Let's talk: editor@tmv.in
భారత ఇంధన వ్యూహం: మూడు రెట్లు పెరగనున్న అణు విద్యుత్ సామర్థ్యం

భారత ఇంధన వ్యూహం: మూడు రెట్లు పెరగనున్న అణు విద్యుత్ సామర్థ్యం

Sudhir Pidugu
6 ఫిబ్రవరి, 2026

భారతదేశం తన అణు విద్యుత్ సామర్థ్యాన్ని వచ్చే పదేళ్లలో మూడు రెట్లు పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది. సౌర, పవన, ఇతర పునరుత్పాదక ఇంధన వనరులు వేగంగా విస్తరిస్తున్నప్పటికీ, భారత్ తన అణు విద్యుత్ సామర్థ్యాన్ని పెంచుకోవడానికి సిద్ధమవుతోంది.

2000వ దశకం ఆరంభంలో కేవలం 3 గిగావాట్లుగా ఉన్న సామర్థ్యం, ప్రస్తుతం 24 రియాక్టర్ల ద్వారా 8.8 గిగావాట్లకు చేరుకుంది. ఈ వ్యత్యాసం మారుతున్న ఇంధన వ్యూహాన్ని ప్రతిబింబిస్తుంది.పెరిగిపోతున్న విద్యుత్ డిమాండ్‌ను తట్టుకోవడానికి, కేవలం సౌర, పవన శక్తిపైనే ఆధారపడకుండా, 'బేస్‌లోడ్' (నిరంతర విద్యుత్) కోసం అణుశక్తిని ఒక వ్యూహాత్మక ఆయుధంగా ప్రభుత్వం భావిస్తోంది. భారీ స్థాయి విస్తరణకు పునరుత్పాదక ఇంధనం, దీర్ఘకాలిక విశ్వసనీయత, ఇంధన భద్రత కోసం అణుశక్తిని పెంచుకుంటూ వ్యూహాలు రచిస్తుంది. అయితే 2008 నాటి భారత్-అమెరికా పౌర అణు ఒప్పందం తర్వాత ఈ వృద్ధి గణనీయంగా పెరిగింది.

ఇంధన భద్రతను అందించిన ఒప్పందం

2008 అణు ఒప్పందం అనగానే అందరికీ కొత్త రియాక్టర్లు గుర్తుకు వస్తాయి, కానీ దాని అసలు ప్రభావం మరో చోట ఉంది. దశాబ్దాల పాటు ఉన్న అణు దిగ్బంధనాన్ని తొలగించి, అంతర్జాతీయ ఎగుమతి నియంత్రణల నుండి మినహాయింపు పొందడం ద్వారా యురేనియం ఇంధనాన్ని దిగుమతి చేసుకునే మార్గం సుగమమైంది.

భారత అణు ప్రస్థానంలో 2008 నాటి భారత్-అమెరికా పౌర అణు ఒప్పందం అత్యంత కీలకమైనది. దీనివల్ల భారతదేశంపై ఉన్న అంతర్జాతీయ ఆంక్షలు తొలగిపోయాయి. అంతకుముందు, భారత్‌లోని స్వదేశీ ప్రెషరైజ్డ్ హెవీ వాటర్ రియాక్టర్లు ఇంధన కొరతతో సతమతమయ్యి సగం సామర్థ్యంతో నడిచేవి.

ఈ ఒప్పందం తర్వాత కజకిస్తాన్, రష్యా, కెనడా వంటి దేశాల నుండి నిరంతరం యురేనియం సరఫరా కావడంతో, రియాక్టర్లు పూర్తి సామర్థ్యంతో పనిచేయడం ప్రారంభించి పూర్తిస్థాయిలో విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తున్నాయి. ఫలితంగా, రాజస్థాన్-7, కాక్రాపార్-3 & 4 వంటి చోట్ల కొత్త యూనిట్ల చేరికతో సామర్థ్యం 8.8 గిగావాట్లకు పెరిగింది.

హైదరాబాద్‌లోని ఎన్ఎఫ్‌‌సి పాత్ర, స్వయంప్రతిపత్తి:

భారతదేశం తన అణు అవసరాల కోసం ఎక్కువగా స్వదేశీ సాంకేతికతతో తయారైన 'ప్రెషరైజ్డ్ హెవీ వాటర్ రియాక్టర్ల' పైనే ఆధారపడుతోంది. ఈ రియాక్టర్లకు కావలసిన ఇంధన కడ్డీలను తయారు చేయడంలో హైదరాబాద్‌లోని న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్ కీలక పాత్ర పోషిస్తోంది. దిగుమతి చేసుకున్న యురేనియంను మన దేశ అవసరాలకు తగ్గట్టుగా మార్చుకోవడం వల్ల, ఇంధన శుద్ధి కోసం మనం ఇతర దేశాలపై ఆధారపడాల్సిన అవసరం లేకుండా పోయింది. కేవలం కూడంకుళం ప్లాంట్ మాత్రమే రష్యా నుండి నేరుగా ఇంధనాన్ని పొందుతోంది.

భవిష్యత్తు ప్రాజెక్టులు, సవాళ్లు:

ఆంధ్రప్రదేశ్‌లోని కొవ్వాడ, మహారాష్ట్రలోని జైతాపూర్ ప్రాజెక్టులు భారతదేశపు అతిపెద్ద అణుశక్తి కేంద్రాలుగా మారనున్నాయి.ఆంధ్రప్రదేశ్‌లోని కొవ్వాడ మల్టీ-యూనిట్ న్యూక్లియర్ పార్క్‌ కాగా, అలాగే మహారాష్ట్రలోని జైతాపూర్ ప్రపంచంలోనే అతిపెద్ద అణు విద్యుత్ కేంద్రాలలో ఒకటిగా రూపొందుతుంది.

అయితే, ఇవి భారీ ప్రాజెక్టులు కావడంతో భూసేకరణ, నిధుల సమీకరణ, భద్రతా అనుమతుల దశలో ఉన్నాయి. ఇవి 2030 మధ్య నాటికి పూర్తిస్థాయిలో అందుబాటులోకి రావచ్చు. అలాగే, కాలం చెల్లిన బొగ్గు విద్యుత్ కేంద్రాల స్థానంలో అణు రియాక్టర్లను నిర్మించే సరికొత్త ఆలోచనను కూడా ప్రభుత్వం పరిశీలిస్తోంది, దీనివల్ల భూమి, గ్రిడ్ సౌకర్యాలు సులభంగా లభిస్తాయి.

శాంతి బిల్లు - విప్లవాత్మక మార్పు:

డిసెంబర్ 2025లో తీసుకువచ్చిన ‘శాంతి బిల్లు’ ఒక మైలురాయి. ఇది అణు రంగాన్ని పూర్తిగా ప్రక్షాళన చేసింది. ఈ చట్టం ద్వారా అణు భద్రతా సంస్థలకు స్వయంప్రతిపత్తి కల్పించడమే కాకుండా, నష్టపరిహార బాధ్యత చట్రాన్ని సవరిస్తుంది. అణు ప్రమాదాలు సంభవించినప్పుడు నష్టపరిహార బాధ్యత విషయంలో స్పష్టమైన నిబంధనలను రూపొందించడం ద్వారా విదేశీ సంస్థల భయాందోళనలను తొలగించి, ప్రాజెక్టుల అమలులో జాప్యాన్ని తగ్గించడానికి ఈ బిల్లు మార్గం సుగమం చేస్తోంది.

అలాగే, ఈ బిల్లు భద్రత, ఇంధన నియంత్రణ ప్రభుత్వం వద్దే ఉంచుతూ, ప్రైవేట్ భాగస్వామ్యానికి తలుపులు తీస్తుంది. ప్రైవేట్ పెట్టుబడులకు కూడా మార్గం సులభతరం అవుతుంది. ఇదివరకు కేవలం ప్రభుత్వ రంగ సంస్థలకే పరిమితమైన ఈ రంగంలోకి ప్రైవేట్ భాగస్వామ్యం రావడం వల్ల పనులు వేగవంతం అవుతాయని అధునాతన అంతర్జాతీయ సాంకేతికత భారత్‌లోకి అందుబాటులోకి వస్తుందని ప్రభుత్వం ఆశిస్తోంది.

పునరుత్పాదక ఇంధనాలతో సమతుల్యత:

ప్రస్తుతం భారతదేశ మొత్తం విద్యుత్ సామర్థ్యం 500 గిగావాట్లు కాగా, అందులో 50శాతం శిలాజయేతర వనరుల (సౌర, పవన, జలశక్తి) నుండే వస్తోంది. 2034-35 నాటికి దీని సామర్ధ్యం 1,029 గిగావాట్లకు చేరుకుంటుందని అంచనా. అప్పటికి అణుశక్తి వాటా కేవలం 22 గిగావాట్లు (దాదాపు 2%) ఉన్నప్పటికీ, దాని ప్రాముఖ్యత చాలా ఎక్కువ. ఎందుకంటే ఎండ లేకపోయినా, గాలి వీచకపోయినా అణు విద్యుత్ కేంద్రాలు నిరంతరం పని చేస్తూ గ్రిడ్‌కు స్థిరత్వాన్ని ఇస్తాయి.

సంఖ్య పరంగా తక్కువగా కనిపించినప్పటికీ, అణుశక్తి వాతావరణంతో సంబంధం లేకుండా 24 గంటల పాటు నిరంతర విద్యుత్‌ను అందిస్తాయి. సౌర, పవన విద్యుత్తుకు తోడుగా గ్రిడ్ స్థిరత్వం కోసం అణుశక్తి ఒక వ్యూహాత్మక రక్షణ కవచంలా పనిచేస్తుంది.

2008 నుండి భారతదేశ అణు ప్రయాణం కేవలం విస్తరణ మాత్రమే కాదు, ఇంధన భద్రత విశ్వసనీయతపై దృష్టి పెట్టింది. పునరుత్పాదక ఇంధనం వార్తల్లో నిలుస్తున్నప్పటికీ, అణుశక్తి నిశ్శబ్దంగా దేశ ఇంధన భవిష్యత్తులో కీలక పాత్ర పోషిస్తోంది.