Let's talk: editor@tmv.in
మాజీ అగ్నివీరులకు ప్రైవేట్ ఉద్యోగాలు: రాష్ట్రాలకు కేంద్రం సూచన

మాజీ అగ్నివీరులకు ప్రైవేట్ ఉద్యోగాలు: రాష్ట్రాలకు కేంద్రం సూచన

Shaik Mohammad Shaffee
29 అక్టోబర్, 2025

అగ్నిపథ్ పథకం కింద నాలుగేళ్ల సర్వీసును పూర్తి చేసుకున్న మాజీ అగ్నివీరులకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం మరో కీలక ముందడుగు వేసింది. ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీలు, శిక్షణ సంస్థల్లో మాజీ అగ్నివీరులను విధిగా నియమించుకునేలా చూడాలని కేంద్రం అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను కోరింది. సైనిక దళాలలో పనిచేసిన అనుభవం వారికి ఉండటమే ఈ నిర్ణయానికి ప్రధాన కారణమని అధికారులు మంగళవారం తెలిపారు.

హోం మంత్రిత్వ శాఖ కీలక సూచనలు

సాయుధ దళాలలో తమ పదవీకాలం ముగిసిన తర్వాత మాజీ అగ్నివీరుల తదుపరి వృత్తి పురోగతిలో భాగంగా కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఈ ఆదేశాలను అన్ని రాష్ట్రాలకు పంపింది. ప్రభుత్వ విభాగాలు, ఏజెన్సీలు, బ్యాంకులు మొదలైన వాటి ద్వారా అవుట్‌సోర్స్ చేయబడిన సెక్యూరిటీ ప్రొవైడర్ ఏజెన్సీలు అగ్నివీరులను ఉద్యోగాల్లోకి తీసుకునేలా ఒక వ్యవస్థను రూపొందించాలని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ అధికారులను ఆదేశించింది.

సెక్యూరిటీ ఏజెన్సీలలో భారీ నియామకాలను పరిగణనలోకి తీసుకుని, టాప్ 10 సెక్యూరిటీ ప్రొవైడర్ ఏజెన్సీలను అగ్నివీరులను నియమించుకునేలా ప్రోత్సహించాలని సెప్టెంబర్ 11న రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 'ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీల నియంత్రణ చట్టం (పీఎస్ఏఆర్ఏ) 'నియంత్రణ అధికారులకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ లేఖ రాసింది. పీఎస్ఏఆర్ఏ చట్టంలోని సెక్షన్ 10 (3)ని కేంద్రం ఈ సందర్భంగా ఉదహరించింది. ఈ సెక్షన్ ప్రకారం, ప్రైవేట్ సెక్యూరిటీ గార్డులను నియమించేటప్పుడు ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ లేదా కేంద్రంలోని ఇతర సాయుధ దళాలు, పోలీసులు, హోమ్ గార్డ్స్‌లో పనిచేసిన వ్యక్తులకు ప్రాధాన్యత ఇవ్వాలి.

అగ్నివీరులకు ప్రాధాన్యత ఎందుకు?

కేంద్రం జారీ చేసిన లేఖలో మాజీ అగ్నివీరులకు ప్రాధాన్యత ఇవ్వడానికి గల కారణాలను స్పష్టం చేసింది. "అగ్నివీరులకు సాయుధ దళంలో సుమారు నాలుగేళ్ల సర్వీస్ అనుభవం ఉంటుంది. కాబట్టి ప్రైవేట్ సెక్యూరిటీ గార్డులు, సూపర్‌వైజర్‌లను నియమించేటప్పుడు ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీలు వారికి ప్రాధాన్యత ఇవ్వాలి” అని పేర్కొంది. నియంత్రణ అధికారులు టాప్ 10 సెక్యూరిటీ ఏజెన్సీలను ఈ విషయంలో ప్రోత్సహించాలని, ప్రభుత్వ విభాగాలు కూడా తాము నియమించుకున్న సెక్యూరిటీ ప్రొవైడర్ ఏజెన్సీలను ఇదే విధంగా అగ్నివీరులను నియమించుకునేలా ప్రోత్సహించాలని లేఖలో ఆదేశించింది.

అగ్నిపథ్ పథకం, ఉపాధి అవకాశాలు

సాయుధ దళాల వయో పరిమితిని తగ్గించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం 2022 జూన్‌లో అగ్నిపథ్ నియామక పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం కింద పదిహేడున్నర నుంచి 21 ఏళ్ల మధ్య వయస్కులను నాలుగేళ్ల కాలానికి నియమిస్తారు. వారిలో 25 శాతం మందిని మరో 15 సంవత్సరాలు కొనసాగించే అవకాశం ఉంటుంది. అగ్నివీరుల మొదటి బ్యాచ్ వచ్చే సంవత్సరం తమ నాలుగేళ్ల పదవీకాలం పూర్తి చేసుకుంటుంది. మాజీ అగ్నివీరులకు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం సెంట్రల్ ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్సెస్, అస్సాం రైఫిల్స్‌లో కానిస్టేబుల్ (జనరల్ డ్యూటీ), రైఫిల్‌మెన్ పోస్టుల నియామకంలో 10 శాతం ఖాళీలను రిజర్వ్ చేసింది. దీంతో పాటు గరిష్ట వయోపరిమితిలో సడలింపు, ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్ నుంచి మినహాయింపు సౌకర్యం కూడా కల్పించబడింది. హర్యానా, రాజస్థాన్‌తో సహా కొన్ని రాష్ట్రాలు ఇప్పటికే తమ పోలీసు బలగాలలో అగ్నివీరులకు రిజర్వేషన్లు కల్పిస్తామని హామీ ఇచ్చాయి.