారీ చేశారు. ఈ తీరం పసిఫిక్ మహాసముద్రం, బెరింగ్ సముద్రం వైపు ఉంది. తీర ప్రాంతాల్లో 0.5 నుంచి 1.5 మీటర్ల ఎత్తున అలలు రావొచ్చని అధికారులు అంచనా వేశారు. తీర ప్రాంతాలకు దూరంగా ఉండాలని ప్రజలకు సూచించారు. రష్యా, జపాన్ మధ్య ఉన్న కురిల్ దీవులకు కూడా మాస్కో అత్యవసర మంత్రిత్వ శాఖ సునామీ హెచ్చరిక జారీ చేసింది. అమెరికా పసిఫిక్ సునామీ హెచ్చరిక కేంద్రం, జాతీయ వాతావరణ సేవ అలాస్కా భాగాలకు హెచ్చరికలు విస్తరించాయి. కమ్చట్కాలో 3 మీటర్ల ఎత్తున అలలు, ప్రమాదకర ప్రవాహాలు రావొచ్చని హెచ్చరించాయి. హవాయికి సునామీ ప్రమాదం లేదని అమెరికా జాతీయ వాతావరణ సేవ పసిఫిక్ సునామీ హెచ్చరిక కేంద్రం చెప్పింది. ఈ భూకంపంతో కెనడాకు ఎలాంటి ప్రమాదం లేదని అధికారులు తెలిపారు.
గత జూలైలో సైతం రష్యా దూర తూర్పు ప్రాంతంలో 8.8 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఆ భూకంప ప్రభావంతో పలు దేశాల తీర పట్టణాల్లో సునామీ హెచ్చరికలు జారీ చేశారు. కమ్చట్కా ద్వీపకల్పం పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్లో ఉంది. ఈ ప్రాంతం భూకంపాలకు అనుకూలంగా ఉంది. ఇటీవలి కాలంలో ఇక్కడ పలు భూకంపాలు సంభవించాయి. 2025 జూలై 29న 8.8 తీవ్రతతో ప్రకంపనలు వచ్చాయి. ఆ భూకంపానికి ముందు 2024లో 7.0 తీవ్రతతో, 2025 జూలై 20న 7.4 తీవ్రతతో భూకంపం వచ్చింది. ఈ భూకంపాలను భారీ నష్టానికి ముందస్తు హెచ్చరికలుగా పరిగణించవచ్చు. ఈ ప్రాంతంలో టెక్టానిక్ ప్లేట్ల కదలికలు తరచూ భూకంపాలు, సునామీలు కలిగిస్తాయి. అధికారులు అప్రమత్తంగా ఉండటం వల్ల నష్టం తక్కువగా ఉంది. భవిష్యత్తులో మరిన్ని భూకంపాలు వచ్చే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
