Let's talk: editor@tmv.in
భారత్‌ను 'ఏఐ అగ్రరాజ్యం'గా మార్చేందుకు రిలయన్స్ రూ. 10 లక్షల కోట్ల మాస్టర్ ప్లాన్

భారత్‌ను 'ఏఐ అగ్రరాజ్యం'గా మార్చేందుకు రిలయన్స్ రూ. 10 లక్షల కోట్ల మాస్టర్ ప్లాన్

Dantu Vijaya Lakshmi Prasanna
20 ఫిబ్రవరి, 2026

భారతదేశాన్ని ఇంటర్నెట్ యుగం నుండి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగంలోకి నడిపించేందుకు రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ ఒక సంచలన ప్రకటన చేశారు. గురువారం ఢిల్లీలో జరిగిన 'ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026'లో ఆయన ప్రసంగిస్తూ, రాబోయే ఏడేళ్ల కాలంలో రిలయన్స్, జియో సంయుక్తంగా రూ. 10 లక్షల కోట్లను ఏఐ మౌలిక సదుపాయాల కోసం పెట్టుబడి పెట్టనున్నట్లు వెల్లడించారు. ఈ భారీ పెట్టుబడి దేశ ఆర్థిక ముఖచిత్రాన్ని మార్చేయడమే కాకుండా, ప్రపంచ స్థాయిలో భారత్‌ను టెక్నాలజీ లీడర్‌గా నిలబెడుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

వ్యూహాత్మక పెట్టుబడి

ఈ పెట్టుబడి కేవలం కంపెనీ విలువను పెంచుకోవడానికి లేదా వ్యాపార విస్తరణ కోసం చేస్తున్నది కాదని అంబానీ స్పష్టం చేశారు. ఇది దేశ నిర్మాణానికి అంకితం చేసిన క్రమశిక్షణతో కూడిన మూలధనం అని ఆయన అభివర్ణించారు. రాబోయే దశాబ్దాల పాటు భారతదేశానికి వ్యూహాత్మక బలాన్ని, ఆర్థిక స్థిరత్వాన్ని అందించేలా ఈ నిధులను వెచ్చించనున్నట్లు తెలిపారు. గాలిలో దీపాలు పెట్టే పెట్టుబడి కాకుండా, పక్కా ప్రణాళికతో కూడిన దీర్ఘకాలిక లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.

మూడు అంచెల వ్యూహం

భారతదేశ రూపాంతరానికి సంబంధించి అంబానీ మూడు కీలక ప్రకటనలు చేశారు. మొదటిది, గతంలో జియో భారతీయులందరినీ ఇంటర్నెట్‌తో ఎలా అనుసంధానించిందో, ఇప్పుడు ప్రతి పౌరుడికి ఏఐని చేరువ చేయడమే లక్ష్యంగా పెట్టుకుంది. రెండవది, రూ. 10 లక్షల కోట్ల పెట్టుబడిని ఈ ఏడాది నుండే ప్రారంభించడం. మూడవది, భారతదేశపు స్వంత 'సార్వభౌమ కంప్యూటర్ మౌలిక సదుపాయాల'ను నిర్మించడం ద్వారా దేశ డేటా భద్రతను కాపాడటం.

గిగావాట్-స్కేల్ డేటా సెంటర్లు

టెక్నాలజీ రంగంలో మౌలిక సదుపాయాల ప్రాముఖ్యతను వివరిస్తూ, జామ్‌నగర్‌లో మల్టీ-గిగావాట్ సామర్థ్యం కలిగిన ఏఐ రెడీ డేటా సెంటర్ల నిర్మాణం ఇప్పటికే ప్రారంభమైందని అంబానీ వెల్లడించారు. ఇందులో భాగంగా 120 మెగావాట్ల సామర్థ్యం 2026 ద్వితీయార్థం నాటికి అందుబాటులోకి రానుంది. ఇవి ప్రపంచంలోనే అత్యుత్తమ ప్రమాణాలతో కూడిన డేటా సెంటర్లుగా నిలుస్తాయని, ఇవి భారతదేశపు భారీ డేటా అవసరాలను తీరుస్తాయని ఆయన వివరించారు.

గ్రీన్ ఎనర్జీ అడ్వాంటేజ్

ఏఐ కంప్యూటింగ్ కోసం విపరీతమైన విద్యుత్ అవసరమవుతుంది. దీనిని దృష్టిలో ఉంచుకుని, రిలయన్స్ తన సొంత 'గ్రీన్ ఎనర్జీ' సామర్థ్యాన్ని వాడుకోనుంది. ఆంధ్రప్రదేశ్ గుజరాత్‌లోని కచ్ ప్రాంతాల్లో ఉన్న సోలార్ ప్రాజెక్టుల ద్వారా 10 గిగావాట్ల హరిత ఇంధనాన్ని ఈ డేటా సెంటర్ల కోసం కేటాయించనున్నారు. దీనివల్ల పర్యావరణానికి హాని కలగకుండా తక్కువ ఖర్చుతో కూడిన ఏఐ సేవలను అందించడం సాధ్యమవుతుందని అంబానీ పేర్కొన్నారు.

తక్కువ ధరకే ఏఐ సేవలు

గతంలో జియో రాకతో డేటా ధరలు ఎలాగైతే ప్రపంచంలోనే అత్యల్ప స్థాయికి పడిపోయాయో, ఏఐ విషయంలోనూ అదే మ్యాజిక్ పునరావృతం కానుంది. "భారతదేశం తెలివితేటలను అద్దెకు తీసుకోకూడదు" అని అంబానీ గట్టిగా చెప్పారు. విదేశీ టెక్నాలజీపై ఆధారపడకుండా, స్వదేశీ పరిజ్ఞానంతో అత్యంత తక్కువ ధరకే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను సామాన్యుడికి సైతం అందుబాటులోకి తెస్తామని ఆయన వాగ్దానం చేశారు.

జియో ఏఐ భారత్

భాషా పరమైన అడ్డంకులను తొలగించడానికి " జియో ఏఐ భారత్ " అనే మల్టీలింగువల్ ఏఐ ఫ్లాట్‌ఫామ్‌ను ఆయన పరిచయం చేశారు. ఇది భారతీయ అధికారిక భాషలన్నింటిలో పనిచేస్తుంది. దీనివల్ల సామాన్య రైతులు, చేతివృత్తుల వారు విద్యార్థులు తమ సొంత మాతృభాషలోనే ఏఐతో సంభాషించి అవసరమైన సమాచారాన్ని పొందవచ్చు. ఇది డిజిటల్ విభజనను తొలగించి, గ్రామీణ భారతానికి సైతం సాంకేతిక ఫలాలను అందిస్తుంది.

ఉద్యోగాల సృష్టి, భవిష్యత్తు

ఏఐ వల్ల ఉద్యోగాలు పోతాయన్న భయాలపై అంబానీ స్పందిస్తూ, ఇది ఉద్యోగాలను తీసివేయడం కాదు, సరికొత్త ఉన్నత నైపుణ్యంతో కూడిన ఉపాధి అవకాశాలను సృష్టిస్తుందని భరోసా ఇచ్చారు. వ్యవసాయం, విద్య, వైద్యం తయారీ రంగాల్లో ఏఐ విప్లవాత్మక మార్పులు తెస్తుందని ఆయన అన్నారు. 21వ శతాబ్దంలో భారతదేశం ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన ఏఐ దేశంగా ఎదగడానికి మన దేశంలోని యువశక్తి, ప్రజాస్వామ్యం, భారీ డేటా ప్రధాన కారణాలని ఆయన ముగించారు.