
భూటాన్లో ‘ప్రపంచ శాంతి ప్రార్థనలు’ ప్రారంభం
భూటాన్ రాజధాని థింపులోని చాంగ్లిమిథాంగ్ స్టేడియంలో 'గ్లోబల్ పీస్ ప్రేయర్ ఫెస్టివల్ 2025' మంగళవారం ఘనంగా ప్రారంభమైంది. ఈ వేడుకలో భూటాన్ ప్రధాన మంత్రి షెరింగ్ టోబ్గే పాల్గొన్నారు. ఈ ఉత్సవం నవంబర్ 4 నుండి 17 వరకు జరిగే 13 రోజుల ఆధ్యాత్మిక మహాసభకు ప్రారంభ సూచికగా నిలుస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న బౌద్ధ గురువులు, సాధకులు, శాంతి కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న వివాదాలు, విభజనల మధ్య శాంతి, కరుణ, ఐక్యతను పెంపొందించడం ఈ ఉత్సవ లక్ష్యం.
భూటాన్ రాజ ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ ఉత్సవంలో పవిత్ర క్రతువులు, మతాతీతమైన ప్రపంచ శాంతి ప్రార్థన, బజాగురు మంత్ర సామూహిక పఠనం, ప్రజలకు ఆశీర్వాదాలు, కాలచక్ర ఆరాధన వంటి అనేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఉంటాయి. థేరవాద, మహాయాన, వజ్రయాన సంప్రదాయాలకు చెందిన ప్రముఖ లామాలు, పండితులు, సాధకులు ఈ వేడుకలో పాల్గొంటున్నారు. ప్రేమపూర్వక దయ, అవగాహన పరివర్తన శక్తిని ప్రపంచ సామరస్యం కోసం ఉపయోగించుకోవాలనే భూటాన్ ప్రయత్నాన్ని ఇది ప్రతిబింబిస్తుంది. ఉత్సవం ప్రారంభం జబ్జి దోచోగ్ అనే అరుదైన క్రతువుతో జరిగింది. కుఎన్సెల్ఫోడ్రాంగ్ వద్ద కేంద్ర మఠ బృందం ఈ యజ్ఞాన్ని నిర్వహించింది. ఇది శరీరం, వాక్కు, మనస్సులోని ప్రతికూల కర్మను శుద్ధి చేసే ఆధ్యాత్మిక పూజగా భావిస్తారు.
ఈ ఉత్సవానికి ప్రధాన ఆకర్షణ కాలచక్ర దీక్ష. దీనికి భూటాన్ మఠాధిపతి అయిన హిజ్ హోలీనెస్ ది జె ఖెంపో అధ్యక్షత వహిస్తారు. ఇది వ్యక్తులు, విశ్వం మధ్య ఉన్న పవిత్ర సంబంధంపై, అన్ని జీవులలో అంతర్లీనంగా ఉన్న బుద్ధ స్వభావంపై లోతైన బోధనలను అందిస్తుంది. అదనంగా ఈ ఉత్సవంలో భిక్షుణి (నన్) పట్టాభిషేకం కూడా జరుగుతుంది. దీనిని గెలోంగ్మా ఆర్డినేషన్ అని పిలుస్తారు. ప్రపంచం నలుమూలల నుంచి వచ్చిన 250 మందికి పైగా బౌద్ధ సన్యాసినులు ఈ దీక్షను పొందనున్నారు. ఇది మఠ సంప్రదాయాల్లో మహిళల భాగస్వామ్యాన్ని ప్రోత్సహించే చారిత్రాత్మక ముందడుగు.
ప్రధాన వేడుకలతో పాటు ఉత్సవంలో కాలచక్ర కళ, కళాఖండాల ప్రదర్శన కూడా ఉంటుంది. అలాగే కాలచక్ర సంప్రదాయంపై పండితుల సెమినార్లు జరుగుతాయి. బౌద్ధమతం ఆధ్యాత్మిక వారసత్వాన్ని పరిరక్షించడానికి, పంచుకోవడానికి భూటాన్ నిబద్ధతను ఈ కార్యక్రమాలు ప్రతిబింబిస్తాయి. భూటాన్ గ్లోబల్ పీస్ ప్రేయర్ ఫెస్టివల్ ప్రపంచ ఐక్యత, భక్తి, శాంతి సందేశానికి ప్రతీకగా నిలుస్తూ, విభిన్నతతో నిండిన ప్రపంచానికి దయ, విశ్వాసం, ఆశలతో నిండిన సందేశాన్ని అందిస్తోంది.
ప్రపంచవ్యాప్తంగా సుమారు 50 కోట్ల మంది బౌద్ధమతాన్ని అనుసరిస్తున్నారు. ఇది ప్రపంచ జనాభాలో సుమారు 6 శాతం. బౌద్ధమతం శాంతి, కరుణ, ఐక్యతకు ప్రతీక. బౌద్ధులు ఎక్కువగా ఉన్న దేశాలు చైనా, థాయ్లాండ్, జపాన్, మయన్మార్, శ్రీలంక, కాంబోడియా, వియత్నాం, భూటాన్. వీరిలో చైనాలో అత్యధిక బౌద్ధులు ఉన్నారు. బౌద్ధమత స్థాపకుడు గౌతమ బుద్ధుడు. ఈ మతంలోని ప్రముఖులు దలైలామా, థిచ్ నాట్ హాన్, ధర్మపాల. ప్రధాన ఆధ్యాత్మిక కేంద్రాలు బోధ్ గయ, సారనాథ్, లుంబిని, కుషీనగర్. అలాగే టిబెట్లోని పొటాలా ప్యాలెస్, భారతదేశంలోని ధర్మశాల ప్రధాన కార్యాలయాలుగా ప్రసిద్ధి చెందాయి.
