
భారత విదేశాంగ విధానాన్ని మతపరమైన కోణంలో చూడకండి: బీజేపీ నేత ప్రకాష్ రెడ్డి
పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో భారత విదేశాంగ విధానంపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ చేసిన వ్యాఖ్యలను బీజేపీ రాష్ట్ర నాయకుడు ప్రకాష్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. అంతర్జాతీయ సంబంధాలను ఓవైసీ 'మతపరమైన కోణం'లో చూస్తున్నారని, భారత దౌత్య నిర్ణయాలు కేవలం జాతీయ ప్రయోజనాల ఆధారంగానే సాగుతాయని ఆయన స్పష్టం చేశారు.
మతం ముఖ్యం కాదు - జాతీయ ప్రయోజనమే ముఖ్యం
ఈ సందర్బంగా శనివారం మీడియాతో మాట్లాడిన ప్రకాష్ రెడ్డి, విదేశాంగ విధానం అనేది దౌత్యపరమైన అంశాలు, భౌగోళిక రాజకీయ పరిణామాలు, వ్యూహాత్మక ప్రాధాన్యతలపై ఆధారపడి ఉంటుందని అన్నారు. ఓవైసీ ప్రతి విషయాన్ని ఎల్లప్పుడూ మతపరమైన కోణంలో మాత్రమే చూస్తారు. ఏ దేశ విదేశాంగ విధానమైనా మతపరమైన అంశాలపై ఆధారపడి ఉండదు. కేవలం మతం ప్రాతిపదికన ఏ దేశానికి మద్దతు ఇవ్వలేం. మాకు ఎప్పుడూ 'నేషన్ ఫస్ట్' అనేదే ఏకైక విధానం అని ఆయన పేర్కొన్నారు. రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక చర్చలు, అప్పటి రాజకీయ పరిస్థితులను బట్టి భారత ప్రభుత్వం స్పష్టమైన వైఖరితో ముందుకు వెళ్తోందని చెప్పారు.
ఈ వ్యాఖ్యలు, ఓవైసీ ఇటీవల హైదరాబాద్లో జరిగిన కార్యక్రమంలో కేంద్ర ప్రభుత్వ విదేశీ విధానాన్ని కఠినంగా విమర్శించిన నేపథ్యంలో వచ్చాయి. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెస్కియాన్తో ఫోన్లో మాట్లాడారు. దీనిపై ఓవైసీ స్పందిస్తూ.. ఇరాన్పై జరిగిన దాడులను భారత్ స్పష్టంగా ఖండించాల్సిందని, ప్రభుత్వం ద్వంద్వ వైఖరిని ప్రదర్శిస్తోందని విమర్శించారు. దాడులు జరగకూడదని చెప్పడం సరిపోదని, వాటిని తీవ్రంగా ఖండించాలని ఆయన డిమాండ్ చేశారు.
పశ్చిమాసియాలో తాజా పరిస్థితి
ఫిబ్రవరి 28న ప్రారంభమైన ఈ ఘర్షణలు ప్రస్తుతం తీవ్ర స్థాయికి చేరుకున్నాయి. ఇజ్రాయెల్, అమెరికా జరిపిన సైనిక దాడులు, దానికి ప్రతిగా ఇరాన్ జరిపిన ప్రతీకార దాడుల వల్ల గల్ఫ్ ప్రాంతంలో భద్రతా పరిస్థితి క్షీణించింది. పౌర మౌలిక సదుపాయాల ధ్వంసం, పౌరుల మరణాల పట్ల ప్రధాని మోదీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ యుద్ధం ప్రపంచ ఇంధన మార్కెట్లు, అంతర్జాతీయ వాణిజ్య మార్గాలపై కూడా తీవ్ర ప్రభావం చూపుతోంది.
