
మతమార్పిడి నిరోధక చట్టాలపై మీ వైఖరేంటి?: సుప్రీంకోర్టు
మతమార్పిడి నిరోధక చట్టాల చెల్లుబాటును సవాలు చేస్తూ క్రైస్తవ సంస్థ దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యం (పీఐఎల్)పై సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వంతో పాటు 12 రాష్ట్రాలకు సోమవారం నోటీసులు జారీ చేసింది. నాలుగు వారాల్లో తమ స్పందన తెలియజేయాలని ఆదేశించింది. చీఫ్ జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్మాల్య బాగ్చీతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్ను పరిశీలించింది. నేషనల్ కౌన్సిల్ ఆఫ్ చర్చెస్ ఇన్ ఇండియా (ఎన్సీసీఐ) తరఫున సీనియర్ న్యాయవాది మీనాక్షి అరోరా వాదనలు వినిపించారు. ఆయా రాష్ట్రాల్లో అమలులో ఉన్న మతమార్పిడి నిరోధక చట్టాల అమలును నిలిపివేయాలని కూడా ఆమె కోర్టును కోరారు.
ఈ పిటిషన్లను ఇప్పటికే పెండింగ్లో ఉన్న ఇతర కేసులతో కలిపి, ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం విచారిస్తుందని చీఫ్ జస్టిస్ తెలిపారు. కేంద్రం తరఫున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా, ఇలాంటి పిటిషన్లపై కేంద్రం ఇప్పటికే సమాధానం సిద్ధం చేసిందని, త్వరలో దాఖలు చేస్తామని చెప్పారు. ఈ కేసులో కేంద్రంతో పాటు రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, ఒడిశా, ఛత్తీస్గఢ్, అరుణాచల్ ప్రదేశ్, గుజరాత్, ఝార్ఖండ్, ఉత్తరాఖండ్, హర్యానా, మధ్యప్రదేశ్, కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాలకు నోటీసులు జారీ అయ్యాయి.
తప్పుడు ఫిర్యాదులకు ప్రోత్సాహం: పిటిషనర్లు
దీనిపై ఎన్సీసీఐ న్యాయవాది మాట్లాడుతూ, కొన్ని రాష్ట్ర చట్టాలు ‘నిఘా సమూహాలు’ ఫిర్యాదులు చేయడానికి ప్రోత్సహిస్తున్నాయని, దీంతో అనేక తప్పుడు ఫిర్యాదులు దాఖలవుతున్నాయని ఆరోపించారు. ఒడిశా, రాజస్థాన్ వంటి రాష్ట్రాల్లో కొత్త సవరణలు, చట్టాలు ఉన్నప్పటికీ వాటిని గత పిటిషన్లలో సవాలు చేయలేదని పేర్కొన్నారు. ఈ చట్టాలు రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 (జీవన హక్కు), ఆర్టికల్ 25 (మత స్వేచ్ఛ)ను ఉల్లంఘిస్తున్నాయని పిటిషనర్లు వాదిస్తున్నారు. ఈ చట్టాలు బలవంతం, ప్రలోభం లేకుండా స్వచ్ఛంద మతమార్పిడులను కూడా నియంత్రిస్తున్నాయని, వ్యక్తిగత స్వేచ్ఛను అణచివేస్తున్నాయని ఆరోపణలు చేశారు. గతంలో సెప్టెంబర్ 2025లో సుప్రీం కోర్టు ఇలాంటి పిటిషన్లపై రాష్ట్రాల వైఖరి తెలుసుకోవాలని నోటీసులు జారీ చేసింది. సమాధానాలు అందిన తర్వాత చట్టాల అమలుపై స్టే పరిశీలిస్తామని స్పష్టం చేసింది. ఈ కేసులో కమ్యూనికేషన్ క్రమబద్ధీకరణ కోసం పిటిషనర్ల తరపు నోడల్ న్యాయవాదిగా శ్రుష్టి, ప్రతివాది రాష్ట్రాల తరపు నోడల్గా రుచిరను నియమించింది . ఈ విషయంపై సుప్రీం కోర్టు తీర్పు దేశవ్యాప్తంగా అమలవుతున్న మతమార్పిడి నిరోధక చట్టాల భవిష్యత్తును నిర్ణయిస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
సీజేపీపై కేంద్రం ఆరోపణలు
మతాంతర వివాహాల నేపథ్యంలో జరిగే మత మార్పిడులను నియంత్రించే రాష్ట్ర చట్టాలను సవాలు చేస్తూ కార్యకర్త తీస్తా సెతల్వాడ్కు చెందిన ‘సిటిజన్స్ ఫర్ జస్టిస్ అండ్ పీస్’ (సీజేపీ) ఎన్జీఓ దాఖలు చేసిన పిటిషన్పై కేంద్ర ప్రభుత్వం గతంలో లోకస్ స్టాండీ అంశాన్ని లేవనెత్తింది. ఆ ఎన్జీఓ కొంతమంది ఎంచుకున్న రాజకీయ ప్రయోజనాల ఆదేశాల మేరకు పనిచేస్తోందని, అల్లర్లతో బాధపడుతున్న ప్రజల వేదనలను ఉపయోగించుకుని భారీ నిధులు సేకరించిందని కేంద్రం ఆరోపించింది. వరుస న్యాయ ప్రక్రియల ద్వారా, ఆ ఎన్జీఓ తన ఇద్దరు కార్యనిర్వాహకుల ద్వారా తన పేరును రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకునేందుకు అనుమతిస్తోందని హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ పేర్కొంది.
ఇదిలా ఉండగా, జనవరి 6, 2021న ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ వంటి రాష్ట్రాలు తీసుకొచ్చిన మతాంతర వివాహాల నేపథ్యంలో మత మార్పిడులను నియంత్రించే కొత్త, వివాదాస్పద చట్టాలను పరిశీలించేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. ఉత్తరప్రదేశ్ చట్టం అన్ని రకాల మత మార్పిడులకు వర్తించడంతో పాటు, మరొక మతంలోకి మారాలనుకునే వ్యక్తులకు విస్తృతమైన విధానాలను నిర్దేశిస్తుంది. ఉత్తరాఖండ్ చట్టం ప్రకారం బలవంతం లేదా ప్రలోభం ద్వారా మత మార్పిడికి పాల్పడితే రెండేళ్ల జైలు శిక్ష విధించే అవకాశం ఉంది. ఈ ప్రలోభం నగదు, ఉపాధి లేదా భౌతిక లాభాల రూపంలో ఉండవచ్చు.
