
రబీ సీజన్కు ఎరువుల ధరలపై కేంద్రం భరోసా: డీఏపీ ధర రూ.1350కే పరిమితం
పశ్చిమాసియాలో యుద్ద ప్రభావంతో అంతర్జాతీయ మార్కెట్లో ఎరువుల ధరలు మారుతూ ఉండడంతో భారత రైతులపై అదనపు భారం పడకుండా కేంద్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటోంది అని రాజ్యసభలో సభ్యులు సంజయ్ సింగ్, సుశీల్ కుమార్ మోడీ అడిగిన ప్రశ్నకు సమాధానంగా కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖ సహాయ మంత్రి అనుప్రియా పటేల్ మార్చి 10, 2026న లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు.
మంత్రి అనుప్రియా పటేల్ తెలిపిన వివరాల ప్రకారం, రబీ 2025-26 పంటల సీజన్ను దృష్టిలో పెట్టుకుని రైతులకు ఎరువులు అందుబాటులో ఉండేలా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. అంతర్జాతీయ మార్కెట్లో ఎరువుల ధరలు మారుతూ ఉన్నప్పటికీ రైతులపై అదనపు భారం పడకుండా డై-అమ్మోనియం ఫాస్ఫేట్ ఎరువు గరిష్ట చిల్లర ధరను 50 కిలోల సంచికి రూ.1350గా కొనసాగిస్తున్నట్లు కేంద్ర రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ ప్రకటించిందని తెలిపారు. ఈ చర్య రైతులకు ఆర్థిక భరోసా కల్పించడమే కాకుండా దేశంలో ఎరువుల సరఫరా వ్యవస్థను స్థిరంగా ఉంచడంలో కీలకంగా నిలుస్తుందని ప్రభుత్వం పేర్కొంది.
డీఏపీ ధరను స్థిరంగా ఉంచేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ప్రతి మెట్రిక్ టన్నుకు రూ.3500 వరకు అదనపు వ్యయాన్ని భరిస్తోంది. ఈ మొత్తంలో ఫ్యాక్టరీ నుంచి రైతుల వరకు రవాణా ఖర్చులు, జీఎస్టీ సంబంధిత వ్యయాలు, అలాగే తయారీదారులకు సుమారు 4 శాతం సమంజసమైన లాభం కూడా చేర్చబడ్డాయి. అంతర్జాతీయ మార్కెట్లో ఎరువుల ధరలు పెరిగినా రైతులకు అదే ధరలో అందించేందుకు ప్రభుత్వం ఈ విధానాన్ని అమలు చేస్తోందని ఆమె పేర్కొన్నారు.
కేంద్ర ప్రభుత్వం తెలిపిన వివరాల ప్రకారం, దేశవ్యాప్తంగా ఫాస్ఫేటిక్, పొటాషిక్ ఎరువుల నిల్వలు ప్రస్తుతం సరిపడా స్థాయిలో ఉన్నాయి. 2026 మార్చి 5 నాటికి దేశవ్యాప్తంగా డీఏపీ అవసరం 51.38 లక్షల మెట్రిక్ టన్నులు కాగా, అందుబాటులో ఉన్న నిల్వలు 71.89 లక్షల మెట్రిక్ టన్నులుగా ఉన్నాయి. అదే విధంగా మ్యూరియేట్ ఆఫ్ పొటాష్ ఎరువుల అవసరం 14.18 లక్షల మెట్రిక్ టన్నులు ఉండగా, అందుబాటులో ఉన్న నిల్వలు 18.17 లక్షల మెట్రిక్ టన్నులుగా నమోదయ్యాయి. అలాగే ఎన్పికేఎస్ ఎరువులు అవసరం 76.48 లక్షల మెట్రిక్ టన్నులు కాగా, ప్రస్తుతం దేశంలో 108.39 లక్షల మెట్రిక్ టన్నులు నిల్వగా ఉన్నట్లు మంత్రి అనుప్రియా పటేల్ వెల్లడించారు.
ఎరువుల సరఫరా వ్యవస్థను సమర్థవంతంగా నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం ఆధునిక డిజిటల్ వ్యవస్థలను కూడా ఉపయోగిస్తోంది. ఇంటిగ్రేటెడ్ ఫర్టిలైజర్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనే ఆన్లైన్ ప్లాట్ఫారమ్ ద్వారా సబ్సిడీ ఉన్న ఎరువుల రవాణా, నిల్వలు, పంపిణీ వంటి అంశాలను రియల్ టైమ్లో పర్యవేక్షిస్తున్నారు. అదనంగా రాష్ట్రాలకు ఎరువులు సమయానికి చేరేందుకు రైల్వే మంత్రిత్వ శాఖతో సమన్వయం చేస్తూ రేక్ల కదలికను ప్రాధాన్యంగా నిర్వహిస్తున్నామన్నారు.
ఇదిలా ఉండగా, రైతులు సమతుల పోషకాలను వినియోగించేందుకు కేంద్ర ప్రభుత్వం న్యూట్రియంట్ బేస్డ్ సబ్సిడీ విధానాన్ని మరింత విస్తరించింది. ఈ విధానం కింద 10:26:26, 12:32:16 వంటి అదనపు ఎరువుల గ్రేడ్లను చేర్చారు. నైట్రోజన్ (ఎన్), ఫాస్ఫరస్ (పీ), పొటాష్ (కే) శాతం ఆధారంగా సబ్సిడీ అందించడం ద్వారా రైతులు తమ పంటలు నేల అవసరాలకు అనుగుణంగా సరైన ఎరువులను ఎంచుకునే అవకాశం ఉంటుంది. ఈ విధానం యూరియా అధిక వినియోగాన్ని తగ్గించడంతో పాటు నేల ఆరోగ్యాన్ని కాపాడడంలో కూడా సహాయపడుతుంది.
ప్రస్తుతం 2025-26 కాలానికి సంబంధించి కొన్ని ముఖ్య ఎరువుల సగటు చిల్లర ధరలు కూడా వెల్లడించారు. ఎన్పీకే 10-26-26 ఎరువు ధర 50 కిలోల సంచికి సగటుగా రూ.1814.82, ఎన్పీకే 12-32-16 ధర రూ.1711.87, అలాగే మ్యూరియేట్ ఆఫ్ పొటాష్ ధర రూ.1710.54గా ఉన్నట్లు మంత్రి అనుప్రియా పటేల్ తన సమాధానంలో తెలిపారు
