Let's talk: editor@tmv.in
ముగిసిన రెండో ద‌శ‌ పంచాయతీ ఎన్నికలు

ముగిసిన రెండో ద‌శ‌ పంచాయతీ ఎన్నికలు

Gaddamidi Naveen
15 డిసెంబర్, 2025

తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికల రెండో దశ పోలింగ్ ఆదివారం విజయవంతంగా ముగిసింది. ఈ దశలో 85 శాతానికి పైగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని రాష్ట్ర ఎన్నికల కమిషన్ (ఎస్‌ఈసీ) వెల్లడించింది. మొత్తం పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా జరిగిందని అధికారులు తెలిపారు. పోలింగ్ ముగిసిన వెంటనే ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది.

రాష్ట్రవ్యాప్తంగా రెండో దశలో నిర్వహించిన ఎన్నికల్లో 54,40,339 మంది అర్హులైన ఓటర్లలో 46,70,972 మంది ఓటు వేసి 85.86 శాతం పోలింగ్ నమోదు చేశారు. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ కొనసాగింది. ఈ దశలో 3,911 గ్రామ పంచాయతీ సర్పంచ్ పదవులతో పాటు 29,917 వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికలు నిర్వహించారు.

సర్పంచ్ పదవుల కోసం మొత్తం 12,782 మంది అభ్యర్థులు బరిలోకి దిగగా, వార్డు సభ్యుల స్థానాల కోసం 71,071 మంది నామినేషన్లు దాఖలు చేశారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రక్రియను ప్రారంభించారు. పోలింగ్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోలేదని అదనపు డీజీపీ (లాండ్ అండ్ ఆర్డర్) మహేష్ ఎం. భగవత్ తెలిపారు.

ఖమ్మం జిల్లాలో రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు ఆరు మండలాల్లో ప్రశాంతంగా నిర్వహించామని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. ఎన్నికల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోలేదని, పోలింగ్ ప్రక్రియ పూర్తిగా సజావుగా సాగిందని ఆయన పేర్కొన్నారు.ఈ విడతలో ఖమ్మం జిల్లాలోని 6 మండలాల్లో ఉన్న మొత్తం 160 గ్రామ పంచాయతీల పరిధిలో 1,379 వార్డులకు పోలింగ్ నిర్వహించారు. అర్హులైన ఓటర్లలో 91.21 శాతం మంది తమ ఓటు హక్కును వినియోగించుకోవడం విశేషమని కలెక్టర్ తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో ఓటర్ల ఉత్సాహం స్పష్టంగా కనిపించిందని ఆయన అన్నారు.

డిసెంబర్ 11న జరిగిన తొలి దశ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో 84.28 శాతం పోలింగ్ నమోదైంది. రాష్ట్ర ఎన్నికల కమిషన్ మూడు దశల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలను నిర్వహించాలని షెడ్యూల్ ప్రకటించగా, మూడో దశ పోలింగ్ డిసెంబర్ 17న జరగనుంది.

ఇటీవల జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిన నేపథ్యంలో, గ్రామ పంచాయతీ ఎన్నికలు కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బీజేపీ పార్టీల ప్రజాదరణకు కీలక పరీక్షగా రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. కాగా, స్థానిక సంస్థల్లో వెనుకబడిన తరగతులకు 42 శాతం రిజర్వేషన్ అమలు అంశంపై న్యాయపరమైన అడ్డంకులు ఎదురవడంతో, గ్రామ పంచాయతీలకు మాత్రమే ఎన్నికలు నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నవంబర్ 17న నిర్ణయించింది. జెడ్పీటీసీ సభ్యులు తదితర గ్రామీణ స్థానిక సంస్థల ఎన్నికలను తాత్కాలికంగా వాయిదా వేసింది.

ముగిసిన రెండో ద‌శ‌ పంచాయతీ ఎన్నికలు - Tholi Paluku