Let's talk: editor@tmv.in
రీల్స్​ పిచ్చితో యువతి దుస్సాహసం

రీల్స్​ పిచ్చితో యువతి దుస్సాహసం

Pinjari Chand
22 సెప్టెంబర్, 2025

‘పిచ్చి ముదిరింది రోకలి చుట్టండి అన్నాడట’ వెనకటికి ఎవరో... అలానే తయారైంది ప్రస్తుత తరం. సోషల్ మీడియా రాకతో యువతలో రీల్స్​, షార్ట్స్​ పిచ్చి ముదిరింది. దీంతో నదులు, సముద్రాలు, కొండలు, లోయలు, బస్టాండ్​ లు, రైల్వే స్టేషన్లు, రైల్వే ట్రాక్​ లు ఇలా ఒక్కటేమిటి రీల్స్​ తీసుకోవడానికి ఏ ప్రాంతం అనర్హమైనది కాదంటూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. లైకులు, కామెంట్ల కోసం భిన్నంగా రీల్స్​ చేయాలనే ఆరాటంలో జీవితాలను కోల్పోతున్నారు. ఎంతో విలువైన ప్రాణాలను కేవలం ముప్పై సెకన్ల దృశ్యాల కోసం అర్పించేస్తున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే మైసూరులో జరిగింది.

మైసూర్​ లోని దసరా ఏనుగులతో

కర్ణాటకలోని మైసూరులో దసరా పండగ చాలా ప్రత్యేకం. అందులో జంబూ సవారీ అత్యంత వైభవంగా జరిగే కార్యక్రమం. ఈ ఉత్సవాలకు ఏనుగులను తీసుకొచ్చారు. అయితే ఆ ఏనుగులతో ఓ యువతి అత్యంత ప్రమాదకరంగా రీల్స్​ తీసి సోషల్ మీడియాలో పెట్టింది. దీంతో నెటిజన్ల నుంచి భిన్నమైన స్పందనలు వచ్చాయి.

ఏనుగులను చూసే మావటీలు తప్ప ఇతరులు ఏనుగుల దగ్గరికి వెళ్లాలంటనే హడలెత్తిపోతారు. అలాంటిది ఎటువంటి రక్షణ చర్యలు లేకుండా ఓ యువతి రాత్రి సమయంలో వాటి దగ్గరికి వెళ్లి పిచ్చిగా డ్యాన్స్ చేసి రీల్స్​ తీసుకొని వాటిని సోషల్ మీడియాలో అప్​ లోడ్​ చేసింది. అవి చాలా వైరల్ అయ్యాయి. దీంతో కర్ణాటకలో పెద్ద దుమారం రేగింది. అక్కడ ఉన్న సిబ్బంది కూడా ఆమెను అడ్డుకోకపోవడంతో వారిపై అటవీ శాఖ అధికారులు చర్యలకు ఉపక్రమించారు. అలాగే ఆ వీడియోను సోషల్ మీడియా మాధ్యమాల్లో నుంచి తొలగించారు. కేసు నమోదు చేసుకొని ఆ యువతి వివరాలు రాబట్టే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు.