Let's talk: editor@tmv.in
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం: వర్షపు నీటి కాలువల పునరుద్ధరణకు రూ. 27 కోట్లు మంజూరు

భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం: వర్షపు నీటి కాలువల పునరుద్ధరణకు రూ. 27 కోట్లు మంజూరు

Dantu Vijaya Lakshmi Prasanna
25 నవంబర్, 2025

నిర్మాణంలో ఉన్న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంలోని నాలుగు వర్షపు నీటి అవుట్‌లెట్‌ల (కాలువల) తక్షణ పునరుద్ధరణ కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సోమవారం రూ. 27 కోట్లను ఆమోదించింది.

ఆంధ్రప్రదేశ్ విమానాశ్రయాల అభివృద్ధి సంస్థ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్, రాష్ట్ర ప్రభుత్వానికి నాలుగు అవుట్‌లెట్‌లు లేదా అవుట్‌ఫాల్ కాలువలు OT1, OT2, OT4, OT5 ల తక్షణ పునరుద్ధరణ, మెరుగుదలలు, పూడికతీత అవసరమని ప్రతిపాదించారు.

"ప్రభుత్వం, నిశితంగా పరిశీలించిన తరువాత, విజయనగరం జిల్లాలోని భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి సంబంధించిన నాలుగు కీలకమైన అవుట్‌ఫాల్ కాలువలను తక్షణమే పునరుద్ధరించడానికి అవసరమైన రూ. 2,700 లక్షల (రూ. 27 కోట్లు) వ్యయాన్ని భరించడానికి అంగీకరించింది" అని ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం.టి. కృష్ణబాబు జారీ చేసిన ప్రభుత్వ ఉత్తర్వు లో పేర్కొన్నారు.

హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ మంజూరు చేసిన రూ. 1,000 కోట్ల రుణంలో నుంచి ఈ నిధులను కేటాయిస్తున్నారని, అవుట్‌ఫాల్ కాలువల పునరుద్ధరణ పనులను జల వనరుల శాఖ చేపడుతుందని ఈ జివో పేర్కొంది.

జివోప్రకారం, విమానాశ్రయం అభివృద్ధికి సంబంధించిన మాస్టర్ ప్లాన్ మొత్తం సైట్ సుస్థిరతను పరిగణనలోకి తీసుకోవాలి, ఇందులో సైట్‌లో ఉత్పత్తి అయ్యే వర్షపు నీటి ప్రవాహంలో కనీసం 50 శాతం వర్షపు నీటి సంరక్షణను అందించడం కూడా ఉంటుంది.

ఈ నీటిని భూగర్భ జలాలను రీఛార్జ్ చేయడానికి లేదా నీటిపారుదల కోసం ఉపయోగించవచ్చు. అయితే, విమానాశ్రయం యొక్క అన్ని అవుట్‌లెట్ పాయింట్లు విమానాశ్రయం సరిహద్దుల వెలుపల ఉన్న నీటిపారుదల కాలువల్లోకి నీటిని విడుదల చేస్తాయి. వరద నీరు సక్రమంగా బయటకు పోవడానికి నీరు నిలవకుండా నిరోధించడానికి ఈ కాలువలకు తక్షణ పునరుద్ధరణ అవసరమని జివో లో పేర్కొన్నారు.

కాగా గతంలో, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు భోగాపురం విమానాశ్రయాన్ని 2026 ఆగస్టులో ప్రారంభిస్తామని చెప్పారు.

అయితే డిసెంబర్ లేదా జనవరిలో టెస్ట్ ఫ్లయిట్ ఎగరబోతుంది. ఇదైతే పక్కా అంటోంది కేంద్ర ప్రభుత్వం. ఆ మేరకు నిర్మాణ పనుల్లో దూకుడు కనిపిస్తోంది. నిర్మాణ పనులు 91.7 శాతం పూర్తయ్యాయి. విజయనగరం జిల్లా భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రాజెక్టు. నిర్మాణ పనుల్ని ఇటీవల కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు పరిశీలించారు. టాక్సీవే, రన్‌వే నిర్మాణాల్ని పర్యవేక్షించారు. ముఖ్యంగా, కుండపోత కురిసినప్పుడు, నీళ్లు నిలవకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారో అధికారులను అడిగి తెలుసుకున్నారు.

ఎన్ని సమస్యలు ఎదురైనా అనుకున్న సమయానికి పూర్తి చేస్తామని, డిసెంబర్ లేదా జనవరిలో టెస్ట్ ఫ్లయిట్ ఎగరబోతోందని చెప్పారు. కనెక్టివిటీ పెంచడమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామన్నారు. ఇప్పటికే ఎయిర్‌పోర్ట్ సమీపంలో ఎకనమిక్ ఆక్టివిటీ పెరుగుతోందని, త్వరలో ఫైవ్‌స్టార్ హోటల్స్ కూడా వస్తాయని, ఏవియేషన్ యూనివర్సిటీ తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని భరోసానిచ్చారు. ప్రస్తుతం వైజాగ్ విమానాశ్రయం నుంచి సేవలందించని ఎయిర్‌లైన్ సంస్థల్ని కూడా ఇక్కడికి రప్పించేలా మంతనాలు జరుపుతోంది ఏవియేషన్ శాఖ.

విశాఖను త్వరలో ఏఐ హబ్‌గా తీర్చిదిద్దే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయని రామ్మోహన్ నాయుడు చెప్పారు. గ్లోబల్ స్టాండర్డ్స్‌కి అనుగుణంగా ఈ ఎయిర్‌పోర్ట్‌ను నిర్మిస్తున్నామని, నావిగేషన్, ట్రాఫిక్ కంట్రోల్ వంటి అంశాలన్నీ ఏవియేషన్ మినిస్ట్రీ పర్యవేక్షణలో పూర్తి స్థాయిలో జరుగుతున్నాయని తెలిపారు. పనులను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేసి భోగాపురం ఎయిర్‌పోర్ట్ ప్రారంభోత్సవానికి ప్రధాని నరేంద్ర మోదీని ఆహ్వానించనున్నట్లు ప్రకటించారు కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు.

ప్రస్తుతం మంత్రి రామ్మోహన్ నాయుడు లేవనెత్తిన నీళ్లు నిలవ కాకుండా ఉండే సమస్యకు పరిష్కార మార్గంగా ఈ నిధులు విడుదలచేశారు.