
భారతీయ సంస్కృతిలో ఆధునికత, ఆధ్యాత్మికత కలయికే ఒక గొప్ప శక్తి: రాష్ట్రపతి
భారతదేశ సంస్కృతికి ఆధునికత, ఆధ్యాత్మికతల సమన్వయమే ప్రధాన బలం అని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. దేశానికి ఉన్న గొప్ప ఆధ్యాత్మిక వారసత్వం ప్రపంచం ఎదుర్కొంటున్న మానసిక, నైతిక, పర్యావరణ సమస్యలకు పరిష్కార మార్గాలను చూపిస్తుందని ఆమె స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ గవర్నర్ జిష్ణు దేవ్ వర్మతో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.
హైదరాబాద్లోని బ్రహ్మకుమారీస్ శాంతి సరోవర్ 21వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ‘టైమ్లెస్ విజ్డమ్ ఆఫ్ భారత్ పాత్వేస్ ఆఫ్ పీస్ అండ్ ప్రోగ్రెస్’ అనే అంశంపై నిర్వహించిన సదస్సులో రాష్ట్రపతి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. భారతీయ సంస్కృతి కేవలం సంప్రదాయాలకు పరిమితం కాకుండా, ఆధునిక అవసరాలకు అనుగుణంగా మారుతూ ఆధ్యాత్మిక విలువలను కాపాడుకుంటోందని ఆమె అన్నారు.
ప్రపంచ శాంతి సాధనకు ‘వసుధైవ కుటుంబకం’ అనే భావన అత్యంత అవసరమని ముర్ము పేర్కొన్నారు. ప్రపంచమంతా ఒకే కుటుంబంగా భావించే ఈ తత్వం నేటి కాలంలో విభేదాలు, ఘర్షణలను తగ్గించి పరస్పర గౌరవం, సహకారాన్ని పెంపొందిస్తుందని ఆమె చెప్పారు. భారతీయ ఆధ్యాత్మిక దృష్టికోణం వ్యక్తిగత శాంతికే కాకుండా సామూహిక మంగళానికి దారి తీస్తుందని అభిప్రాయపడ్డారు.
ఆధ్యాత్మికత సామాజిక ఐక్యతకు, జాతీయ పురోగతికి బలమైన పునాది అని రాష్ట్రపతి పేర్కొన్నారు. వ్యక్తులు మానసిక స్థిరత్వం, నైతిక విలువలు, స్వీయ నియంత్రణను పెంపొందించుకుంటే వారి ప్రవర్తన ద్వారా సమాజంలో క్రమశిక్షణ, సహనం, సహకారం పెరుగుతాయని అన్నారు. ఆధ్యాత్మిక చైతన్యంతో ప్రేరణ పొందిన వ్యక్తులు తమ కర్తవ్యాలపై అవగాహన కలిగి, సమాజంలో సానుకూల మార్పు తీసుకురావడానికి ప్రయత్నిస్తారని, అలాంటి వారు దేశ నిర్మాణంలో చురుకైన పాత్ర పోషిస్తారని ముర్ము చెప్పారు.
బ్రహ్మకుమారీస్ సంస్థ దశాబ్దాలుగా భారతీయ విశ్వ మానవ విలువలను అనేక దేశాలకు విస్తరింపజేస్తుండటంపై ఆమె ఆనందం వ్యక్తం చేశారు. శాంతి, సానుకూలతను పెంపొందిస్తూ సమాజంలోని నైతిక, భావోద్వేగ పునాదిని బలోపేతం చేయడంలో ఈ సంస్థ విశేష కృషి చేస్తోందని ప్రశంసించారు.
ఇదిలా ఉండగా, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రస్తుతం తన శీతాకాల నివాసంలో భాగంగా హైదరాబాద్లోని రాష్ట్రపతి నిలయానికి వచ్చారని అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె నగరంలో పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నట్లు వెల్లడించారు.
