Let's talk: editor@tmv.in
భారత బాక్సర్ల 'పంచ్' పవర్.. సెమీస్‌లోకి నీతూ, ప్రీతి

భారత బాక్సర్ల 'పంచ్' పవర్.. సెమీస్‌లోకి నీతూ, ప్రీతి

Shaik Mohammad Shaffee
7 ఫిబ్రవరి, 2026

స్పెయిన్ వేదికగా జరుగుతున్న బాక్సమ్ ఎలైట్ అంతర్జాతీయ బాక్సింగ్ టోర్నమెంట్‌లో భారత బాక్సర్లు అద్భుత ప్రదర్శనతో దూసుకుపోతున్నారు. క్వార్టర్ ఫైనల్స్‌లో బాక్సర్లు వరుస విజయాలు నమోదు చేయడంతో భారత్‌కు ఏకంగా 19 పతకాలు ఖాయమయ్యాయి. కొత్త కోచ్ శాంటియాగో నీవా మార్గదర్శకత్వంలో బరిలోకి దిగిన భారత మహిళా జట్టు 12 పతకాలను ఖరారు చేసుకోగా, పురుషుల విభాగంలో ఏడుగురు బాక్సర్లు సెమీఫైనల్‌కు చేరుకుని పతకాలను కన్ఫర్మ్ చేసుకున్నారు.

నీతూ, ప్రీతి ఘనవిజయం

మహిళల 51 కిలోల విభాగంలో మాజీ ప్రపంచ ఛాంపియన్ నీతూ గంగాస్ తనదైన ముద్ర వేసింది. క్వార్టర్ ఫైనల్స్‌లో కెనడా బాక్సర్ మెకెంజీ రైట్‌పై ఆది నుంచి విరుచుకుపడిన నీతూ, ఏకపక్ష విజయంతో (5-0) సెమీఫైనల్స్‌కు దూసుకెళ్లింది. ఇక 54 కిలోల విభాగంలో ఆసియా క్రీడల కాంస్య పతక విజేత ప్రీతి పవార్ ప్రత్యర్థిపై పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. స్పెయిన్‌కు చెందిన మరియా గొంజాలెజ్‌ను తన పంచ్‌లతో ఉక్కిరిబిక్కిరి చేయడంతో, మూడో రౌండ్‌లోనే రిఫరీ పోటీని నిలిపివేసి ప్రీతిని విజేతగా ప్రకటించారు.

తిరుగులేని మహిళా జట్టు

మహిళల విభాగంలో ఇతర బాక్సర్లు కూడా అద్భుత విజయాలు సాధించారు. 54 కిలోల విభాగంలో పూనమ్ 5-0తో థాయ్‌లాండ్‌కు చెందిన నటనిచాపై ఘనవిజయం సాధించింది. 60 కిలోల కేటగిరీలో ప్రియ, 65 కిలోల కేటగిరీలో ప్రాంజల్ తమ ప్రత్యర్థులపై ఏకపక్ష విజయాలతో సెమీస్‌కు చేరారు. కాగా, కజకిస్థాన్ బాక్సర్ అక్బర్ ఇక్షనోవాతో జరిగిన హోరాహోరీ పోరులో కాజల్ (65 కిలోలు) 4-1 తేడాతో విజయం సాధించి మెడల్ ఖాయం చేసుకుంది.

రింగ్‌లో అదరగొట్టిన పురుషులు

పురుషుల విభాగంలోనూ భారతీయుల జోరు కొనసాగింది. 55 కిలోల విభాగంలో జదుమణి సింగ్ అద్భుతమైన ఫామ్‌ను కనబరుస్తూ చైనీస్ తైపీకి చెందిన పెంగ్ చియా-ఫెంగ్‌ను 5-0తో మట్టికరిపించాడు. ప్రపంచ ఛాంపియన్‌షిప్ కాంస్య పతక విజేత మహమ్మద్ హుసాముద్దీన్ (60 కిలోలు) ఉక్రెయిన్ బాక్సర్ అలీ దహ్లీపై తన అనుభవాన్నంతా ఉపయోగించి తిరుగులేని ఆధిపత్యంతో విజయం సాధించాడు. అదే విభాగంలో మరో బాక్సర్ సచిన్, ఉక్రెయిన్‌కు చెందిన ఐడర్ అబ్దురైమోవ్‌పై 3-2 తేడాతో హోరాహోరీగా పోరాడి విజయం సాధించి సెమీస్‌లో అడుగుపెట్టాడు. 75 కిలోల విభాగంలో ఆకాష్ 4-1తో స్పెయిన్ బాక్సర్ జోస్ లూయిస్‌ను ఓడించి పతకాన్ని ఖాయం చేసుకున్నాడు.

కొందరికి తప్పని నిరాశ

భారత బాక్సర్లు మెజారిటీ విజయాలు సాధించినప్పటికీ, కొందరు హోరాహోరీగా పోరాడి ఓటమి పాలయ్యారు. పవన్ బర్త్వాల్ ఇంగ్లాండ్ బాక్సర్ ఎల్లిస్ ట్రోబ్రిడ్జ్ చేతిలో 2-3తో స్వల్ప తేడాతో ఓడిపోగా, అభినాష్ జమ్వాల్ ఉక్రెయిన్ బాక్సర్ ఎల్విన్ అలీయేవ్ చేతిలో పరాజయం పాలై టోర్నీ నుంచి నిష్క్రమించారు. ప్రస్తుతం సెమీఫైనల్‌కు చేరిన 19 మంది బాక్సర్లు పతక రంగును మార్చుకోవడమే లక్ష్యంగా రింగ్‌లోకి దిగనున్నారు.

భారత బాక్సర్ల 'పంచ్' పవర్.. సెమీస్‌లోకి నీతూ, ప్రీతి - Tholi Paluku