
మెట్పల్లిలో జనసేన ఎన్నికల ప్రచారం.. 'గబ్బర్సింగ్' టీం ప్రత్యేక ఆకర్షణ!
మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో జగిత్యాల జిల్లా మెట్పల్లిలో ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. శనివారం జనసేన పార్టీ అభ్యర్థుల తరఫున నిర్వహించిన ర్యాలీకి ప్రజల నుంచి మంచి స్పందన లభించింది. ఈ ర్యాలీలో పవన్ కల్యాణ్ సూపర్ హిట్ చిత్రం ‘గబ్బర్సింగ్’ సినిమా టీం పాల్గొనడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. నటుల రాకతో జనసేన శ్రేణుల్లో ఉత్సాహం ఉరకలెత్తింది.
సినీ నటుల రాకతో కార్యకర్తలు, అభిమానుల్లో ఉత్సాహం పెరిగి, యువత పెద్ద సంఖ్యలో హాజరై సెల్ఫీలు తీసుకోవడానికి ఆసక్తి చూపించారు. ర్యాలీ సందర్భంగా జనసేన నాయకులు మాట్లాడుతూ, మెట్పల్లి మున్సిపాలిటీలో అభివృద్ధి కోసం 12 వార్డుల్లో జనసేన అభ్యర్థిని గెలిపించాలని నటులు ప్రజలను కోరారు. ఫిబ్రవరి 11న జరగనున్న పోలింగ్ను దృష్టిలో ఉంచుకుని పట్టణంలో ఎన్నికల సందడి నెలకొంది. పట్టణ వీధులన్నీ జనసేన జెండాలతో, నినాదాలతో హోరెత్తాయి. వివిధ రాజకీయ పార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేయడంతో మెట్పల్లిలో ఎన్నికల వాతావరణం మరింత ఉత్సాహంగా మారింది.
