
మాటలతో కాదు.. ఆటతోనే చూపిస్తాడు: కోహ్లిపై శ్రేయస్ అయ్యర్ ప్రశంసలు
న్యూజిలాండ్తో జరిగిన మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ తొలి మ్యాచ్లో విరాట్ కోహ్లీ ఆడిన అద్భుత ఇన్నింగ్స్ తర్వాత, భారత వైస్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ తన సహచరుడు కోహ్లీపై ప్రశంసల జల్లు కురిపించాడు. కోటాంబి లోని బీసీఏ స్టేడియంలో ఆదివారం జరిగిన ఈ మ్యాచ్లో 301 పరుగుల లక్ష్యాన్ని భారత్ విజయవంతంగా ఛేదించింది. విరాట్ కోహ్లీ 91 బంతుల్లో 93 పరుగులు చేసి భారత్కు నాలుగు వికెట్ల తేడాతో విజయం అందించాడు. ఈ ఇన్నింగ్స్లో అతడు 8 ఫోర్లు, ఒక సిక్సర్ బాదాడు. ఈ గెలుపుతో భారత్ సిరీస్లో 1-0 ఆధిక్యం సాధించింది. విరాట్ ఇన్నింగ్స్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఎన్నో ఏళ్లుగా అతడిని చూస్తున్నాం… అదే స్థిరత్వం. స్ట్రైక్ను చక్కగా రొటేట్ చేయడం, బౌలర్లపై ఆధిపత్యం చూపించడం—ఇవన్నీ అతడు ఆటలోనే చూపిస్తాడు. అతడు నిజంగా మాటలకే కాదు, ఆటతోనే చూపిస్తాడని అయ్యర్ అన్నాడు. జట్టులోకి మళ్లీ తిరిగి రావడంపై కూడా అయ్యర్ స్పందించాడు. సిరీస్ను గెలుపుతో ప్రారంభించడం ఎంతో సంతోషంగా ఉందని పేర్కొన్నాడు. ఇది కోహ్లీకి 50 ఓవర్ల క్రికెట్లో వరుసగా ఏడవ 50కు పైగా స్కోరు కావడం గమనార్హం. గతేడాది అక్టోబర్లో ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్ మూడో మ్యాచ్ నుంచి అతడు నిరంతరం అర్ధశతకాలకు పైగా స్కోర్లు చేస్తూ వస్తున్నాడు. ఈ ఏడు ఇన్నింగ్స్లలో కోహ్లీ మూడు శతకాలు సాధించాడు (వన్డేల్లో రెండు, విజయ్ హజారే ట్రోఫీలో ఒకటి). అతడి తాజాగా సాధించిన స్కోర్లు: 93, 77, 131, 65, 102, 135, 74.
సంగక్కరను వెనక్కు నెట్టిన కోహ్లి
93 పరుగుల ఇన్నింగ్స్తో కోహ్లీ మరో చరిత్ర సృష్టించాడు. కుమార్ సంగక్కర (28,016 పరుగులు) రికార్డును అధిగమించి, అంతర్జాతీయ క్రికెట్లో అన్ని ఫార్మాట్లలో కలిపి రెండో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. సచిన్ టెండూల్కర్ తర్వాతి స్థానంలో ఉన్నాడు. ఇప్పటివరకు 557 మ్యాచ్లు ఆడిన కోహ్లీ 28,068 పరుగులు సాధించాడు. అతడి సగటు 52.66 కాగా, మొత్తం 84 శతకాలు ఖాతాలో ఉన్నాయి. భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) విడుదల చేసిన వీడియోలో శ్రేయస్ అయ్యర్, కోహ్లీ ఆటతీరును ప్రత్యేకంగా ప్రశంసించాడు. సిరీస్కు ఇది అద్భుతమైన ఆరంభం. కొంతకాలం తర్వాత మళ్లీ జట్టులోకి రావడం చాలా ఆనందంగా ఉంది. మళ్లీ అందరితో కలిసి డ్రెస్సింగ్ రూమ్లో ఉండటం ప్రత్యేకమైన అనుభూతి. ఈ భావనను చాలా కాలంగా మిస్ అయ్యాను. తిరిగి రావడం ఆనందంగా ఉంది అని శ్రేయస్ అయ్యర్ తెలిపారు.
