
మాట నిలబెట్టుకున్న సీఎం యోగి
ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ మాట ఇచ్చినట్టే నిలబెట్టుకున్నారు. ఇటీవల గ్యాంగ్ స్టర్ గోల్డీ బ్రార్, రోహిత్ గోదారా టీం సభ్యులు బాలీవుడ్ హీరోయిన్ దిశాపటానీ నివాసం దగ్గర కాల్పులు జరిపి కుటుంబ సభ్యులను బెదిరించారు. ఈ విషయం తెలుసుకున్న సీఎం యోగి ఆదిత్యనాథ్ దిశాపటానీ తండ్రి అయిన రిటైర్డ్ డీఎస్పీ జగదీశ్ పటానీకి ఫోన్ చేసి భరోసానిచ్చారు. వారిని పట్టుకుంటామని తెలిపారు. దాంతో పోలీసులకు సత్వర ఆదేశిలిచ్చారు. దీంతో ఎస్పీ, ఏడీజీ స్థాయి అధికారులు ఈ కేసును సీరియస్ గా తీసుకున్నారు. బుధవారం రాత్రి కాల్పులు జరిపిన నిందితులైన రోహ్ తక్ కు చెందిన రవీంద్ర అలియాస్ కల్లు, హార్యానా వాసి అరుణ్ లను గుర్తించి ఉత్తర ప్రదేశ్ స్పెషల్ టాస్క్ పోలీసులు ట్రోనికా సిటీలో వీరు ఉండగా ఎన్ కౌంటర్ చేశారు. దీంతో వారు తీవ్ర గాయాలపాలయ్యారు. చికిత్సపొందుతూ ఆస్పత్రిలో మరణించారు. వీరిపై గతంలో కూడా అనేక కేసులు ఉన్నాయి.వీరు గోల్డీబ్రార్ గ్యాంగ్ లో కీలక సభ్యులుగా ఉన్నారు.
సీఎంకు కృతజ్ఞతలు చెప్పిన హీరోయిన్ తండ్రి
షూటర్లు ఎన్ కౌంటర్ లో మరణించడంతో దిశాపటానీ తండ్రి జగదీశ్ పటానీ సీఎం యోగికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేశారు. నా తరపున, కుటుంబ సభ్యుల వైపు నుంచి ధన్యవాదాలు తెలిపారు. మాట ఇచ్చినట్టే నిందితులను గుర్తించి మట్టుబెట్టడం సాధారణ విషయం కాదు. చాలా మంది నాయకులు మాట ఇచ్చి మర్చిపోతారు. కానీ సీఎం యోగి సర్కార్ క్రిమినల్స్ ను పట్టుకుని కఠినచర్యలు తీసుకుంటుందని గుర్తుచేశారు.
మత పరమైన వ్యాఖ్యలతోనే కాల్పులు
దిశా పటానీ సోదరి ఖుష్బూపటానీ ఇటీవల అనిరుద్ధాచార్యపై, ప్రేమానంద్ మహారాజ్ పై లివ్-ఇన్-రిలేషన్ షిప్ గురించి మాట్లాడారు. దీంతో ఈ నెల 12న బరేలీ పట్టణంలో దిశా పటానీ నివాసం ముందు కాల్పులు జరిపారు. సనాతన ధర్మాన్ని విమర్శిస్తే ఊరుకునేది లేదని,ఇది ట్రైలర్ మాత్రమేనని, అసలు సినిమా ముందుందని హెచ్చరించారు. భవిష్యత్ లో సాధువులను, మతాన్ని అవమానిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని తేల్చిచెప్పారు. అయితే ఖుష్బూ గతంలో ఆర్మీలో పనిచేసింది. ప్రస్తుతం ఫిట్ నెస్ ట్రైనర్ గా పని చేస్తున్నారు.
