Let's talk: editor@tmv.in
మెల్‌బోర్న్‌లో జోరు కొనసాగించేందుకు భారత్ సిద్ధం

మెల్‌బోర్న్‌లో జోరు కొనసాగించేందుకు భారత్ సిద్ధం

Sandhula Dinesh
31 అక్టోబర్, 2025

కాన్‌బెర్రాలో వర్షం అడ్డుకున్నా, మొదటి టీ20లో ఆధిపత్యం చూపిన భారత్... ఇప్పుడు మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌లో రెండో మ్యాచ్‌కు సిద్ధమవుతోంది. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో ఒక్క అడుగు ముందుండటంతో, జట్టు ఉత్సాహం ఆకాశాన్నంటుతోంది. శుక్రవారం జరిగే ఈ పోరులో విజయం సాధిస్తే సిరీస్‌పై పట్టు సాదిస్తుంది.

మొదటి మ్యాచ్‌లో 9.4 ఓవర్లలోనే 97/1తో ఆధిపత్యం దక్కించుకున్న భారత్... వర్షం కారణంగా ఆట ముగిసిపోయింది. అయినా, ఆ ఆటలో భారత ఆటతీరు ఆకట్టుకుందనే చెప్పాలి. ఇటీవల ఫామ్‌కు దూరమైన కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ 24 బంతుల్లో 39 పరుగులు సాధించి సత్తా చాటాడు. జాష్ హెజిల్‌వుడ్ బౌలింగ్‌లో 125 మీటర్ల సిక్సర్ బాది అందరినీ ఆశ్చర్యపరిచాడు. టీ20లలో ప్రపంచంలోనే అత్యంత డేంజరస్ బ్యాటర్‌గా తన స్థానాన్ని మరోసారి నిరూపించుకున్నాడు.

ప్రస్తుతం మెల్‌బోర్న్‌లోనూ వర్షం ముప్పు కొనసాగుతోంది. అయినప్పటికీ, సూర్యకుమార్ నేతృత్వంలోని జట్టు భయపడకుండా ఆడే వ్యూహాన్ని అమలు చేయడానికి కట్టుబడి ఉంది. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఆదేశాల మేరకు ‘భయం లేని క్రికెట్’ను ఆడుతున్న భారత్... 200 పైగా స్కోరు చేయడానికే ప్రాధాన్యం ఇస్తోంది. ‘సురక్షితంగా ఆడి తక్కువ స్కోరుతో ఓడిపోవడం కంటే, ధైర్యంగా ఆడి అన్నీ అవుటైనా మాకు మంచిదే’ అని గంభీర్ స్పష్టం చేశాడు. ఈ విధానం భారత టీ20 జట్టుకు కొత్త ఊపిరి పోసింది. మరికొన్ని నెలల్లో భారత్-శ్రీలంకలో జరగబోయే టీ20 ప్రపంచకప్‌లో టైటిల్ డిఫెండ్ చేయాలన్న లక్ష్యంతో ఇప్పుడే సన్నాహాలు చేస్తుంది.

అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, శివమ్ దూబెలు యువ శక్తిగా రాణిస్తున్నారు. వీరి దూకుడు బ్యాటింగ్ భారత ఆర్డర్‌కు ఎంతో సహాయపడుతుంది. సూర్య ఫామ్‌లోకి వచ్చినందున, ప్రపంచకప్ ముందు బెస్ట్ కాంబినేషన్‌ను ఎంచుకోవడం సులువైంది.

బౌలింగ్‌లో జస్ప్రీత్ బుమ్రా ఖచ్చితంగా ఉంటాడు. వరుణ్ చక్రవర్తి మిస్టరీ, కుల్దీప్ యాదవ్ క్రాఫ్ట్... అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్‌లతో కలిసి భారత బౌలింగ్ లైనప్ ప్రపంచంలోనే అత్యంత బలమైనదిగా నిలుస్తోంది. బ్యాటింగ్ పిచ్ అయినా సమర్థవంతంగా డిఫెండ్ చేయగల సత్తా ఉంది.

ఆస్ట్రేలియాకు మాత్రం సవాలు ఎక్కువ. కెప్టెన్ మిచెల్ మార్ష్, ట్రావిస్ హెడ్ నేతృత్వంలో మార్కస్ స్టొయినిస్, టిమ్ డేవిడ్, జాష్ ఇంగ్లిస్‌లు బ్యాటింగ్‌కు బలం. కానీ బౌలింగ్‌లో మిచెల్ స్టార్క్ టీ20ల నుంచి రిటైర్మెంట్, ప్యాట్ కమిన్స్ గాయం నుంచి కోలుకోవడంతో... జాష్ హెజిల్‌వుడ్‌కు యువ పేసర్లు జేవియర్ బార్ట్‌లెట్, నాథన్ ఎల్లిస్, మాథ్యూ కుహ్నెమాన్‌ల పై ఆధారపడాల్సి ఉంది.

రెండు జట్లూ దూకుడు ఆటతీరును అనుసరిస్తున్నందున, వర్షం అడ్డురాకపోతే అద్భుతమైన పోటీ ఉంటుంది. భారత్‌కు ఇది సిరీస్ ఆధిపత్యం మాత్రమే కాదు... ప్రపంచకప్ ముందు ఆత్మవిశ్వాసం, రిథమ్, స్పష్టత సాధించే అవకాశం. ఎంసీజీ పిచ్ బౌన్స్, క్యారీకి అనుకూలంగా ఉంటుంది. బ్యాటర్లకూ, పేసర్లకూ సమాన అవకాశం. అయితే వర్షాలు మళ్లీ అడ్డుపడే అవకాశం ఉంది. ఇక రేపు మ్యాచ్ మధ్యాహ్నం ఓంటి గంట 45 నిమిషాలకు సోనీ స్పోర్ట్స్‌లో ప్రసారం కానుంది.

భారత జట్టు: సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, శుభ్‌మన్ గిల్ (వైస్ కెప్టెన్), తిలక్ వర్మ, నితీష్ కుమార్ రెడ్డి, శివమ్ దూబె, అక్షర్ పటేల్, జితేష్ శర్మ (వికెట్ కీపర్), వరుణ్ చక్రవర్తి, జస్ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా, సంజూ శాంసన్ (వికెట్ కీపర్), రింకూ సింగ్, వాషింగ్టన్ సుందర్.

ఆస్ట్రేలియా జట్టు: మిచెల్ మార్ష్ (కెప్టెన్), షాన్ అబాట్, జేవియర్ బార్ట్‌లెట్, మహ్లీ బేర్డ్‌మన్, టిమ్ డేవిడ్, నాథన్ ఎల్లిస్, జాష్ హెజిల్‌వుడ్, గ్లెన్ మాక్స్‌వెల్, ట్రావిస్ హెడ్, జాష్ ఇంగ్లిస్, మాథ్యూ కుహ్నెమాన్, మిచెల్ ఓవెన్, జాష్ ఫిలిప్, తన్వీర్ సంఘ, మాథ్యూ షార్ట్, మార్కస్ స్టొయినిస్.