
భారత్ నుంచి 1.80 లక్షల టన్నుల డీజిల్ దిగుమతి చేసుకోనున్న బంగ్లాదేశ్
బంగ్లాదేశ్ తన ఇంధన అవసరాల కోసం భారతదేశంపై మరోసారి ఆధార పడనుంది. ఈ ఏడాది డిసెంబర్ నాటికి భారత్కు చెందిన ప్రభుత్వ రంగ సంస్థ 'నుమాలిగఢ్ రిఫైనరీ లిమిటెడ్' (ఎన్ఆర్ఎల్) నుండి సుమారు 1,80,000 టన్నుల డీజిల్ను దిగుమతి చేసుకోవాలని బంగ్లాదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. దీనికోసం దాదాపు 14.62 బిలియన్ టాకాలను (బంగ్లాదేశ్ కరెన్సీ) ఖర్చు చేయనున్నారు. అంటే భారత కరెన్సీలో ఇది సుమారు వెయ్యి కోట్ల రూపాయలకు పైమాటే.
నిర్ణయం వెనుక ఉన్న వివరాలు
బంగ్లాదేశ్ ఆర్థిక సలహాదారు సలేహుద్దీన్ అహ్మద్ అధ్యక్షతన ఢాకాలో జరిగిన ప్రభుత్వ కొనుగోళ్ల సలహా కమిటీ సమావేశంలో ఈ కీలక నిర్ణయానికి ఆమోదం లభించింది. బంగ్లాదేశ్ పెట్రోలియం కార్పొరేషన్ (BPC) ద్వారా ఈ దిగుమతులు జరుగుతాయి. ఈ కొనుగోలుకు అయ్యే ఖర్చులో కొంత భాగాన్ని BPC నేరుగా చెల్లిస్తుండగా, మిగిలిన మొత్తాన్ని బ్యాంక్ రుణాల ద్వారా సమకూర్చుకోనుంది.
ఒప్పందం విలువ రూ.1,000 కోట్ల పైనే
అంతర్జాతీయ మార్కెట్ ధరలకు అనుగుణంగా ఈ డీజిల్ ధరను నిర్ణయించారు. దీని ప్రకారం, ఒక బారెల్ డీజిల్కు 83.22 డాలర్ల ప్రాథమిక ధరతో పాటు 5.50 డాలర్ల ప్రీమియం ధరను కలిపి చెల్లించాల్సి ఉంటుంది. మొత్తం మీద ఈ ఒప్పందం విలువ 119.13 మిలియన్ అమెరికన్ డాలర్లుగా ఖరారైంది. అయితే, అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరల్లో వచ్చే మార్పుల వల్ల ఈ ధరలో స్వల్ప వ్యత్యాసాలు ఉండవచ్చు.
15 ఏళ్ల సుదీర్ఘ బంధం
ఈ దిగుమతుల గురించి బంగ్లాదేశ్ విద్యుత్, ఇంధన సలహాదారు ముహమ్మద్ ఫౌజుల్ కబీర్ ఖాన్ మాట్లాడుతూ.. ఇది కొత్తగా చేసుకున్న ఒప్పందం కాదని, గత ప్రభుత్వ హయాంలో కుదుర్చుకున్న 15 ఏళ్ల సుదీర్ఘ ఒప్పందంలో భాగమేనని స్పష్టం చేశారు. ఈ ఒప్పందం ప్రకారం భారత్ నుండి నిరంతరం ఇంధన సరఫరా జరుగుతూనే ఉంటుంది.
పైప్లైన్ ద్వారా సరఫరా
భారతదేశంలోని అస్సాంలో ఉన్న నుమాలిగఢ్ రిఫైనరీలో తయారైన డీజిల్ను మొదట సిలిగురికి తరలిస్తారు. అక్కడి నుండి 'భారత్-బంగ్లాదేశ్ ఫ్రెండ్షిప్ పైప్లైన్' (ఐబీఎఫ్పీ) ద్వారా నేరుగా బంగ్లాదేశ్కు సరఫరా చేస్తారు. 2022 డిసెంబర్లో ప్రారంభమైన ఈ పైప్లైన్ ద్వారా రవాణా ఖర్చులు తగ్గడమే కాకుండా, చాలా తక్కువ సమయంలో సురక్షితంగా ఇంధనం చేరుతోంది.
