Let's talk: editor@tmv.in
మధ్యప్రదేశ్‌లో 14 నెలల్లో 149 చిరుతలు మృతి
మధ్యప్రదేశ్‌లో 14 నెలల్లో 149 చిరుతలు మృతి

మధ్యప్రదేశ్‌లో 14 నెలల్లో 149 చిరుతలు మృతి

Shaik Mohammad Shaffee
11 ఏప్రిల్, 2026

చిరుత పులులకు నిలయంగా పేరొందిన మధ్యప్రదేశ్‌లో ఆ మూగజీవాలు వరుసగా మృత్యువాత పడుతున్నాయి. గత ఏడాది జనవరి నుంచి ఇప్పటివరకు (14 నెలల కాలంలో) రాష్ట్రంలో ఏకంగా 149 చిరుతలు మరణించినట్లు సమాచార హక్కు చట్టం ద్వారా వెల్లడైన గణాంకాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ముఖ్యంగా రోడ్డు ప్రమాదాలే వీటి ప్రాణాలు తీయడానికి ప్రధాన కారణమవుతున్నాయని డేటా స్పష్టం చేస్తోంది. 2022 నివేదిక ప్రకారం 3,907 చిరుతలతో దేశంలోనే ప్రథమ స్థానంలో ఉన్న ఈ రాష్ట్రంలో, ఇంత భారీ స్థాయిలో మరణాలు సంభవించడం వన్యప్రాణి సంరక్షణపై నీలినీడలు కమ్ముకునేలా చేస్తోంది.

ప్రమాదాలే ప్రధాన శత్రువు

ఆర్టీఐ వివరాల ప్రకారం.. మరణించిన 149 చిరుతల్లో సుమారు 31 శాతం మరణాలు కేవలం రోడ్డు ప్రమాదాల వల్లే సంభవించాయి. ఇందులో 19 చిరుతలు హైవేలపై వాహనాల కింద పడి ప్రాణాలు కోల్పోయాయి. వయసు మళ్లడం, వ్యాధుల వంటి సహజ కారణాల వల్ల 24 శాతం చిరుతలు చనిపోగా, అడవిలో ఇతర జంతువులతో జరిగిన పోరాటాల్లో (వన్యప్రాణి ఘర్షణలు) 21 శాతం మృత్యువాత పడ్డాయి. మనుషుల నివాస ప్రాంతాలకు దగ్గరగా సంచరించే చిరుతలు తరచూ రోడ్ల పైకి రావడం ఈ అనర్థాలకు దారితీస్తోందని విశ్లేషకులు చెబుతున్నారు.

వేటగాళ్ల ఉచ్చు.. విద్యుత్ షాక్‌లు

చిరుతల మరణాల్లో వేటగాళ్ల పాత్ర కూడా తక్కువగా ఏమీ లేదు. సుమారు 14 శాతం మరణాలు వేట, ప్రతీకార హత్యల వల్ల జరిగాయి. ఎనిమిది చిరుతలు విద్యుత్ షాక్‌కు గురై ప్రాణాలు వదలగా, మరో రెండు చిరుతలు వేటగాళ్లు వేసిన ఉచ్చుల్లో చిక్కుకొని బలైపోయాయి. సుమారు 9 శాతం కేసులలో చిరుతలు ఎందుకు చనిపోయాయో కనీసం కారణం కూడా తెలియకపోవడం గమనార్హం. అధికారులు ఎన్ని నిబంధనలు పెడుతున్నా, క్షేత్రస్థాయిలో అక్రమ వేటను అరికట్టడంలో వైఫల్యం కనిపిస్తోందని విమర్శలు వస్తున్నాయి.

అటవీ శాఖ వివరణ.. రోడ్ మ్యాప్ సిద్ధం

ఈ గణాంకాలపై అదనపు ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఎల్. కృష్ణమూర్తి స్పందిస్తూ.. మరణాలను తగ్గించేందుకు తాము పక్కా కార్యాచరణతో ముందుకు వెళ్తున్నామని తెలిపారు. చిరుతలు చాలా చురుకైనవి, రాష్ట్రమంతటా విస్తరించి ఉంటాయని, అవి తరచూ జనావాసాలకు దగ్గరగా వస్తుంటాయని వివరించారు. కొత్తగా నిర్మిస్తున్న రహదారుల వద్ద జంతువుల రాకపోకల కోసం ప్రత్యేక మార్గాలు, సూచిక బోర్డులను ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు. రోడ్లకు సమీపంలో నీటి వనరులు లేకుండా చూస్తున్నామని, తద్వారా జంతువులు రోడ్ల వైపు రాకుండా అడ్డుకోవచ్చని తెలిపారు.

4 శాతం లోపే మరణాల రేటు

రాష్ట్రంలో మొత్తం 4,000 వరకు చిరుతలు ఉండగా, 149 మరణించడం అంటే అది కేవలం 4 శాతం నష్టమేనని మరో సీనియర్ అటవీ అధికారి విశ్లేషించారు. సాధారణంగా ఏటా 10 నుంచి 20 శాతం వరకు వన్యప్రాణుల మరణాల రేటు ఉన్నా అది ఆమోదయోగ్యమేనని, సహజ కారణాల వల్ల పాతవి చనిపోవడం ప్రకృతి సహజమని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం మధ్యప్రదేశ్‌లో ఉన్న చిరుతల సంఖ్యను బట్టి చూస్తే, ఈ మరణాలు ఆందోళన చెందాల్సిన స్థాయిలో లేవని అటవీ శాఖ భావిస్తోంది.

‘టైగర్ స్టేట్’ కాస్త శ్మశానంగా మారుతోంది!

అటవీ శాఖ వాదనను వన్యప్రాణి కార్యకర్త అజయ్ దూబే తీవ్రంగా ఖండించారు. మధ్యప్రదేశ్ రాష్ట్రం చిరుతలకు శ్మశానంగా మారుతోందని ఆయన విమర్శించారు. నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ నిబంధనలను పాటించడంలో అధికారులు విఫలమయ్యారని, సురక్షితమైన కారిడార్ల లేకపోవడమే ఈ మరణాలకు కారణమని మండిపడ్డారు. విద్యుత్ షాక్‌లు, ప్రమాదాల వల్ల ప్రాణాలు పోతున్నా ఎవరిపై జవాబుదారీతనం లేదని, చిరుతల రక్షణను ప్రభుత్వం ద్వితీయ ప్రాధాన్యతగా చూస్తోందని ఆయన ఆరోపించారు. రాష్ట్రంలో చిరుతల సంఖ్య 2018లో 3,421 ఉండగా, ప్రస్తుతం 3,907 కు చేరినప్పటికీ, వాటికి సరైన రక్షణ కల్పించకపోతే పరిస్థితి విషమిస్తుందని ఆయన హెచ్చరించారు.

మధ్యప్రదేశ్‌లో 14 నెలల్లో 149 చిరుతలు మృతి - Tholi Paluku