Let's talk: editor@tmv.in
భవిష్యత్ తరాల కోసం సరైన వేదికను ప్రభుత్వం, పారిశ్రామికవేత్తలు నిర్మించాలి: చంద్రబాబు

భవిష్యత్ తరాల కోసం సరైన వేదికను ప్రభుత్వం, పారిశ్రామికవేత్తలు నిర్మించాలి: చంద్రబాబు

Dantu Vijaya Lakshmi Prasanna
6 నవంబర్, 2025

భవిష్యత్ తరాల కోసం సరైన వేదికను నిర్మించాల్సిన సామూహిక బాధ్యత ప్రభుత్వం, పారిశ్రామికవేత్తలు ఇద్దరిపై ఉందని ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు అన్నారు. సామాజిక అంశాలలో చేసిన సేవలకు గుర్తింపుగా ముఖ్యమంత్రి సతీమణి నారా భువనేశ్వరికి లండన్‌లోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డైరెక్టర్స్ "డిస్టింగ్విష్డ్ ఫెలోషిప్ 2025" అవార్డును ప్రదానం చేసింది. కార్పొరేట్ గవర్నెన్స్‌లో అత్యుత్తమ సేవలకు గాను ఆమె హెరిటేజ్ ఫుడ్స్ తరపున గోల్డెన్ పీకాక్ అవార్డు ను కూడా అందుకున్నారు.

ఈ సందర్భంగా కీలకోపన్యాసం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, భువనేశ్వరి రెండు అవార్డులు అందుకోవడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ, యూకే, భారత్‌ల మధ్య సంబంధాలు బలపడుతున్నాయని తెలిపారు. రెండు దేశాల మధ్య జులైలో జరిగిన ఒప్పందం వ్యాపార సహకారానికి మార్గం సుగమం చేసిందని ఆయన అన్నారు. ప్రపంచ డిమాండ్లకు అనుగుణంగా ప్రభుత్వం, వివిధ సంస్థల దృక్పథం మారాలని ఆయన అభిప్రాయపడ్డారు. ఉద్భవిస్తున్న సాంకేతికత విసిరే సవాళ్లను ఎదుర్కోవడానికి ముందస్తు ప్రణాళిక అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కీలక పాత్ర పోషిస్తున్నందున, ఆంధ్రప్రదేశ్ కూడా అందుకు అనుగుణంగా ప్రణాళికలు వేస్తోంది. .విశాఖపట్నంలో గూగుల్ సంస్థ ఏఐ డేటా సెంటర్‌ను ఏర్పాటు చేయబోతోందని, ఇది ఆవిష్కరణ, పరిశోధన, నైపుణ్యాభివృద్ధికి దారి తీస్తుందని తెలిపారు.

సాంకేతికత ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరుస్తుంది

సాంకేతికత ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడం ద్వారా వారికి మేలు చేయాలని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఇటీవల సంభవించిన మొ౦థా తుఫాను ఉదాహరణను ఉదహరిస్తూ, సాంకేతికత ఆధారిత ప్రణాళిక మరియు రియల్ టైమ్ పర్యవేక్షణ కారణంగా, రాష్ట్ర ప్రభుత్వం తుఫాను సమయంలో ప్రాణ, ఆస్తి నష్టాన్ని నివారించగలిగిందని చెప్పారు. వ్యాపారం చేసే వేగం అవసరాన్ని ఆయన నొక్కి చెప్పారు, దీని ఫలితంగా ఆంధ్రప్రదేశ్ ఒక్క సంవత్సర కాలంలోనే భారీ పెట్టుబడులను ఆకర్షించిందన్నారు. అమరావతిని నీలి, ఆకుపచ్చ నగరంగా అభివృద్ధి చేస్తామని తెలిపారు. వాతావరణ మార్పు, ప్రపంచానికి అతిపెద్ద సవాలు అని పేర్కొంటూ, వాతావరణాన్ని, భవిష్యత్ తరాల ప్రయోజనాలను రక్షించడానికి అన్ని దేశాలు కలిసి రావాలని ఆయన అన్నారు.

నారా భువనేశ్వరి, డాక్టర్ కృష్ణప్రసాద్ చిగురుపాటి, ప్రొఫెసర్ పీటర్ బోన్‌ఫీల్డ్, హర్ష్బినా ఝవేరితో సహా అవార్డులు అందుకున్న వారందరినీ ముఖ్యమంత్రి అభినందించారు.

సంజీవని పేరుతో మొబైల్ ఆరోగ్య శిబిరాల ఏర్పాటు

డిస్టింగ్విష్డ్ ఫెలోషిప్ అవార్డు, గోల్డెన్ పీకాక్ అవార్డులను అందుకున్న అనంతరం, ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి మాట్లాడుతూ, ఎన్టీఆర్ ట్రస్ట్ ఉచిత ఆరోగ్య క్లినిక్‌లు, సంజీవని పేరుతో మొబైల్ ఆరోగ్య శిబిరాలను నిర్వహిస్తూ, సురక్షితమైన తాగునీటిని అందిస్తోందని తెలిపారు. శిక్షణ ఇవ్వడం ద్వారా మహిళా సాధికారతకు కృషి చేస్తోందని ఆమె అన్నారు. ఇది కాకుండా, ఈ ట్రస్ట్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో ప్రకృతి వైపరీత్యాల సమయంలో ప్రజలకు సేవలను అందిస్తోంది. ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆమె తెలిపారు. ఎన్టీఆర్ ట్రస్ట్ అన్ని వర్గాల ప్రజలకు సేవలు అందిస్తూ, సమాజంలో వారికి గౌరవప్రదమైన స్థానాన్ని అందించడానికి కృషి చేస్తోందని ఆమె చెప్పారు.

భవిష్యత్ తరాల కోసం సరైన వేదికను ప్రభుత్వం, పారిశ్రామికవేత్తలు నిర్మించాలి: చంద్రబాబు - Tholi Paluku