
భారతీయ బియ్యంపై అమెరికా అధిక సుంకం
అమెరికా బుద్ది మరోసారి బయటపడింది. భారత్ లో రష్యా అద్యక్షుడు పుతిన్ పర్యటన తర్వాత అమెరికా భారత్ పై అక్కసు వెళ్లగక్కింది. భారత్ నుండి వచ్చే బియ్యం దిగుమతులపై సుంకాల మోత మోగించేందుకు యుఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సిద్దమయ్యాడు. భారత్ నుండి వచ్చే బియ్యం దిగుమతులపై 50% టారిఫ్ విదిస్తామని ప్రకటిస్తూ తాజాగా అమెరికా ఒక ప్రకటన చేసింది
దీనిపై స్పందించిన ఇండియన్ రైస్ ఎక్స్పోర్టర్స్ ఫెడరేషన్ భారతదేశం నుండి బియ్యం దిగుమతులపై యునైటెడ్ స్టేట్స్ విధించిన అధిక సుంకం ప్రభావం అంతిమంగా అమెరికన్ వినియోగదారులపై పడే అవకాశం ఉందని ఒక ప్రకటనలో తెలిపింది.
యుఎస్ మార్కెట్లో భారతీయ బాస్మతి బియ్యంకు బలమైన, ప్రత్యేకమైన డిమాండ్ ఉంది. గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనిషియేటివ్, ఇండియన్ రైస్ ఎక్స్పోర్టర్స్ ఫెడరేషన్లు చెప్పినట్లుగా, ఈ బియ్యంలో ఉండే ప్రత్యేక సువాసన, రుచి, ఆకృతి కారణంగా యుఎస్ లో పండించే బియ్యం దీనికి సులభంగా ప్రత్యామ్నాయం కాలేవు.
"భారత్ మార్కెట్ కు యుఎస్ ఒక ముఖ్యమైన గమ్యస్థానమైనప్పటికీ, భారత బియ్యం ఎగుమతులు ప్రపంచ మార్కెట్ల అంతటా బాగా వైవిధ్యభరితంగా ఉన్నాయి. భారత ప్రభుత్వం సన్నిహిత సమన్వయంతో, ఫెడరేషన్ సహాయంతో ఇప్పటికే ఉన్న వాణిజ్య భాగస్వామ్యాలను మరింతగా పెంచుతోంది. భారతీయ బియ్యం కోసం కొత్త మార్కెట్లను తెరుస్తోంది. రిటైల్ మార్కెట్ల నుండి వచ్చిన ఆధారాలు, సుంకం భారం ఎక్కువగా యుఎస్ వినియోగదారులకు బదిలీ చేయబడిందని సూచిస్తున్నాయి" అని ఫెడరేషన్ తెలిపింది.
ఈ అధిక సుంకం అంశాన్ని పరిగణలోకి తీసుకుని భారత్ ఇతర దేశాలతో వాణిజ్య భాగస్వామ్యాన్ని మరింత పటిష్టం చేసుకొని, భారతీయ బియ్యం కోసం కొత్త మార్కెట్లను విస్తరించాలని కూడా ఆ ఫెడరేషన్ పేర్కొంది.
అయితే, భారతీయ బియ్యం ఎగుమతులపై అదనంగా 50శాతం సుంకాన్ని విధించనున్నట్లు యుఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన తాజా ప్రకటన, పెద్ద విధానపరమైన మార్పు కంటే, అంతర్గత రాజకీయ సందేశాల ద్వారానే ఎక్కువగా నడపబడుతున్నట్లు నిపుణులు కూడా గుర్తించారు.
భారతీయ థింక్ ట్యాంక్ అయిన గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనిషియేటివ్ (వాణిజ్యం రంగంలో పనిచేస్తుంది) డిసెంబర్ 8న కొత్త యుఎస్ వ్యవసాయ ఉపశమన ప్యాకేజీతో పాటు చేసిన ఈ ప్రకటన, యుఎస్ రైతులను లక్ష్యంగా చేసుకున్న ఎన్నికల కాలపు కమ్యునికేషన్ లాగా కనిపిస్తోందని పేర్కొంది. "భారతీయ బియ్యంపై అధిక సుంకాలు విధించడానికి ట్రంప్ బెదిరిస్తున్నారు. కానీ ఈ బెదిరింపు రాజకీయాలు, విధానం కాదు" అని థింక్ ట్యాంక్ పేర్కొంది.
తాజా సుంకాలు విధించినప్పటికీ, ఇతర మార్కెట్లలో బలమైన డిమాండ్ కారణంగా భారతీయ ఎగుమతిదారులపై ప్రభావం పరిమితంగా ఉంటుందని గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనిషియేటివ్ అభిప్రాయపడింది. అయినా అధిక సుంకాలు భారతీయ బియ్యం రకాలను ఆశ్రయించే అమెరికన్ కుటుంబాలకు బియ్యాన్ని మరింత ఖరీదైనదిగా చేస్తాయని తెలిపింది.
ఈ వ్యాఖ్యలకు ప్రతిస్పందనగా, ఇండియన్ రైస్ ఎక్స్పోర్టర్స్ ఫెడరేషన్ ఇండో-యుఎస్ బియ్యం వాణిజ్య డైనమిక్స్పై వివరణాత్మక స్పష్టీకరణలను జారీ చేసింది.
"భారతీయ బియ్యం ఎగుమతి పరిశ్రమ స్థితిస్థాపకత కలిగి ఉంది. ఇది ప్రపంచవ్యాప్తంగా పోటీపడుతుంది," అని ఇండియన్ రైస్ ఎక్స్పోర్టర్స్ ఫెడరేషన్ ఉపాధ్యక్షుడు దేవ్ గార్గ్ అన్నారు. ఐఆర్ఇఎఫ్ ప్రకారం, 2024-2025 ఆర్థిక సంవత్సరంలో, భారతదేశం 274,213.14 మెట్రిక్ టన్నుల బాస్మతి బియ్యాన్ని యూఎస్డీ 337.10 మిలియన్ల విలువైన ఎగుమతి చేసింది. దీనితో యుఎస్ భారతీయ బాస్మతికి 4వ అతిపెద్ద మార్కెట్గా నిలిచింది. అదే కాలంలో, భారతదేశం 61,341.54 మెట్రిక్ టన్నుల నాన్-బాస్మతి బియ్యాన్ని యూఎస్డీ 54.64 మిలియన్ల విలువైన ఎగుమతి చేసింది, దీనితో యుఎస్ నాన్ బాస్మతి బియ్యం కోసం 24వ అతిపెద్ద మార్కెట్గా నిలిచింది.
యుఎస్ లో భారతీయ బియ్యాన్ని ప్రధానంగా గల్ఫ్, దక్షిణాసియా ప్రాంతాలకు చెందిన వర్గాలు వినియోగిస్తున్నారని ఫెడరేషన్ వివరించింది. ముఖ్యంగా బిర్యానీ వంటి వంటకాల కోసం డిమాండ్ పెరుగుతూనే ఉంది. దీనిలో బాస్మతి బియ్యాన్ని అవసరమైనదిగా పరిగణిస్తారు. ఈ లోటు సులభంగా భర్తీ చేయడం సాధ్యం కాదు. యుఎస్ లో పండించిన బియ్యం, దాని ప్రత్యేకమైన సువాసన, రుచి, ఆకృతి పొడవు కారణంగా భారతీయ బాస్మతికి ప్రత్యక్ష ప్రత్యామ్నాయం కాదని పెడరేషన్ చెప్పింది.
తాజా సుంకం పెంపునకు ముందు, భారతీయ బియ్యం ఇప్పటికే 10శాతం సుంకాన్ని ఎదుర్కొంటోందని, 50శాతం సుంకం విధించిన తర్వాత ఇది 40శాతం పాయింట్లు పెరిగిందని ఆ ప్రకటన తెలిపింది. అయినా ఎగుమతుల్లో పెద్ద అంతరాయం కనిపించలేదు. ఎందుకంటే చాలావరకు వ్యయ పెరుగుదల అధిక రిటైల్ ధరల ద్వారా వినియోగదారులకు బదిలీ చేయబడింది. అయితే భారతదేశంలోని రైతులు, ఎగుమతిదారులు స్థిరమైన రాబడిని పొందడం కొనసాగించారు.
గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనిషియేటివ్ ప్రకారం, భారతదేశం ఈ సుంకం బెదిరింపును ఎన్నికల కాలపు వ్యూహంగా పరిగణించాలి. దాని వాణిజ్య స్థానాన్ని ప్రభావితం చేసే రాయితీలను అందించకుండా ఉండాలి. ఎందుకంటే అటువంటి చర్యలు భారతీయ ఎగుమతిదారుల కంటే యుఎస్ వినియోగదారులకు ఎక్కువ హాని కలిగించవచ్చు.
