
మారుతున్న సవాళ్లకు అనుగుణంగా పోలీసు వ్యవస్థలో మార్పులు రావాలి: సీఎం చంద్రబాబు
మారుతున్న కాలానికి, ఉద్భవిస్తున్న కొత్త సవాళ్లకు అనుగుణంగా పోలీసు వ్యవస్థను పునర్వ్యవస్థీకరించాల్సిన అవసరం ఉందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. ప్రతీ పోలీసు అధికారికి డిజిటల్ పరిజ్ఞానం ఎంతో కీలకమని, నేరాల నియంత్రణలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సాంకేతికతను భాగస్వామ్యం చేయాలని సూచించారు.
గురువారం రాత్రి ముగిసిన మూడ్రోజుల ‘ఏపీ పోలీస్ రిట్రీట్ 2026’ ముగింపు సమావేశంలో సీఎం ప్రసంగించారు. సాంకేతిక ఆధారిత, ప్రజా కేంద్రీకృత పోలీసింగ్ నిర్మాణానికి సీనియర్ ఐపీఎస్ అధికారులు అందించిన సిఫార్సులు, వ్యూహాలపై ఆయన సమీక్షించారు.
ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. సైబర్ నేరాలు, సోషల్ మీడియా వేధింపులు, మహిళలపై అరాచకాలు, గంజాయి/డ్రగ్స్ నిరోధం, నిందితులకు శిక్షలు పడేలా చేసే ప్రక్రియపై పోలీసులకు ప్రత్యేక శిక్షణ, సర్టిఫికేషన్ కోర్సులు ప్రవేశపెట్టాలని ప్రతిపాదించారు. అలాగే, అదనపు ప్రైవేటు/రక్షణ అనుభవం కోసం ఆంధ్రప్రదేశ్ స్పెషల్ పోలీస్ (ఏపీఎస్పీ) ట్రైనీలను తాత్కాలికంగా జిల్లా పోలీసు యూనిట్లలో డిప్యూటేషన్పై పనిచేయించే ఆలోచనను పరిశీలించాలని చెప్పారు. కొత్త సాంకేతికతలు, ఉత్తమ పద్ధతులను తెలుసుకునేందుకు సీనియర్ అధికారులు విశ్వవిద్యాలయాల ప్రొఫెసర్లు, రంగానికి చెందిన నిపుణులతో నిరంతరం చర్చలు జరపాలన్నారు. నేరాల నివారణతో పాటు పాత నేరస్థులపై నిఘా ఉంచి వారిని సంస్కరించడంపై దృష్టి సారించాలని, హెడ్ కానిస్టేబుళ్లు, ఏఎస్ఐల సుదీర్ఘ అనుభవాన్ని పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని సీఎం ఆదేశించారు.
