
మూసీ పునరుజ్జీవనంపై కేబినెట్ సబ్ కమిటీ: ఛైర్మన్గా డిప్యూటీ సీఎం
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మూసీ నది పునరుజ్జీవన ప్రాజెక్టును వేగవంతం చేసేందుకు ఒక ఉన్నత స్థాయి కేబినెట్ ఉపసంఘాన్ని ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మూసీ నది ప్రక్షాళన, పర్యావరణ పునరుద్ధరణ నది పరివాహక ప్రాంత అభివృద్ధిని ఈ కమిటీ పర్యవేక్షించనుంది.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ఏర్పాటు చేసిన ఈ కమిటీకి ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఛైర్మన్గా వ్యవహరిస్తారు. సభ్యులుగా ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్. మూసీ రివర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ ఈ కమిటీకి కన్వీనర్గా వ్యవహరిస్తారు.
ఈ కేబినెట్ ఉపసంఘం ప్రధానంగా నాలుగు కీలక అంశాలపై దృష్టి సారించనుంది. మూసీ నది పర్యావరణ వ్యవస్థను తిరిగి జీవం పోయడం. అలాగే వర్షాకాలంలో వరద ముప్పును అరికట్టేందుకు శాశ్వత పరిష్కారాలు కనుగొనడం, నదిలోకి మురుగునీరు చేరకుండా అధునాతన ఎస్టీపీల నిర్వహణను పర్యవేక్షించడం. నది వెంబడి పర్యాటక రంగం, మౌలిక వసతులను అభివృద్ధి చేయడం వంటి అంశాలపై దృష్టి సారిస్తుంది. ఈ ప్రాజెక్టు ప్రణాళికా రచన, వివిధ శాఖల మధ్య సమన్వయం, క్షేత్రస్థాయిలో అమలును ఈ కమిటీ నిరంతరం పర్యవేక్షిస్తుంది. మూసీ నదిని అంతర్జాతీయ స్థాయిలో ప్రఖ్యాత నదీ తీరాల తరహాలో తీర్చిదిద్దడమే ప్రభుత్వ ప్రధాన ఉద్దేశ్యం.
