Let's talk: editor@tmv.in
మహిళల రెండో టీ20లో శ్రీలంకపై మరోసారి స్పిన్‌తో పైచేయి సాధించిన భారత్

మహిళల రెండో టీ20లో శ్రీలంకపై మరోసారి స్పిన్‌తో పైచేయి సాధించిన భారత్

Praveen Kumar
24 డిసెంబర్, 2025

విశాఖపట్నంలో జరిగిన రెండో మహిళల టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లో భారత మహిళల జట్టు స్పిన్ బౌలింగ్‌తో శ్రీలంకను పూర్తిగా కట్టడి చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో శ్రీలంక జట్టు 9 వికెట్లు కోల్పోయి కేవలం 128 పరుగులకే పరిమితమైంది. ఈ మైదాన పరిస్థితులను దృష్టిలో పెట్టుకుంటే ఇది చాలా తక్కువ స్కోరేనని క్రికెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

ఈ మ్యాచ్‌లో భారత స్పిన్నర్లు ప్రధాన పాత్ర పోషించారు. జ్వరంతో దీప్తి శర్మ ఆడలేకపోవడంతో తుది జట్టులోకి వచ్చిన సీనియర్ స్పిన్నర్ స్నేహ్ రాణా తన అనుభవాన్ని చూపించింది. నాలుగు ఓవర్లలో కేవలం 11 పరుగులే ఇచ్చి ఒక వికెట్ తీసింది. అంతేకాదు ఒక మెయిడెన్ ఓవర్ కూడా వేసింది. టీ20 క్రికెట్‌లో మెయిడెన్ ఓవర్ చాలా అరుదైన విషయం కావడం గమనార్హం. ముఖ్యంగా శ్రీలంక కెప్టెన్ చమరి అతపత్తును అవుట్ చేయడం మ్యాచ్ దిశనే మార్చింది.

యువ స్పిన్నర్ శ్రీఛరణి మరోసారి ఆకట్టుకుంది. వన్డే వరల్డ్‌కప్‌లో మంచి ప్రదర్శన చేసిన ఆమె ఈ మ్యాచ్‌లో కూడా బాధ్యతాయుతంగా బౌలింగ్ చేసింది. నాలుగు ఓవర్లలో 23 పరుగులు మాత్రమే ఇచ్చి రెండు వికెట్లు తీసింది. మరో యువ బౌలర్ వైష్ణవి శర్మ కూడా తన రెండో అంతర్జాతీయ మ్యాచ్‌లో నిలకడగా బౌలింగ్ చేసింది. 32 పరుగులు ఇచ్చి రెండు వికెట్లు తీసి చివరి ఓవర్లలో శ్రీలంక బ్యాటర్లకు పరుగులు రాబట్టనివ్వలేదు.

శ్రీలంక బ్యాటింగ్ ఆరంభంలోనే తడబడింది. విష్మి గుణరత్నే ఒకే పరుగు వద్దే ఔట్ అయింది. కెప్టెన్ చమరి అతపత్తు మాత్రం కొంతసేపు దూకుడుగా ఆడింది. సీమర్లపై సిక్సులు కొట్టి జట్టుకు ఊపు ఇవ్వడానికి ప్రయత్నించింది. కానీ స్పిన్నర్లు బౌలింగ్ చేయడం మొదలయ్యాక ఆమె పరుగులు తీయలేకపోయింది. చివరకు స్నేహ్ రాణా బౌలింగ్‌లో లాంగ్ ఆఫ్ వద్ద క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరింది. ఆమె 24 బంతుల్లో 31 పరుగులు చేసింది.

మధ్య ఓవర్లలో హసిని పెరెరా ,హర్షిత సమరవిక్రమ జట్టును నిలబెట్టే ప్రయత్నం చేశారు. ఇద్దరూ కలిసి 44 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశారు. అయితే రన్‌రేట్ పెంచడంలో విఫలమయ్యారు. హసిని ఔట్ అయిన తర్వాత శ్రీలంక బ్యాటింగ్ పూర్తిగా కూలిపోయింది. చివరి ఆరు వికెట్లు కేవలం 24 పరుగులకే పడిపోవడం భారత్ బౌలింగ్ ఆధిపత్యాన్ని స్పష్టంగా చూపించింది.

మొత్తానికి ఈ మ్యాచ్‌లో భారత స్పిన్నర్ల నియంత్రిత బౌలింగ్‌నే శ్రీలంకను తక్కువ స్కోర్‌కే పరిమితం చేసింది. ఈ లక్ష్యంతో భారత్ గెలుపు దిశగా ముందుకు సాగేందుకు అనుకూల పరిస్థితులు ఏర్పడ్డాయి.