Let's talk: editor@tmv.in
మెరుగైన విద్యావ్యవస్థే లక్ష్యంగా ప్రతీ ఏటా డీఎస్సీ

మెరుగైన విద్యావ్యవస్థే లక్ష్యంగా ప్రతీ ఏటా డీఎస్సీ

FL - SUNL
12 అక్టోబర్, 2025

విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతీ ఏటా డీఎస్సీ నిర్వహించేందుకు సిద్ధంగా ఉందని ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ తెలిపారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో ఇప్పటికే మెగా డీఎస్సీని విజయవంతంగా నిర్వహించామని అన్నారు. త్వరలోనే ఎంపికైన అభ్యర్థులు రాష్ట్ర వ్యాప్తంగా వివిధ పాఠశాలల్లో సేవలందిస్తారని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలతో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు కార్పొరేట్ పాఠశాల విద్యార్థులతో పోటీ పడుతున్నారని స్పష్టం చేశారు. విద్యార్థులకు సంబంధించి ఎలాంటి కార్యక్రమాలు జరిగిన రాజకీయ వాతావరణానికి దూరంగా చేస్తున్నామని అన్నారు. గత ప్రభుత్వంలో మాదిరిగా ఏ కార్యక్రమంలో కూడా రాజకీయ నాయకులు ఫోటోలు, పార్టీ గుర్తులు, రంగులు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని తెలిపారు. గతంతో పోల్చితే ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో డ్రాపౌట్ల సంఖ్య తగ్గుముఖం పట్టిందన్నారు. శనివారం అద్దంకి నియోజకవర్గంలోని జె.పంగులూరు మండలం కొండమంజులూరు గ్రామంలో మంత్రి గొట్టిపాటి రవి కుమార్ పర్యటించారు. స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల చెందిన 356 విద్యార్థులకు సైకిళ్ల ను మంత్రి గొట్టిపాటి రవి కుమార్ ఉచితంగా పంపిణీ చేశారు. సెయిల్ ఎనర్జీ ఇండియా లిమిటెడ్ సీఎస్ఆర్ నిధుల సహకారంతో నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలల్లో సుమారు 1000 సైకిళ్లు అందించనున్నట్లు వివరించారు. ఇప్పటికే దాతల సహకారంతో నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టినట్లు మంత్రి గొట్టిపాటి స్పష్టం చేశారు. అనంతరం దాతల సహకారంతో నూతనంగా నిర్మించిన డైనింగ్ హాలును మంత్రి ప్రారంభించారు. అంతేగాకుండా రూ.15.58 లక్షలతో ఏర్పాటు చేసిన కెమిస్ట్రీ ల్యాబ్ ను ప్రారంభించారు. ముందుగా గ్రామంలో రూ.65 ల‌క్ష‌ల‌తో నూత‌నంగా నిర్మించిన అంత‌ర్గ‌త సీసీ రోడ్లు, సైడ్ డ్రైనేజ్ కాలువ‌ల‌ను మంత్రి గొట్టిపాటి ప్రారంభించారు. కొండ‌మంజులూరు గ్రామంలో ఏర్పాటు చేసిన స‌భ‌లో 57 మంది ల‌బ్ధిదారుల‌కు ముఖ్య‌మంత్రి స‌హాయ నిధి చెక్కుల‌ను, ఎల్వోసీల‌ను మంత్రి గొట్టిపాటి ల‌బ్ధిదారుల‌కు పంపిణీ చేశారు. ఈ సంద‌ర్భంగా మంత్రి గొట్టిపాటి మాట్లాడుతూ... సీఎం చంద్ర‌బాబు నాయుడు ప్ర‌వేశ పెట్టిన పీ4 ప‌థ‌కంలో అవ‌కాశం ఉన్న ప్ర‌తి ఒక్క‌రూ భాగ‌స్వాములు కావాల‌ని పిలుపునిచ్చారు. పీ4 ద్వారా స‌మాజానికి సేవ చేసే చ‌క్క‌టి అవ‌కాశం ల‌భిస్తుంద‌ని తెలిపారు. అనంత‌రం గ్రీవెన్స్ నిర్వ‌హించి ప్ర‌జ‌ల నుంచి అర్జీల‌ను స్వీక‌రించారు. అర్జీల రూపంలో వ‌చ్చిన‌ ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌ను త్వ‌ర‌గా ప‌రిష్క‌రించాల‌ని ఈ సంద‌ర్భంగా అధికారుల‌ను మంత్రి గొట్టిపాటి ఆదేశించారు.