Let's talk: editor@tmv.in
‘మహా జంగిల్‌రాజ్’కు మాల్దా ఘటనే నిదర్శనం: మోడీ

‘మహా జంగిల్‌రాజ్’కు మాల్దా ఘటనే నిదర్శనం: మోడీ

Pinjari Chand
6 ఏప్రిల్, 2026

పశ్చిమ బెంగాల్‌లో జరిగిన మాల్దా ఘటనను ప్రధాని నరేంద్ర మోడీ ప్రస్తావిస్తూ రాష్ట్రంలో ప్రభుత్వ వ్యవస్థ కుప్పకూలిందని ఆరోపించారు. ఇది మమతా బెనర్జీ నేతృత్వంలోని ప్రభుత్వ ‘మహా జంగిల్‌రాజ్’కు ఉదాహరణ అని విమర్శించారు. 2026 అసెంబ్లీ ఎన్నికలు అధికార పార్టీ కలిగిస్తున్న ‘భయం’ , బీజేపీ ఇచ్చే ‘భరోసా’ మధ్య పోరుగా మారాయని పేర్కొన్నారు. ఉత్తర బెంగాల్‌లోని కుచ్‌ బెహర్‌‌లో ఆదివారం నిర్వహించిన ఎన్నికల సభలో మాట్లాడిన మోడీ, మాల్దా ఘటనను తీవ్రంగా ప్రస్తావించారు. మాల్దాలోని కలియాచక్–II బ్లాక్ కార్యాలయంలో ఎన్నికల ఓటరు జాబితాల ప్రత్యేక సవరణ ప్రక్రియ సందర్భంగా కొందరు వ్యక్తులు న్యాయ అధికారులను ముట్టడి చేసిన ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైందని ఆయన చెప్పారు. ఈ సంఘటన తృణమూల్ ప్రభుత్వ పాలనలో ప్రభుత్వ వ్యవస్థ ఎలా కూలిపోయిందో చూపుతుందని విమర్శించారు.

‘భయం’ వర్సెస్‌ ‘భరోసా’

ఈ ఎన్నికలు రెండు భావాల మధ్య పోరుగా ఉన్నాయని మోడీ అన్నారు. ఒకవైపు టీఎంసీ సృష్టించిన భయం, అవినీతి, ‘కట్ మనీ’ రాజకీయాలు ఉన్నాయని, మరోవైపు అభివృద్ధిపై భరోసా ఇచ్చే బీజేపీ ఉందని పేర్కొన్నారు.

అక్రమ చొరబాటుపై ఆరోపణలు

రాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో జనాభా నిర్మాణంలో ప్రమాదకర మార్పులు చోటుచేసుకుంటున్నాయని ఆయన ఆరోపించారు. తృణమూల్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వం ఓటర్ల జాబితా సవరణ (సర్‌‌), పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)కు వ్యతిరేకంగా నిలవడం అక్రమ చొరబాటుదారులను రక్షించడానికేనని విమర్శించారు.

ఎన్నికల తర్వాత చర్యలు

పోలింగ్ రోజున తృణమూల్ కార్యకర్తలు భయపెట్టినా ప్రజలు చట్టంపై నమ్మకం ఉంచాలని, ఎన్నికలు స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా జరుగుతాయని తాను విశ్వసిస్తున్నానని మోడీ తెలిపారు. ఫలితాలు ప్రకటించే మే 4 తర్వాత చట్టం తన పని చేస్తుందని, అవినీతి, హింస ఘటనలపై విచారణ జరుగుతుందని హెచ్చరించారు.

మహిళల భద్రతపై వ్యాఖ్యలు

సందేశ్‌ఖాలి ఘటనను ప్రస్తావిస్తూ మహిళలపై జరిగిన దాడులు రాష్ట్రంలో భద్రతా పరిస్థితిని చూపిస్తున్నాయని అన్నారు. బీజేపీ ప్రభుత్వం ఏర్పడితే మహిళల భద్రత, గౌరవం, సాధికారతకు ప్రాధాన్యం ఇస్తామని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ‘లక్‌పతి దీదీ’ పథకం, అలాగే పార్లమెంట్, రాష్ట్ర అసెంబ్లీలలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించే చట్టాన్ని కూడా ఆయన ప్రస్తావించారు. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు రెండు దశల్లో జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధాన పార్టీలు ప్రచారాన్ని మరింత వేగవంతం చేశాయి.

‘మహా జంగిల్‌రాజ్’కు మాల్దా ఘటనే నిదర్శనం: మోడీ - Tholi Paluku