Let's talk: editor@tmv.in
ముఖ్యమంత్రి స్వగ్రామానికి ‘స్కోచ్ గోల్డెన్ అవార్డు’

ముఖ్యమంత్రి స్వగ్రామానికి ‘స్కోచ్ గోల్డెన్ అవార్డు’

FL - HARI
22 సెప్టెంబర్, 2025

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వగ్రామం స్వర్ణ నారావారిపల్లి ప్రాజెక్టుకు ప్రతిష్టాత్మక స్కోచ్ గోల్డెన్ అవార్డు వరించింది. ప్రతీ ఇంటికీ సోలార్ రూఫ్ టాప్ ఏర్పాటు చేసుకున్న గ్రామంగా నారావారిపల్లె ఈ అవార్డు దక్కించుకుంది. కేవలం 45 రోజుల వ్యవధిలోనే మొత్తం 1600 ఇళ్లకు సోలార్ రూఫ్ టాప్‌ను ఏర్పాటు చేసి విద్యుత్ వెలుగులు నింపారు. కర్బన ఉద్గారాల తగ్గింపులో భాగంగా హరిత స్వర్ణాంధ్ర లక్ష్యంగా ప్రారంభించిన ఈ ప్రాజెక్టులో ఉచితంగా ప్రతీ ఇంటికీ సోలార్ రూఫ్ టాప్‌ను ఏర్పాటు చేశారు. మొత్తం 3396 కిలోవాట్ల సామర్ధ్యంతో ఏడాదికి 4.89 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి కానుంది. రూ.3.39 కోట్ల రూపాయల విద్యుత్ సోలార్ రూఫ్ టాప్ ద్వారా ఉత్పత్తి కానుంది.

ప్రధాన మంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజిలి యోజనలో భాగంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా స్వర్ణ నారావారిపల్లి ప్రాజెక్టు ద్వారా సౌరశక్తి ప్యానెళ్లను ప్రతీ ఇంటిపైనా ఉచితంగా ఏర్పాటు చేశాయి. అన్ని ఇళ్లకూ సోలార్ రూఫ్ టాప్ ఏర్పాటు చేసి మొత్తం గ్రీన్ ఎనర్జీని వినియోగిస్తున్న తొలి గ్రామంగా ప్రతిష్టాత్మక సంస్థ స్కోచ్ గోల్డెన్ అవార్డును ప్రకటించింది. తిరుపతి జిల్లా కలెక్టర్ ఎస్. వెంకటేశ్వర్, ఎస్పీడీసీఎల్ ఎస్ఈ సురేంద్ర నాయుడు అవార్డును ఢిల్లీలో అందుకున్నారు. దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఎక్స్ వేదికగా గ్రామస్థులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ లక్ష్యాన్ని చేరుకోవటంలో సహకరించిన ప్రజలు, అధికారులకు అభినందనలు తెలియచేశారు.

ముఖ్యమంత్రి స్వగ్రామానికి ‘స్కోచ్ గోల్డెన్ అవార్డు’ - Tholi Paluku