
మొంథా తుపాను నేపథ్యంలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వ్యతిరేక ర్యాలీలు వాయిదా – వైయస్ జగన్
దక్షిణ ఆంధ్ర తీరం వైపు దూసుకువస్తున్న “మొంథా” తుపాను ప్రభావం నేపథ్యంలో, మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్రెడ్డి ప్రజలకు అప్రమత్తత పాటించాలని విజ్ఞప్తి చేశారు.పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి విడుదల చేసిన ప్రకటనలో, “ప్రజల ప్రాణభద్రతకంటే ముఖ్యమైనది ఇంకేమీ లేదు. తుపాను సమయాల్లో ర్యాలీలు, సమావేశాలు వాయిదా వేసి ప్రజలకు అండగా నిలవడం పార్టీ ధర్మం” అని పేర్కొన్నారు.
వాతావరణ శాఖ హెచ్చరికల ప్రకారం, మొంథా తుపాను తూర్పు గోదావరి, కృష్ణా, గుంటూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాలను ప్రభావితం చేసే అవకాశం ఉంది. భారీ వర్షాలు, ఈదురుగాలులు, సముద్ర మట్టం పెరగడం వంటి పరిస్థితులు తలెత్తే అవకాశం ఉండటంతో, ఆ ప్రాంతాల్లోని ప్రజలు అవసరమైన భద్రతా చర్యలు తీసుకోవాలని వైయస్ జగన్ సూచించారు. “ప్రజల ప్రాణభద్రత అత్యంత ప్రాధాన్యమైనది. ఎవరికీ ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా ప్రభుత్వ యంత్రాంగం, పార్టీ శ్రేణులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలి,” అని ఆయన అన్నారు..
వైఎస్సార్సీపీ కార్యకర్తలకు సూచనలు – సహాయక చర్యల్లో ముందుండండి
తుపాను పరిస్థితుల్లో ప్రజలతోపాటు ఉండాలని, అవసరమైన చోట సహాయక చర్యలు చేపట్టాలని ఆయన పార్టీ నాయకులకు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. వర్షాలు, గాలివానలు, వరదలు ఎదురయ్యే ప్రాంతాల్లో ప్రజలకు సకాలంలో సమాచారం అందించడంతో పాటు, పునరావాసం, ఆహారం, మందులు, ఆశ్రయం వంటి విషయాల్లో పార్టీ శ్రేణులు ముందుండాలని సూచించారు. అలాగే జిల్లా స్థాయిలో కంట్రోల్ రూమ్లతో సమన్వయం, రెడ్ అలర్ట్ జోన్లలో సహాయం, ఆరోగ్య బృందాలతో కలసి సేవలు అందించాలన్నారు. “తుపాను బీభత్సం కంటే ప్రజా ఐక్యత, జాగ్రత్త, సహకారం బలంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు.
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వ్యతిరేక ర్యాలీలు వాయిదా
ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయాలన్న ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా వైఎస్సార్సీపీ అక్టోబర్ 28న రాష్ట్రవ్యాప్తంగా అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లో భారీ ర్యాలీలు నిర్వహించేందుకు సిద్ధమైంది. అయితే మొంథా తుపాను కారణంగా ప్రజా భద్రతను దృష్టిలో ఉంచుకుని, పార్టీ ఈ ర్యాలీలను నవంబర్ 4వ తేదీకి వాయిదా వేసింది. “ప్రతీ మనిషి ప్రాణం విలువైనది. వాతావరణ శాఖ సూచనలు పాటించండి, సముద్రతీర ప్రాంతాల ప్రజలు తీరానికి దగ్గరగా వెళ్లకండి, ప్రభుత్వ యంత్రాంగం ఇచ్చే మార్గదర్శకాలను పాటించండి.” ఈ నిర్ణయం ద్వారా తుపానుతో ప్రభావిత ప్రాంతాల్లో పార్టీ నాయకులు తమ దృష్టిని ప్రజా సేవ, సహాయక చర్యలపై కేంద్రీకరించవచ్చని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.
