
యూకీ బాంబ్రీ సరికొత్త రికార్డు
భారత టెన్నిస్ స్టార్ యూకీ బాంబ్రీ తన కెరీర్లో అరుదైన మైలురాయిని చేరుకున్నాడు. ప్రతిష్టాత్మకమైన ఏటీపీ మాస్టర్స్ 1000 టోర్నీలో తొలిసారి సెమీఫైనల్కు దూసుకెళ్లి రికార్డు సృష్టించాడు. గురువారం జరిగిన పురుషుల డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో యూకీ బాంబ్రీ తన స్వీడన్ భాగస్వామి ఆండ్రీ గోరాన్సన్తో కలిసి అద్భుత విజయాన్ని నమోదు చేశాడు. గంటన్నరకు పైగా సాగిన హోరాహోరీ పోరులో ఈ భారత్-స్వీడన్ జోడీ 6-3, 7-6 తేడాతో ఆస్ట్రియాకు చెందిన అలెగ్జాండర్ ఎర్లర్, ఇటలీకి చెందిన ఆండ్రియా వావస్సోరి ద్వయంపై వరుస సెట్లలో విజయం సాధించింది.
సర్వీస్లో పట్టు.. పోరాటంలో ధీటు
ఈ మ్యాచ్లో యూకీ జోడీ తమ సర్వీస్పై పూర్తి పట్టు సాధించి ప్రత్యర్థులకు చుక్కలు చూపించింది. ముఖ్యంగా మొదటి సర్వీస్లో ఏకంగా 83 శాతం పాయింట్లు (29/35) గెలుచుకోవడం వీరి విజయానికి పునాది వేసింది. రెండో సెట్లో ప్రత్యర్థులు గట్టి పోటీ ఇచ్చినప్పటికీ, ఒత్తిడిని అధిగమించి టై-బ్రేకర్ ద్వారా మ్యాచ్ను ముగించారు. 33 ఏళ్ల యూకీ బాంబ్రీకి మాస్టర్స్ 1000 స్థాయిలో క్వార్టర్ ఫైనల్కు చేరడం ఇది మూడోసారి కాగా, గత ఏడాది కూడా ఇండియన్ వెల్స్లో ఈ ఘనత సాధించాడు. అయితే సెమీస్కు చేరడం మాత్రం ఇదే ప్రథమం.
నేడే సెమీఫైనల్ సమరం
శుక్రవారం జరగనున్న సెమీఫైనల్ పోరులో యూకీ-గోరాన్సన్ జోడీ.. ఫ్రాన్స్కు చెందిన ఆర్థర్ రిండర్క్నెచ్, మొనాకోకు చెందిన వాలెంటిన్ వాచెరోట్ ద్వయంతో తలపడనుంది. ఈ ఫ్రాన్స్-మొనాకో జోడీ తమ క్వార్టర్ ఫైనల్లో రష్యాకు చెందిన బలమైన ఆండ్రీ రుబ్లెవ్, కరెన్ ఖచనోవ్ జోడీని 6-3, 6-4తో ఓడించి సెమీస్కు అర్హత సాధించింది. ప్రస్తుత ఫామ్ కొనసాగిస్తే యూకీ బాంబ్రీ ఈసారి ఫైనల్కు చేరి భారత్కు టైటిల్ అందించే అవకాశాలు మెండుగా ఉన్నాయి.
