
భారత్లో రోల్స్ రాయిస్ భారీ పెట్టుబడులు.. యుద్ధ విమానాలు, నౌకల ఇంజిన్లపై దృష్టి
బ్రిటన్కు చెందిన ప్రముఖ ఏరో-ఇంజిన్ తయారీ సంస్థ రోల్స్ రాయిస్ భారత్లో తన కార్యకలాపాలను భారీ స్థాయిలో విస్తరించాలని నిర్ణయించింది. యూకేకు బయట భారత్ను తమ మూడో “హోం మార్కెట్”గా మార్చుకోవడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం జెట్ ఇంజిన్లు, నౌకల కోసం ప్రొపల్షన్ వ్యవస్థలు, భూ రక్షణ వాహనాలు, ఆధునిక ఇంజినీరింగ్ వంటి రంగాల్లో పూర్తి స్థాయిలో పనిచేయాలని సంస్థ భావిస్తోంది.
ఓ ప్రముఖ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రోల్స్ రాయిస్ ఇండియా ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ సాషి ముఖుందన్ మాట్లాడుతూ, భారత్లో భారీ పెట్టుబడులు పెట్టే యోచనలో ఉన్నామని చెప్పారు. ముఖ్యంగా భారత్ అభివృద్ధి చేయనున్న అడ్వాన్స్డ్ మీడియం కాంబాట్ ఎయిర్క్రాఫ్ట్ (ఏఎంసీఏ) కోసం అవసరమైన తదుపరి తరం జెట్ ఇంజిన్ను భారత్లోనే అభివృద్ధి చేయడం తమ ప్రధాన లక్ష్యమని తెలిపారు.
ప్రస్తుతం యూకేతో పాటు అమెరికా, జర్మనీలను రోల్స్ రాయిస్ తమ హోం మార్కెట్లుగా పరిగణిస్తోందని ఆయన చెప్పారు. ఆ దేశాల్లో సంస్థకు తయారీ కేంద్రాలు సహా పెద్ద ఎత్తున కార్యకలాపాలు కొనసాగుతున్నాయని వివరించారు. ఇప్పుడు అదే స్థాయిలో భారత్ను కూడా అభివృద్ధి చేయాలని రోల్స్ రాయిస్ భావిస్తోందన్నారు.
భారత నౌకాదళ యుద్ధ సామర్థ్యాన్ని పెంచేందుకు అవసరమైన ఎలక్ట్రిక్ ప్రొపల్షన్ సాంకేతికతలోనూ రోల్స్ రాయిస్ కీలకంగా సహకరించగలదని ముఖుందన్ తెలిపారు. ఏఎంసీఏ కోసం తయారయ్యే జెట్ ఇంజిన్ టెక్నాలజీని, నౌకల ఇంజిన్ల తయారీకీ ఉపయోగించవచ్చని చెప్పారు. విమాన ఇంజిన్లను నౌకా అవసరాలకు అనుగుణంగా మార్చే సామర్థ్యం ప్రపంచంలో చాలా కొద్దిమంది కంపెనీలకే ఉందని, వాటిలో రోల్స్ రాయిస్ ఒకటని ఆయన అన్నారు.
పెట్టుబడుల మొత్తం ఎంత అన్నది చెప్పకపోయినా, అది గణనీయమైన స్థాయిలోనే ఉంటుందని ముఖుందన్ స్పష్టం చేశారు. “సంఖ్య చెప్పలేను కానీ, దాని ప్రభావం మాత్రం అందరికీ స్పష్టంగా కనిపిస్తుంది. మా లక్ష్యం కేవలం ఫ్యాక్టరీలు పెట్టడం కాదు, అన్ని రంగాల్లో పూర్తి సరఫరా వ్యవస్థను, పరిశ్రమల ఎకోసిస్టమ్ను భారత్లో అభివృద్ధి చేయడమే” అని ఆయన చెప్పారు.
భారత్లోని రెండు రక్షణ రంగ ప్రభుత్వ సంస్థలతో త్వరలోనే రెండు అవగాహనా ఒప్పందాలు కుదుర్చుకోనున్నట్లు ఆయన తెలిపారు. ఇందులో ఒక ఒప్పందం అర్జున్ ట్యాంకుల ఇంజిన్ల తయారీకి, మరొకటి భవిష్యత్తులో ఉపయోగించే రెడీ కాంబాట్ వాహనాల ఇంజిన్లకు సంబంధించినదిగా ఉంటుందని చెప్పారు.
గత అక్టోబర్లో రోల్స్ రాయిస్ సీఈఓ టుఫాన్ ఎర్గిన్బిల్గిచ్ ప్రధాని నరేంద్ర మోడీతో జరిగిన సమావేశంలో, భవిష్యత్తులో భారత్ రోల్స్ రాయిస్కు చాలా కీలకమైన దేశంగా మారుతుందని తెలిపారని ముఖుందన్ గుర్తు చేశారు. “యూకేకు బయట ఇప్పటికే అమెరికా, జర్మనీలను హోం మార్కెట్లుగా అభివృద్ధి చేశాం. ఇప్పుడు భారత్ను మా తదుపరి హోం మార్కెట్గా మార్చాలని భావిస్తున్నాం. ఇది కేవలం రక్షణ రంగానికే పరిమితం కాదు” అని ఆయన అన్నారు.
ఈ లక్ష్యం రక్షణ రంగంతో పాటు నౌకా ప్రొపల్షన్, భూ రక్షణ వ్యవస్థలు, తయారీ రంగం, ఆధునిక ఇంజినీరింగ్ నైపుణ్యాలు, సాంకేతిక అభివృద్ధి వంటి అనేక రంగాలకు విస్తరిస్తుందని చెప్పారు. ఇవన్నీ భారత్ ప్రస్తుతం ఇస్తున్న ప్రాధాన్యాలకు పూర్తిగా సరిపోతాయని తెలిపారు. ఏఎంసీఏ ఇంజిన్ల విషయంలో ఇప్పటికే విస్తృత స్థాయి చర్చలు కొనసాగుతున్నాయని ముఖుందన్ చెప్పారు. “తదుపరి తరం ఇంజిన్ల విషయానికి వస్తే, భారత్కు రోల్స్ రాయిస్ ఉత్తమ భాగస్వామి. మాకు అవసరమైన అనుభవం, సాంకేతిక సామర్థ్యం రెండూ ఉన్నాయి” అని ఆయన అన్నారు.
ఏఎంసీఏ కోసం రూపొందించే ఇంజిన్ డిజైన్ మొత్తం భారత్లోనే చేయవచ్చని, అవసరమైన సాంకేతికతను బదిలీ చేయడంతో పాటు కొత్త మేధోసంపత్తి హక్కులను (ఐపీ) భారత్తో కలిసి కలిగి ఉండవచ్చని ఆయన స్పష్టం చేశారు. “డిజైన్ హక్కులు మీ చేతుల్లో ఉంటే, పూర్తి వ్యూహాత్మక నియంత్రణ కూడా మీకే ఉంటుంది” అని చెప్పారు.
ఈ ఇంజిన్లు భారత నౌకాదళానికి అవసరమైన ఎలక్ట్రిక్, హైబ్రిడ్ ప్రొపల్షన్ వ్యవస్థల అభివృద్ధికి కూడా ఉపయోగపడతాయని తెలిపారు. విమాన ఇంజిన్ కోర్ ఆధారంగా తయారయ్యే నౌకా గ్యాస్ టర్బైన్లు, ఒకే సరఫరా వ్యవస్థతో వాయు, నౌకా రంగాలకు ఉపయోగపడతాయని వివరించారు. ప్రపంచవ్యాప్తంగా జెట్ ఇంజిన్ తయారీలో రోల్స్ రాయిస్కు ఉన్న బలమైన స్థితిని కూడా ఆయన ప్రస్తావించారు. యూరోఫైటర్ టైఫూన్ యుద్ధ విమానానికి ఉపయోగించే ఈజే200 ఇంజిన్, అలాగే ఆరో తరం యుద్ధ విమానాల కోసం యూకే-జపాన్-ఇటలీ కలిసి చేపట్టిన గ్లోబల్ కాంబాట్ ఎయిర్క్రాఫ్ట్ ప్రోగ్రామ్లోనూ రోల్స్ రాయిస్ కీలక పాత్ర పోషిస్తోందన్నారు.
అలాగే ఐదో తరం యుద్ధ విమానం ఎఫ్-35 కోసం జీఈతో కలిసి ఇంజిన్ అభివృద్ధిలో భాగస్వామిగా పనిచేసిందని తెలిపారు. భారత్లో స్వదేశీ రక్షణ సామర్థ్యాల నిర్మాణంపై కేంద్ర ప్రభుత్వానికి ఉన్న స్పష్టమైన దృష్టిని ముఖుందన్ ప్రశంసించారు. “దీర్ఘకాలంలో భారత్ ఒక పెద్ద గ్లోబల్ శక్తిగా ఎదుగుతుంది. అందుకే రోల్స్ రాయిస్కు భారత్ కేవలం మార్కెట్ మాత్రమే కాదు, ఒక దీర్ఘకాల వ్యూహాత్మక హోం” అని ఆయన అన్నారు.
మొత్తానికి రక్షణ రంగంలో 'మేక్ ఇన్ ఇండియా' లక్ష్యానికి రోల్స్ రాయిస్ రాక ఒక పెద్ద భరోసా ఇవ్వబోతోంది. దీనివల్ల భారతదేశం రక్షణ రంగంలో స్వయంసమృద్ధి సాధించడమే కాకుండా, ప్రపంచ దేశాలకు యుద్ధ విమాన ఇంజన్లను ఎగుమతి చేసే స్థాయికి కూడా చేరుకోవచ్చు.
