
మహిళా ఐఏఎస్పై దుష్ప్రచారం.. ఖండించిన తెలంగాణ ఐపీఎస్ల సంఘం
గత కొంతకాలంగా కొన్ని మీడియా సంస్థలు మహిళా ఐఏఎస్ అధికారులను లక్ష్యంగా చేసుకుని చేస్తున్న అభ్యంతరకర ప్రచారాలపై తెలంగాణ ఐపీఎస్ అధికారుల సంఘం తీవ్రంగా ఖండించింది. ఐఏఎస్ అధికారుల సంఘానికి పూర్తి సంఘీభావం ప్రకటిస్తూ, ఈ తరహా ప్రసారాలు బాధ్యతారహితమైనవని, దురుద్దేశపూరితమైనవని పేర్కొంది.
జర్నలిజం ముసుగులో అధికారుల వ్యక్తిత్వాన్ని కించపరచడం, రాజ్యాంగ విలువలకు న్యాయపాలనకు విరుద్ధమని సంఘం స్పష్టం చేసింది. మహిళా అధికారులను లక్ష్యంగా చేసుకుని నిర్ధారణలేని ఆరోపణలు, కల్పిత కథనాలు ప్రచారం చేయడం పితృస్వామ్య ధోరణిని ప్రతిబింబిస్తోందని విమర్శించింది. కఠిన పరిస్థితుల్లోనూ నిజాయితీ, వృత్తిపరమైన నిబద్ధతతో మహిళా అధికారులు సేవలందిస్తున్నారని ప్రశంసించింది.
ఈ ప్రసారాలు అధికారుల గౌరవం, వృత్తి పరమైన ప్రతిష్టను దెబ్బతీసేలా ఉన్నాయని, ‘మీడియా ట్రయల్’ ప్రజాస్వామ్యంలో అనుమతించదగినది కాదని సంఘం పేర్కొంది. మహిళా అధికారుల గోప్యతను వృత్తిపరమైన ప్రతిష్టను దెబ్బతీస్తుందని పేర్కొంది. తప్పుడు కథనాలు ప్రసారం చేస్తున్న వ్యక్తులు, సంస్థలపై సివిల్, క్రిమినల్ చట్టాల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని సంఘం హెచ్చరించింది. అసత్య ప్రచారానికి పాల్పడే కంటెంట్ను అన్ని వేదికల నుంచి తక్షణమే తొలగించాలని, సంబంధిత సంస్థలు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసింది.
రాజ్యాంగబద్ధమైన పదవుల గౌరవం, ముఖ్యంగా మహిళా అధికారుల భద్రత, ప్రతిష్టపై రాజీ ఉండదని సంఘం తేల్చిచెప్పింది. తప్పుడు కథనాల ద్వారా అధికారులను భయపెట్టే లేదా మనోధైర్యం దెబ్బతీసే ప్రయత్నాలకు సంస్థాగతంగా గట్టి ప్రతిస్పందన ఉంటుందని పేర్కొంది. న్యాయపాలన పరిరక్షణ, ప్రజాసంస్థల సమగ్రత కాపాడటానికి తాము కట్టుబడి ఉన్నామని, మహిళా అధికారులు ఎలాంటి భయం, వివక్ష, వేధింపులు లేకుండా విధులు నిర్వర్తించేలా అన్ని చర్యలు తీసుకుంటామని తెలంగాణ ఐపీఎస్ అధికారుల సంఘం ప్రకటించింది.
మహిళా అధికారుల ప్రతిష్ఠను దెబ్బతీయొద్దు: మంత్రి కోమటిరెడ్డి
తనపై మహిళా ఐఏఎస్ అధికారులపై సోషల్ మీడియాలో సాగుతున్న తప్పుడు ప్రచారంపై రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ అత్యంత భావోద్వేగానికి లోనయ్యారు. తనను రాజకీయంగా ఎదుర్కొనే దమ్ములేకనే, పిరికిపందల్లా మహిళా అధికారులను టార్గెట్ చేస్తున్నారని మండిపడ్డారు.
మంత్రిగా ఉన్నప్పటికీ ఆయనకు ఐఏఎస్ అధికారులు, కలెక్టర్లు, బదిలీ చేసే అధికారమే లేదని ఆయన చెప్పారు. మహిళా ఐఏఎస్ అధికారులు నల్గొండ జిల్లాలోని మంత్రిపై మీడియాలో జరుగుతున్న ప్రచారం అసత్యమైనది. నా కొడుకు చనిపోయిన సందర్భంలో కూడా రాజకీయాలు వదిలివేయడం బాగుండేది. కానీ ఈ తప్పుడు ప్రచారాలు మనుషులను తీవ్ర ఆత్మహత్యకు ప్రేరేపిస్తున్నాయని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు.
వీటితో పాటు, నల్గొండలో తాను మంత్రిగా బాధ్యతలు చేపట్టాక నాలుగురు కలెక్టర్లు మారారని, అధికారుల బదిలీలు పూర్తిగా ముఖ్యమంత్రి మాత్రమే బదిలీ చేయగలరని ఆయన తెలిపారు. ఐఏఎస్, ఐసీఎస్ అధికారుల వ్యక్తిగత ప్రతిష్ఠను దెబ్బతీసేలా తప్పుడు కథనాలు ప్రసారం చేయొద్దన్నారు. ప్రభుత్వలోని మహిళా అధికారులు, సీనియర్ ఐఏఎస్ అధికారులు ప్రభుత్వ విధులను చట్టపరంగా, సమర్ధవంతంగా నిర్వర్తిస్తున్నారని, వారి గౌరవాన్ని కాపాడడం అత్యంత అవసరమని ఆయన అన్నారు.
