
మహాయుతి బీఎంసీ ఎన్నికల మేనిఫెస్టో విడుదల
రానున్న బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) ఎన్నికల నేపథ్యంలో మహాయుతి కూటమి తన ఎన్నికల మేనిఫెస్టోను ఆదివారం విడుదల చేసింది. ఈ కార్యక్రమంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి, బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్తో పాటు ఉప ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి వినోద్ తావ్డే పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఫడ్నవీస్ మాట్లాడుతూ ముంబైలో అక్రమంగా నివసిస్తున్న బంగ్లాదేశీయులను గుర్తించి దేశం వెలుపలకు పంపించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. ఇప్పటికే అత్యధిక సంఖ్యలో అక్రమ బంగ్లాదేశీయులను దేశ వెలుపలకు పంపించిన ఘనత తమకే దక్కిందని ఆయన పేర్కొన్నారు. వారిని గుర్తించేందుకు కృత్రిమ మేధస్సు (ఏఐ) ఆధారిత సాధనం ఆరు నెలల్లో సిద్ధమవుతుందని వెల్లడించారు.
ముంబైని బంగ్లాదేశీల నుంచి విముక్తం చేస్తాం. ఇప్పటికే ఎక్కువ మందిని వారి దేశాలకు పంపించాం. ఏఐ సాయంతో వంద శాతం అక్రమ బంగ్లాదేశీయులను గుర్తించి పంపిస్తాం. ఆరు నెలల్లో ఏఐ టూల్ సిద్ధం అవుతుంది. త్వరలోనే నగర రహదారులపై 10,000 కొత్త బెస్ట్ (బీఈఎస్టీ) బస్సులు పరుగులు తీస్తాయి. ఈ విషయంలో విఫలమైన నేతల గురించి ఆందోళన పడాల్సిన అవసరం లేదని ఫడ్నవీస్ వ్యాఖ్యానించారు. మహారాష్ట్ర రాష్ట్ర ఎన్నికల కమిషన్ రాష్ట్రవ్యాప్తంగా 29 మున్సిపల్ కార్పొరేషన్లకు ఎన్నికలు ప్రకటించింది. ఇందులో బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ), పుణె మున్సిపల్ కార్పొరేషన్ (పీఎంసీ), పింప్రీ-చించ్వాడ్ మున్సిపల్ కార్పొరేషన్ (పీసీఎంసీ) కూడా ఉన్నాయి. జనవరి 15న పోలింగ్ జరగనుండగా, జనవరి 16న ఓట్ల లెక్కింపు చేపడతారు.
ఇదే సమయంలో జనవరి 8న మహారాష్ట్రలోని అంబర్నాథ్ మున్సిపల్ కౌన్సిల్కు చెందిన సస్పెండ్ అయిన 12 మంది కాంగ్రెస్ కార్పొరేటర్లు బీజేపీలో చేరారు. అంబర్నాథ్ మున్సిపల్ కౌన్సిల్లో అధికారాన్ని దక్కించుకునేందుకు, తన మిత్రపక్షమైన ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేనను అడ్డుకునేందుకు బీజేపీ అరుదైన నిర్ణయంగా కాంగ్రెస్తో పొత్తు పెట్టుకుంది. 60 సభ్యులున్న అంబర్నాథ్ మున్సిపల్ కౌన్సిల్లో శివసేన అత్యధికంగా 27 సీట్లు గెలుచుకుని మెజారిటీకి నాలుగు సీట్లు తక్కువగా నిలిచింది. బీజేపీకి 14 సీట్లు, కాంగ్రెస్కు 12 సీట్లు, అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీకి 4 సీట్లు, ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులు గెలుపొందారు. దీంతో బీజేపీ కాంగ్రెస్, అజిత్ పవార్ ఎన్సీపీలతో కలిసి కూటమి ఏర్పాటు చేసింది.
ఇదే తరహాలో అకోలా జిల్లాలోని అకోట్ మున్సిపల్ కౌన్సిల్లో కూడా బీజేపీ అసదుద్దీన్ ఒవైసీ నేతృత్వంలోని ఏఐఎంఐఎం సహా మరికొన్ని పార్టీలతో పొత్తు పెట్టుకుంది. ఈ పరిణామాలపై శివసేన (యూబీటీ) ఎంపీ సంజయ్ రౌత్ తీవ్రంగా స్పందించారు. కాంగ్రెస్-రహిత భారతదేశం అంటూ నినాదాలు ఇచ్చే బీజేపీ, మెజారిటీ కోసం అదే కాంగ్రెస్తో చేతులు కలపడాన్ని ఆయన ద్వంద్వ వైఖరిగా విమర్శించారు. అలాగే, వీర్ సావర్కర్ సిద్ధాంతాన్ని నమ్మని అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీతో బీజేపీ పొత్తుపై కూడా సంజయ్ రౌత్ విమర్శలు గుప్పించారు.
