
భారతదేశం - ప్రపంచ తుఫానుల మధ్య వృద్ధి
HSBC మ్యూచువల్ ఫండ్ యొక్క ఇటీవలి నివేదిక ప్రకారం, భారతదేశ ఆర్థిక వృద్ధి తిరిగి ఊపందుకుంటున్నట్లు కనిపిస్తోంది. ఈ నివేదిక తక్కువ వడ్డీ రేట్లు, ఆరోగ్యకరమైన ద్రవ్య లభ్యత (లిక్విడిటీ), ముడి చమురు ధరల తగ్గుదల, సాధారణ వర్షపాతం వంటి అనేక దేశీయ అంశాలు ఆర్థిక కార్యకలాపాలు పెరగడానికి మద్దతుగా ఉన్నాయని తెలియజేసింది. "భారతదేశంలో వృద్ధి చక్రం అట్టడుగు స్థాయికి చేరుకొని ఉండవచ్చు. వడ్డీ రేటు, ద్రవ్య లభ్యత చక్రాలు, ముడి చమురు ధరల తగ్గుదల సాధారణ వర్షపాతం అన్నీ భవిష్యత్తులో వృద్ధి పుంజుకోవడానికి మద్దతుగా ఉన్నాయి" అని నివేదిక తెలిపింది, ఇది ప్రైవేట్, ప్రభుత్వ రంగ పెట్టుబడులపై ఆశావాదాన్ని సూచిస్తుంది.
భారతదేశం $4 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ దిశగా ప్రయాణం స్థితిస్థాపకతను (నిలదొక్కుకునే సామర్థ్యం) పరివర్తనను ప్రతిబింబిస్తుంది. 1947లో స్వాతంత్ర౦ వచ్చినప్పుడు, దేశం పేదరికం, కరువులు అలాగే కేవలం 12 శాతం మాత్రమే అక్షరాస్యత రేటును కలిగివుంది. నెహ్రూ నేతృత్వంలోని ప్రభుత్వ పారిశ్రామికీకరణ మౌలికసదుపాయాల అభివృద్ది లేక వృద్ధి స్తంభించిపోయింది, కేవలం హరిత విప్లవం మాత్రమే విజయాన్ని అందించింది.
1980లలో తొలి సంస్కరణలు, కంప్యూటర్లు టెలికాం విస్తరణ వచ్చాయి, అయినప్పటికీ 1991 నాటికి భారతదేశం తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంది. చారిత్రక సంస్కరణలు లైసెన్స్ విదానాల్ని రద్దు చేశాయి, వాణిజ్యాన్ని సరళీకరించాయి. విదేశీ పెట్టుబడులను స్వాగతించాయి, ఎగుమతులు, వ్యవస్థాపకతకు ఆజ్యం పోశాయి. 2000లలో వచ్చిన ఐటీ విప్లవం బెంగళూరు, పూణే , హైదరాబాద్లను ప్రపంచ టెక్ హబ్లుగా మార్చింది, ఇది అధిక వృద్ధికి దారితీసింది. 2008, 2020 సంక్షోభాలు ఉన్నప్పటికీ, భారతదేశం కోలుకుని, మహమ్మారి తర్వాత తొమ్మిది శాతం వృద్ధిని సాధించింది. 2025 నాటికి $4 ట్రిలియన్ మైలురాయిని అధిగమించింది. ఇది దశాబ్దాల విధాన ఆధారిత నిర్మాణ పరివర్తనకు నిదర్శనం.
చారిత్రక సవాళ్ల మధ్య $4 ట్రిలియన్ మైలురాయి
భారతదేశం అధికారికంగా $4 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ మార్కును అధిగమించింది, ఇది బ్రిటీష్ పాలనలో వనరులను హరించడం, నిర్మాణ అభివృద్ధిని అడ్డుకోవడం వంటి శతాబ్దాల వలసవాద దోపిడీని పరిగణనలోకి తీసుకుంటే ఒక ముఖ్యమైన విజయం. నేడు, భారతదేశ వృద్ధి స్థితిస్థాపకత, నిర్మాణాత్మక సంస్కరణలు, వ్యూహాత్మక విధాన రూపకల్పనను ప్రతిబింబిస్తుంది.
అయినప్పటికీ, భారతదేశ చారిత్రక నేపథ్యానికి వ్యతిరేకంగా చూసినప్పుడు ఈ మైలురాయి మరింత అద్భుతంగా కనిపిస్తుంది. ఆగష్టు 15, 1947 అర్ధరాత్రి వేళ, జవహర్లాల్ నెహ్రూ స్వరం పార్లమెంట్లో ప్రతిధ్వనించింది: "చాలా ఏళ్ల క్రితం, మేము విధి (డెస్టినీ) తో ఒక ఒప్పందం చేసుకున్నాము..." భారతదేశం స్వాతంత్ర౦ సాధించింది, కానీ వేడుకల వెనుక కఠినమైన వాస్తవం ఉంది, అది పేదరికం, విభజించబడిన దేశం. 1700లలో, భారతదేశం ప్రపంచ జీడీపీ లో దాదాపు 24 శాతం వాటాను కలిగి ఉంది, "బంగారు పక్షి" (గోల్డెన్ బర్డ్) అనే బిరుదును సంపాదించింది. స్వాతంత్ర౦ వచ్చేనాటికి, ఆ వాటా 4 శాతం కంటే తక్కువకు పడిపోయింది. కరువులు, ఆహార కొరత కేవలం 12 శాతం అక్షరాస్యత రేటు కొత్త గణతంత్రాన్ని నిర్వచించాయి, అప్పట్లో ప్రజల ఆయుర్దాయం 32 సంవత్సరాలుగా ఉండేది. భవిష్యత్తును నిర్మించడానికి, భారతదేశం మొదట తన వర్తమానాన్ని తట్టుకుని నిలబడవలసి వచ్చింది.
స్వాతంత్ర౦ తర్వాత దశాబ్దాలలో, భారతదేశం ప్రధానమంత్రి నెహ్రూ ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆధారిత పారిశ్రామికీకరణను కొనసాగించింది. సోవియట్ ప్రేరేపిత పంచవర్ష ప్రణాళికల ద్వారా ఉక్కు కర్మాగారాలు, డ్యామ్లు, బ్యాంకులు నిర్మించడం జరిగింది. ఈ కార్యక్రమాలు అవసరమైన మౌలిక సదుపాయాలను నిర్మించినప్పటికీ, లైసెన్స్ విధానం ప్రైవేట్ సంస్థలను అణచివేసింది, సూదుల నుండి టెలిఫోన్ లైన్ల వరకు ప్రతిదానికీ అనుమతులు అవసరం అయ్యేవి. ఆర్థిక వృద్ధి దాదాపు మూడు శాతం వద్ద స్తంభించింది, దీనిని "హిందూ వృద్ధి రేటు" అని పిలిచేవారు. 1960ల నాటి హరిత విప్లవం ఒక మలుపుగా మారింది. ఇది ముంచుకొస్తున్న కరువులను ఆహార భద్రతగా మార్చింది. నిర్మాణ సవాళ్లను అధిగమించగల భారతదేశ సామర్థ్యాన్ని ప్రపంచానికి పరిచయం చేసింది.
1980లలో సంస్కరణలు
1980లలో ఆర్థిక సరళీకరణ తొలి సంకేతాలు కనిపించాయి. రాజీవ్ గాంధీ పదవీకాలం కంప్యూటర్లను ప్రవేశపెట్టింది, టెలికమ్యూనికేషన్స్ను విస్తరించింది. వస్త్రాల వంటి రంగాలను నియంత్రణల నుండి విడుదల చేసింది (డిరెగ్యులేట్ చేసింది). వృద్ధి ఐదు నుండి ఆరు శాతానికి పెరిగింది. పట్టణ శ్రేయస్సు మెరుగవడం ప్రారంభమైంది. మధ్యతరగతి కుటుంబాలు తమ మొదటి మారుతి సుజుకి కార్లు, రంగుల టెలివిజన్లను కొనుగోలు చేశాయి. ఇది వినియోగదారు ఆధునికత పెరుగుదలను సూచించింది. అయినప్పటికీ, 1991 నాటికి, భారతదేశం స్వాతంత్ర౦ వచ్చినప్పటి నుండి అత్యంత దారుణమైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంది, విదేశీ మారక నిల్వలు కేవలం రెండు వారాల దిగుమతులకు మాత్రమే సరిపోగా, హామీ (కొలేట్రల్) గా లండన్కు బంగారాన్ని విమానంలో తరలించాల్సిన పరిస్థితి ఏర్పడింది.
1991: ఊహించని మలుపు
ప్రధానమంత్రి పి.వి. నరసింహారావు ఆర్థిక మంత్రి, డాక్టర్ మన్మోహన్ సింగ్ ఆధ్వర్యంలో, భారతదేశం లైసెన్స్ విధానాన్నిసరళతరం చేసింది, వాణిజ్య అడ్డంకులను తగ్గించింది, రూపాయి విలువను తగ్గించింది. విదేశీ పెట్టుబడులను స్వాగతించింది. వృద్ధి పుంజుకుంది, ఎగుమతులు పెరిగాయి. వ్యవస్థాపకులు రెక్కలు వచ్చాయి. ఈ సంస్కరణలు ప్రపంచ మార్కెట్లతో అనుసంధానం కాగల ఆధునిక ఆర్థిక వ్యవస్థకు పునాది వేశాయి.
ఐటీ విప్లవంతో ప్రపంచ అనుసంధానం
2000ల నాటికి, భారతదేశం ప్రపంచ ఐటీ శక్తి కేంద్రంగా ఉద్భవించింది. బెంగళూరు, పూణే హైదరాబాద్ బహుళజాతి సంస్థల బ్యాక్ ఆఫీస్ కార్యకలాపాలకు కేంద్రాలుగా మారాయి. ఇన్ఫోసిస్, టీసీఎస్, విప్రో వంటి కంపెనీలు దేశవ్యాప్తంగా తెలిసిన పేర్లుగా మారాయి, 2003 2008 మధ్య, జీడీపీ వృద్ధి సగటున 8.8 శాతంగా ఉంది, ఇది అనేక ఇతర దేశాలను అధిగమించింది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారతదేశం యొక్క అనుసంధానం దాని స్థితిస్థాపకతను బలోపేతం చేసింది, 2008 ప్రపంచ ఆర్థిక సంక్షోభం వంటి షాక్లను తట్టుకుని, 2010 నాటికి తొమ్మిది శాతం వృద్ధికి తిరిగి పుంజుకోవడానికి దేశాన్ని వీలు కల్పించింది.
మహమ్మారి అనంతర వాగ్దానం
2010లలో రికార్డు వినియోగం, చౌకైన క్రెడిట్ అభివృద్ధి చెందుతున్న సేవల రంగాన్ని చూసింది. 2019 నాటికి వృద్ధి మందగించింది, 2020లో కరోనా మహమ్మారి కారణంగా జీడీపీ 7.3 శాతం తగ్గింది. ఇది నలభై సంవత్సరాలలో అత్యంత దారుణమైన పరిస్థితి. టీకా కార్యక్రమాలు, ఎగుమతులు, డిజిటల్ స్వీకరణ ద్వారా భారతదేశం వేగంగా కోలుకుని, 2021లో తొమ్మిది శాతం వృద్ధిని సాధించింది. 2025 నాటికి, భారతదేశం $4 ట్రిలియన్ మైలురాయిని అధిగమించి, ప్రపంచవ్యాప్తంగా నాల్గవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించింది.
ప్రపంచ అంచనాలు భారతదేశ బలాన్ని హైలైట్ చేస్తున్నాయి
ప్రముఖ అంతర్జాతీయ సంస్థలు భారతదేశం యొక్క సాపేక్షంగా బలమైన దృక్పథాన్ని హైలైట్ చేయడం కొనసాగిస్తున్నాయి. ఓఇసిడి ద్రవ్యోల్బణం మితంగా ఉండటం, పన్ను తగ్గింపులు, బలపడుతున్న కార్మిక మార్కెట్ మధ్య వాస్తవ ఆదాయాలు పెరిగేకొద్దీ ప్రైవేట్ వినియోగం బలపడుతుందని పేర్కొంటూ, 2025-26 ఆర్థిక సంవత్సరంలో 6.3 శాతం, 2026-27లో 6.4 శాతం వాస్తవ జీడీపీ వృద్ధిని అంచనా వేసింది. ఇటీవలి సవరణలో, ఓఇసిడి భారతదేశం యొక్క FY26 వృద్ధి అంచనాను 6.7 శాతానికి పెంచింది, దీనికి ద్రవ్య (మానిటరీ) , ఆర్థిక (ఫిస్కల్) సడలింపు జీఎస్టీ తగ్గింపులను కారణమని పేర్కొంది. ఐఎమ్ఎఫ్ 2025లో 6.6 శాతం, 2026లో 6.2 శాతం వృద్ధిని అంచనా వేసింది.
విధానాలు వృద్ధిని నడిపిస్తున్నాయి, కానీ బాహ్య ఒత్తిళ్లు దెబ్బతీస్తున్నాయి
భారతదేశం యొక్క ప్రస్తుత వృద్ధి ఊపందుకుంటుండటం దశాబ్దాల నిర్మాణ సంస్కరణలు ధైర్యవంతమైన దేశీయ విధానాలను ప్రతిబింబిస్తుంది. జీఎస్టీ హేతుబద్ధీకరణ, ద్రవ్య సడలింపు, ఆర్థిక ప్రోత్సాహకాలు, ఉత్పత్తి అనుసంధాన ప్రోత్సాహక పథకం తయారీ రంగాన్ని బలోపేతం చేశాయి, ప్రైవేట్ పెట్టుబడిని ప్రోత్సహించాయి. పునరుత్పాదక శక్తి విస్తరణకు ఆజ్యం పోశాయి. సెప్టెంబర్ నుండి యుఎస్ సుంకాలు, భౌగోళిక రాజకీయ అనిశ్చితులు, సరఫరా గొలుసు అంతరాయాలతో సహా ప్రపంచ ఒత్తిళ్లు ముఖ్యమైన అడ్డంకులుగా మిగిలిపోయాయి. దేశీయ డ్రైవర్లు బలంగా ఉన్నప్పటికీ, ఎగుమతులు, ప్రపంచ డిమాండ్, ప్రైవేట్ మూలధన వ్యయంలోని సవాళ్లు పెరిగాయని విశ్లేషకులు గుర్తించారు. ఇది వృద్ధి అంచనాలు వాస్తవికత యొక్క పాక్షిక చిత్రాన్ని మాత్రమే అందిస్తాయని సూచిస్తుంది.
ప్రపంచవ్యాప్తంగా భారతదేశాన్ని పోల్చడం
బాహ్య సవాళ్లు ఉన్నప్పటికీ, భారతదేశం ఇతర ప్రధాన ఆర్థిక వ్యవస్థలను అధిగమించడం కొనసాగిస్తోంది. చైనా 2025లో 4.7 శాతం, 2026లో 4.3 శాతం వృద్ధి చెందుతుందని అంచనా వేయడం జరిగింది. అయితే యునైటెడ్ స్టేట్స్ 1.8-1.7 శాతం వద్ద ఉంటుందని అంచనా. అభివృద్ధి చెందుతున్న, అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలకు ప్రపంచ సగటు దాదాపు 4.0-4.5 శాతంగా ఉంది, ఇది ప్రపంచ అనిశ్చితి మధ్య భారతదేశం యొక్క స్థితిస్థాపకతను గుర్తుచేస్తుంది. వ్యూహాత్మక దేశీయ విధానాలు, లక్ష్యిత పెట్టుబడి ప్రోత్సాహకాలు రక్షణను అందించాయి, అయితే వేగాన్ని కొనసాగించడానికి సుంకాలు, ప్రపంచ డిమాండ్ మందగించడం, భౌగోళిక రాజకీయ నష్టాలను జాగ్రత్తగా నిర్వహించడం అవసరం.
భారతదేశం యొక్క నిర్మాణ పరివర్తన స్పష్టమైన కొలమానాలలో ప్రతిబింబిస్తుంది.జీడీపీ కి సేవలు 50 శాతం, తయారీ 28 శాతం వ్యవసాయం 13 శాతం దోహదపడుతున్నాయి. తలసరి ఆదాయం 1947లో ₹250 నుండి 2025లో దాదాపు ₹2 లక్షలకు పెరిగింది, అయితే ఆయుర్దాయం 32 నుండి 70 సంవత్సరాలకు పైగా రెట్టింపు అయ్యింది. 2024లో యు పి ఐ లావాదేవీలు 172 బిలియన్లకు చేరుకున్నాయి. ఇది వీసా యొక్క ప్రపంచ పరిమాణం కంటే ఐదు రెట్లు ఎక్కువ. విమానయానం 174 మిలియన్ల ప్రయాణీకులను చేరవేసింది. భారతదేశం ప్రపంచంలో మూడవ అతిపెద్ద విమానయాన మార్కెట్గా మారింది. ఈక్విటీలు (షేర్లు) ఇప్పటికీ ఆకర్షణీయంగా ఉన్నాయి, మధ్యకాలిక వృద్ధి అంచనాలు, అధిక పారిశ్రామిక సామర్థ్య వినియోగం ద్వారా మద్దతు ఇవ్వబడి, పదేళ్ల సగటు కంటే కొద్దిగా పైన మూల్యాంకనాలు ఉన్నాయి.
ఈ మైలురాళ్లు ఉన్నప్పటికీ, భారతదేశం తీవ్రమైన అసమానత, గ్రామీణ సంక్షోభం, నిరుద్యోగం, వాతావరణ మార్పుల ముప్పును ఎదుర్కొంటోంది. అయినా దేశం ఒక కీలక ప్రయోజనాన్ని నిలుపుకుంది. దాని యువత. జనాభాలో దాదాపు సగం మంది 30 ఏళ్లలోపు ఉన్నందున, భారతదేశ భవిష్యత్తు తన యువ పౌరులకు సమర్థవంతంగా విద్యను అందించడం, ఉపాధి కల్పించడం, సాధికారత కల్పించడంపై ఆధారపడి ఉంటుంది. దాని పథాన్ని కొనసాగించడానికి సమ్మిళిత వృద్ధి, వాతావరణ స్థితిస్థాపకత, ఆర్థిక వేగాన్ని సమతుల్యం చేయడం చాలా అవసరం.
కరువు నుండి ఆహార మిగులు వరకు, టెలిగ్రామ్ల నుండి టెరాబైట్ల వరకు, వలసవాద పేదరికం నుండి మహమ్మారి అనంతర వాగ్దానం వరకు, భారతదేశ ప్రయాణం స్థితిస్థాపకత వ్యూహాత్మక దార్శనికతకు నిదర్శనం. $4 ట్రిలియన్ మార్కును అధిగమించడం కేవలం ఆర్థిక మైలురాయి మాత్రమే కాదు, ఇది శతాబ్దాల పట్టుదల, సంస్కరణ, విధాన ఆధారిత పరివర్తనను ప్రతిబింబిస్తుంది. బంగారు పక్షి మళ్లీ గాల్లోకి ఎగిరింది, దాని ప్రయాణం దేశీయ అసమానతలు ప్రపంచ అనిశ్చితులను ఎదుర్కొంటూనే, దాని యువత సామర్థ్యాన్ని ఉపయోగించుకోవడంపై ఆధారపడి ఉంటుంది, భారతదేశ వృద్ధి సమ్మిళితంగా, స్థిరంగా భవిష్యత్తును దృష్టిలో ఉంచుకునేలా చేస్తుంది.
