Let's talk: editor@tmv.in
మైనారిటీలపై దాడులు చేసే వారితో కేరళం సీఎం భాగస్వామ్యం: రాహుల్‌గాంధీ

మైనారిటీలపై దాడులు చేసే వారితో కేరళం సీఎం భాగస్వామ్యం: రాహుల్‌గాంధీ

Pinjari Chand
5 ఏప్రిల్, 2026

కేరళంలో అధికారంలో ఉన్న ఎల్డీఎఫ్, బీజేపీ మధ్య రహస్య ఒప్పందం ఉందని కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ ఆరోపించారు. దేశంలోని ఇతర ప్రాంతాల్లో మైనారిటీలపై దాడులు చేసే వారితో కేరళ ముఖ్యమంత్రి పినరయ్‌ విజయన్‌కు సంబంధం ఉందని ఆయన విమర్శించారు. కేరళలో ఏప్రిల్‌ 9న జరగనున్న ఎన్నికల ప్రచారంలో భాగంగా అలప్పుజలో జరిగిన సభలో రాహుల్ గాంధీ మాట్లాడారు. మాజీ సీపీఎం నేత జీ.సుధాకరన్‌ తనతో వేదిక పంచుకోవడం ఎల్డీఎఫ్‌లో జరుగుతున్న మార్పులకు సంకేతమని అన్నారు. సుధాకరన్ అంబలపుజ నియోజకవర్గం నుంచి యూడీఎఫ్ మద్దతుతో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారని గుర్తుచేశారు. ఎల్డీఎఫ్‌ ఒకప్పుడు వామపక్ష భావజాలానికి ప్రతీకగా ఉండేదని, అయితే ఇప్పుడు అందులో వామపక్ష లక్షణాలేమీ లేవని విమర్శించారు. ఎన్నికల తర్వాత ఎల్డీఎఫ్‌లో ‘లెఫ్ట్’ అనే పదానికి అర్థమే ఉండదని అన్నారు. ఎల్డీఎఫ్‌ను వెనుక నుంచి నడిపిస్తున్న అదృశ్య హస్తం మత విద్వేషాన్ని ప్రోత్సహిస్తోందని ఆయన ఆరోపించారు. బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌, సీపీఎం మధ్య సంబంధాన్ని కేరళ ప్రజలందరూ గమనిస్తున్నారని పేర్కొన్నారు. ప్రధాని నరేంద్రమోడీ ఇతర రాష్ట్రాల్లో ప్రసంగాల్లో మతం, దేవాలయాల గురించి తరచూ మాట్లాడుతారని, కానీ కేరళలో మాత్రం శబరిమల అంశంపై మౌనం పాటిస్తున్నారని విమర్శించారు.

ధాన్యం రైతులు అప్పులు కూరుకుపోయారు

దేశంలోని పలు ప్రాంతాల్లో మైనారిటీలపై దాడులు జరుగుతున్నాయని ఆరోపించారు. ఛత్తీస్‌గఢ్‌లో కేరళకు చెందిన ఇద్దరు సన్యాసినులపై దాడి జరిగిందని, మణిపూర్‌లో చర్చిలు దగ్ధమయ్యాయని పేర్కొన్నారు. ఇలాంటి దాడులు చేసే వారితోనే కేరళం సీఎం భాగస్వామ్యం ఉందని అన్నారు. దీర్ఘకాలంగా అధికారంలో ఉన్నందున మోడీ, విజయన్ ఇద్దరూ ప్రజల నుంచి దూరమయ్యారని విమర్శించారు. అధికారం మత్తులో వారు అహంకారంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. కేరళం ఇప్పుడు మాదకద్రవ్యాల కేంద్రంగా మారిందని, రాష్ట్రంలోని 75 శాతం ధాన్యం రైతులు అప్పుల్లో కూరుకుపోయారని ఆయన పేర్కొన్నారు. కోయిర్ పరిశ్రమ దెబ్బతిందని, సుమారు 1.3 లక్షల కార్మికులు ఉపాధి కోల్పోయారని గుర్తు చేశారు. అమెరికాతో జరిగిన వాణిజ్య ఒప్పందంపై కూడా ఆయన విమర్శలు చేశారు. ఇది చిన్న రైతులకు తీవ్ర ప్రభావం చూపుతుందని అన్నారు. అంతేకాక మధ్యప్రాచ్యంలో నెలకొన్న పరిస్థితుల వల్ల ఇంధన కొరత తలెత్తే అవకాశం ఉందని చెప్పారు. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ అధికారంలోకి వస్తే మహిళలకు కేఎస్ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తామని, కాలేజీ విద్యార్థినులకు నెలకు రూ.1,000 భత్యం అందిస్తామని రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు. మహిళలే కేరళ సమాజానికి వెన్నెముక అని ఆయన అన్నారు.

రైతులకు సరైన మద్దతు లేదు

ఇడుక్కిలో జరిగిన మరో ఎన్నికల సభలో రాహుల్ గాంధీ వ్యవసాయం, భూమి హక్కులు, మనిషి–జంతువుల మధ్య ఘర్షణ వంటి స్థానిక సమస్యలను ప్రస్తావిస్తూ ఎల్డీఎఫ్ ప్రభుత్వాన్ని విమర్శించారు. చాయ్, రబ్బరు, యాలకులు వంటి పంటలు తగ్గుముఖం పట్టాయని, రైతులకు సరైన మద్దతు లభించడం లేదని అన్నారు. భూమిపై హక్కులు లేక వేలాది కుటుంబాలు ఇళ్ల నిర్మాణం లేదా సాగు చేయలేని పరిస్థితి ఉందని ఆయన ఆరోపించారు. ఇడుక్కిలో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి లేకపోవడంతో ప్రజలు చికిత్స కోసం కొట్టాయం వెళ్లాల్సి వస్తోందని తెలిపారు. నేను కేరళలో జన్మించలేదు కానీ ఇప్పటికే కేరళవాసినే అని పేర్కొంటూ కాంగ్రెస్ పార్టీ ఐదు హామీలు మహిళలను శక్తివంతం చేస్తాయని ఆయన అన్నారు.