
మహిళలు, యువతకే ఎక్కువ సీట్లు
బీహార్లో అసెంబ్లీ ఎన్నికల వేడి రాజుకున్నది. అన్ని పార్టీల అభ్యర్థుల కోసం కసరత్తు చేస్తున్నాయి. ఇందులో భాగంగా తాజాగా బీజేపీ సైతం అభ్యర్థుల ఎంపిక విషయంలో కసరత్తు మొదలుపెట్టింది. బీహార్లో మహిళలు, యువతకే ఎక్కువ సీట్లు ఇవ్వాలని బీజేపీ నిర్ణయం తీసుకున్నది. బీహార్ బీజేపీ అధ్యక్షుడు దిలీప్ జైస్వాల్ సీట్లు కేటాయింపుపై సమీక్ష నిర్వహించారు. పాట్నాలోని బీజేపీ కార్యాలయంలో పార్టీ ఎన్నికల కమిటీ మూడు గంటల పాటు సమీక్ష నిర్వహించింది. ఈ సమావేశంలో 18 మంది సభ్యులు పాల్గొన్నారు. ఎన్నికల ఇన్చార్జ్ ధర్మేంద్ర ప్రధాన్ కూడా ఉన్నారు. 60 సీట్లపై సమీక్షించినట్టు తెలిసింది. ప్రస్తుత ఎమ్మెల్యేల పనితీరు, అభ్యర్థుల బలాబలాల గురించి చర్చించారు. మహిళలు, యువతకు ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. ‘మేము 60 సీట్ల గురించి చర్చించాము. మిగిలిన ప్రస్తుత సీట్లు, బీజేపీ పోటీ చేసి ఓడిపోయిన సీట్ల గురించి రేపు మళ్లీ చర్చిస్తాము. ప్రస్తుత ఎమ్మెల్యేల పనితీరు, అక్కడ నుండి పోటీ చేయాలనుకునే సంభావ్య అభ్యర్థుల గురించి కూడా చర్చ జరిగింది.’ అని జైస్వాల్ పేర్కొన్నారు.
బురఖా ధరించిన మహిళల ఓట్లు నిర్ధారించాలి
బీహార్ బీజేపీ యూనిట్, రాబోయే అసెంబ్లీ ఎన్నికలలో "నిజమైన ఓటర్లు" మాత్రమే తమ ఓటు హక్కును వినియోగించుకునేలా గట్టి తనిఖీలు చేయాలని భారత ఎన్నికల సంఘాన్ని కోరింది. పోలింగ్ బూత్లలో 'పర్దా నషీన్' (బురఖా ధరించిన మహిళలు) గుర్తింపును నిర్ధారించాలని పార్టీ పిలుపునిచ్చింది. ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేష్ కుమార్, ఎన్నికల కమిషనర్లు సుఖ్బీర్ సింగ్ సంధు మరియు వివేక్ జోషితో కలిసి, శనివారం పాట్నాలో రాబోయే బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన సన్నాహకాలను వివరంగా సమీక్షించారు. ఎన్నికల సంఘం అధికారులు రెండు రోజుల సమీక్ష సందర్శన కోసం రాష్ట్రంలో ఉన్నారు.
ఈసీఐ గుర్తింపు పొందిన జాతీయ, రాష్ట్ర రాజకీయ పార్టీల ప్రతినిధులతో సంప్రదించింది. వీరిలో ఆమ్ ఆద్మీ పార్టీ, బహుజన్ సమాజ్ పార్టీ, భారతీయ జనతా పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్), ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, నేషనల్ పీపుల్స్ పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్-లెనినిస్ట్) (లిబరేషన్), జనతాదళ్ (యునైటెడ్), లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్), రాష్ట్రీయ జనతాదళ్ మరియు రాష్ట్రీయ లోక్ జనశక్తి పార్టీలు ఉన్నాయి. వారి సూచనలను కోరింది. (ఏఎన్ఐ)
