Let's talk: editor@tmv.in
భద్రాద్రి రామయ్య దేవాలయం - తెలంగాణ ఆత్మ గౌరవం

భద్రాద్రి రామయ్య దేవాలయం - తెలంగాణ ఆత్మ గౌరవం

Dantu Vijaya Lakshmi Prasanna
2 ఫిబ్రవరి, 2026

భద్రాచల శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం సామాన్య పండుగ కాదు. అది ఆధ్యాత్మికత, పరంపర, భక్తి, రాజసం, ఆద్యాత్మికం కలిసిన శతాబ్దాల సంస్కృతి. గోదావరి తీరాన ప్రతీ సంవత్సరం జరిగే ఈ దివ్య కళ్యాణం, భక్తులకు మాత్రమే కాదు, రాష్ట్రానికే ఆధ్యాత్మిక గౌరవ చిహ్నం. తానీషా కాలం నుంచి ఇప్పటి ప్రభుత్వాల వరకు కొనసాగుతున్న అధికారిక ముత్యాల తలంబ్రాలు, పట్టువస్త్రాలు సమర్పణ సంప్రదాయం ఇది భద్రాద్రి దేవుడికి రాజ్యమే శాశ్వత సేవకుడిగా ఉన్నదనడానికి ఒక గుర్తు. భగవంతుడి వివాహానికి రాజవంశాలు నుండి ఆధునిక పాలకుల వరకు తమ వంతు సేవ అర్పించిన ఈ పవిత్ర ఆచారం, భక్తి, భారతీయతల పునాది మీద నిలిచిన శాశ్వత సంప్రదాయానికి అద్భుత ప్రతిరూపం. అలాంటి రామయ్య దేవాలయం గురించిన విశేషాలు చూద్దాం ..

దక్షిణ అయోద్యగా పేరొందిన భద్రాచలం సీతారామచంద్రస్వామి దేవాలయం విష్ణువు అవతారమైన శ్రీరామునికి అంకితమైన పవిత్ర హిందూ ఆలయం. ఈ ఆలయం తెలంగాణ రాష్ట్రం తూర్పుభాగంలోని భద్రాచల పట్టణంలో, గోదావరి నదీ తీరాన ఉంది. సాధారణంగా భద్రాచలం అని, భద్రగిరి, భద్రాద్రి అని కూడా పిలుస్తారు. ఇది గోదావరి నదీ తీర దివ్యక్షేత్రాలలో ఒకటిగా అలరారుతుంది. ఈ ప్రాంతం రామాయణంతో అతి సన్నిహిత సంబంధం కలిగి ఉంది. ఇక్కడే రాముడు గోదావరి సమీపంలో ఆశ్రయం తీసుకున్నారని, సీతమ్మను రావణుడు అపహరించిన ప్రదేశం ఈ అరణ్య ప్రాంతానిదే అని చెబుతారు.

గర్భగుడిలోని ప్రధాన విగ్రహం చతుర్బుజ వైకుంఠరామునిగా ధర్శనమిస్తుంది. భద్ర మహర్షి చేసిన తపస్సుకు స్పందిస్తూ విష్ణువు ఈ రూపంలో ప్రత్యక్షమయ్యారని ఒక కథనం వాడుకలో ఉంది. శ్రీరాముడితో పాటు సీతాదేవి, లక్ష్మణుడు కూడ ఈ ప్రధాన విగ్రహంలో ధర్శనమిస్తారు.

కొందరి అభిప్రాయం ప్రకారం, భద్రాచలంలోని అసలు ఆలయాన్ని, మరికొందరి అభిప్రాయం ప్రకారం దాని పునర్నిర్మాణాన్ని, 17వ శతాబ్దంలో భక్తి ఉద్యమ ప్రముఖుడైన కంచర్ల గోపన్న (భద్రాచల రామదాసు) చేపట్టాడని అంటారు. గోపన్న గోల్కొండ సుల్తాను అబుల్ హసన్ కుతుబ్‌షా (తానీషా) కాలంలో భద్రాచలం తహసీల్దార్‌గా పనిచేశాడు. ఆలయ నిర్మాణం కోసం సుల్తానేట్ ఖజానా నిధులను వాడాడని ఆరోపణలతో అతన్ని 12 సంవత్సరాలు కారాగారంలో పెట్టారు. అక్కడ నుంచే ఆయన ఎన్నో భక్తిగీతాలు రచించాడు, ఈ గీతాలు ఇప్పటికీ ప్రతీరోజు ఆలయంలో వినిపిస్తుంటాయి.

దేవాలయానికి నాలుగు దారులు ఉన్నాయి. ఉత్తరద్వారం వైకుంఠ ద్వారం, అక్కడే రాజగోపురం ఉంది. ప్రధాన దేవుడైన శ్రీరాముడు కారణంగా భద్రాచలం అత్యంత విశిష్ట క్షేత్రంగా నిలుస్తుంది. గోపన్న భద్రాచలం నుంచే భజన సంప్రదాయాన్ని వ్యాప్తి చేశాడు. ఇక్కడి వార్షిక బ్రహ్మోత్సవాలు అత్యంత ముఖ్యమైనవి. ముఖ్యంగా రామనవమి ముందు జరిగే శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవం ప్రధాన ఆకర్షణ. అలాగే వైకుంఠ ఏకాదశి, వసంతోత్సవం, విజయదశమి వంటి వేడుకలు ఘనంగా జరుగుతాయి.

ఆలయ చరిత్ర నిర్మాణం

పురాణాల ప్రకారం, భద్ర మహర్షి కథతో అనుసంధానమై ఉంది. త్రేతాయుగంలో, 14ఏళ్ల వనవాసంలో రాముడు, సీతమ్మ, లక్ష్మణులతో కలిసి దండకారణ్యంలో నివసించాడు. రాముని కృపతో ఒక శిల మనిషిగా మారి భద్ర అనే మేరుపుత్రుడిగా అవతరించాడని నమ్మకం. భద్ర మహర్షి నారదుని వద్ద రామతారక మంత్ర దీక్ష తీసుకుని గోదావరి తీరాన ఎన్నో ఏళ్లు ధ్యానం చేశాడు. రాముడు సీతమ్మను రాక్షస రాజు రావణుడి వద్ద నుంచి తిరిగి తీసుకువచ్చిన తరువాత తనను కలుస్తానని భద్రునికి మాట ఇచ్చాడు. అయితే తన అవతార కాలంలో రాముడు ఆ మాట నెరవేర్చలేకపోయాడు. అతని భక్తి చూసి విష్ణువు, రాముడు ఇచ్చిన మాటను నెరవేర్చడానికి చతుర్బుజ రామరూపంలో భద్రుని ముందుకు ప్రత్యక్షమయ్యాడని పురాణ కథ ఉంది. పై చేతుల్లో శంఖం, చక్రం, కింది చేతుల్లో ధనుస్సు, బాణం. సీతమ్మను ఎడమ తొడపై కూర్చోబెట్టి, లక్ష్మణుడు ఎడమ వైపున నిలబడి, గోదావరి వైపు పడమటి దిశగా వీరంతా దర్శనమిచ్చారని కథనం.

ఇంకొక స్థానిక కథనం ప్రకారం, గర్భగుడి విగ్రహాన్ని భద్రరెడ్డి పాలెం ప్రాంతానికి చెందిన గిరిజన స్త్రీ పోకల ధమ్మక్క చీమల గుట్టలో కనుగొన్నట్టుగా చెబుతారు. ఆమె శబరి వంశస్తురాలిగా భావిస్తారు. స్వప్నంలో దర్శనం కలగడంతో, చీమల పుట్టను గోదావరి నీటితో చెరిపి, అక్కడే పూజలు చేసిందని, గ్రామస్థులతో కలిసి ఒక చిన్న మంటపం నిర్మించిందని చెబుతారు.

ఇదిలా ఉంటే, ఆలయ చరిత్ర మొత్తం కంచర్ల గోపన్న చరిత్రతో ముడిపడి ఉంది. తెలంగాణలోని నెలకొండపల్లి అతని జన్మస్థలం. అతని మామ గోల్కొండ సుల్తానేట్‌లో పనిచేశాడు. అక్కడ కరువు సమయంలో గోపన్నకు ఉద్యోగం ఇవ్వమని సుల్తానును కోరగా, అతన్ని భద్రాచల తహసీల్దార్‌గా నియమించారు. గోపన్న సుల్తాను ఆదేశాల మేరకు హిందువులపై విధించిన జిజియా పన్ను వసూలు చేసేవాడు. దీనివల్ల ప్రజల్లో అతనిపై తీవ్ర అసంతృప్తి ఏర్పడింది. దీంతో బాధపడి, వసూలైన పన్నులో కొంత మొత్తాన్ని ఆలయ పునర్నిర్మాణానికి వినియోగించాలనే నిశ్చయానికి వచ్చాడు. కొందరి కథనం ప్రకారం అతనే ఆలయాన్ని నిర్మించాడు, మరికొందరి కథనం ప్రకారం ప్రాచీన ఆలయాన్ని మరమ్మతు చేశాడు. ఈ నిర్మాణ వ్యయం ఆరు లక్షల వరాహాలు అని ప్రస్తావించబడింది.

భద్రాచలం పునర్నిర్మాణం - రామదాసు సంకల్పం

మరొక కథనం ప్రకారం, ఒకసారి రామదాసు భద్రాచలంలో జరిగిన జాతరకు వెళ్లి అక్కడి శ్రీరామాలయపు శిథిలావస్థను చూసి చాలా క్షోభకు గురయ్యాడు. రామభక్తులకు భద్రాచలానికి ఉన్న ప్రాముఖ్యం అపారము. వనవాస సమయంలో శ్రీరాముడు, సీతమ్మ, లక్ష్మణులతో కలిసి పర్ణశాలలో నివసించిన ప్రదేశం అదే. భద్రాచల సమీపంలో శబరమ్మను కూడా రాముడు దర్శించినట్టు నమ్మకాలు ఉన్నాయి (అయితే శబరి నివసించిన ప్రాంతం వానర రాజ్యం అయిన కిష్కింధ, నేటి హంపి ప్రాంతం, వద్దనే ఉన్నట్టు కూడా అనేక అభిప్రాయాలు ఉన్నాయి). భద్రాచలంలోనే పోతన భగవతాన్ని తెలుగులో అనువదించమని శ్రీరాముడి ఆదేశం పొందినట్టు ప్రసిద్ధి.

అంతటి పవిత్రత ఉన్నా ఆలయం పూర్తిగా నిర్లక్ష్యానికి గురైంది. దీన్ని మార్చాలని రామదాసు నిశ్చయించాడు. తన వద్ద ఉన్న మొత్తం ప్రభుత్వ ధనాన్ని ఖర్చు చేసి, ప్రజలను కూడా సహాయం చేయమని కోరాడు. అలాగే వసూలు చేసిన మొత్తం పన్ను సొమ్మును దేవాలయ నిర్మాణానికే ఉపయోగించమని గ్రామస్థులు అభ్యర్థించారు. పంట కోత అనంతరం పన్ను మొత్తం పూడ్చేస్తామని హామీ ఇచ్చారు. ఈ విధంగా రామదాసు మొత్తం ఆరు లక్షల రూపాయలతో భద్రాచల దేవాలయాన్ని పునర్నిర్మించాడు. అయితే ఇవన్నీ సుల్తాన్ అబుల్ హసన్ కుతుబ్‌షా అనుమతి లేకుండానే చేయబడినవి. అదే సమయంలో దేవాలయ నిర్మాణం పూర్తికావడంతో ప్రధాన గర్భగుడి శిఖరంపై సుదర్శన చక్రాన్ని ఎలా ప్రతిష్ఠించాలా అని రామదాసు ఓ రోజు రాత్రి ఆందోళన చెందుతున్నాడు. అదే రాత్రి, స్వప్నంలో శ్రీరాముడు ప్రత్యక్షమై, గోదావరిలో పుణ్యస్నానం చేయమని ఉపదేశించినట్లు కథనం. మరుసటి రోజు నదిలో స్నానం చేస్తుండగా, రామదాసుకు సుదర్శన చక్రం అతి సులభంగా లభించిందని నమ్మకం.

కారాగార జీవితం

ఆలయ పునర్నిర్మాణం అనంతరం రామదాసు బాధలు మొదలయ్యాయి. శత్రువులు అపనిందలు ప్రచారం చేయడంతో ఆయన ఉద్యోగం నుంచి తొలగించి, హైదరాబాద్ ప్రాంతంలో ఉన్న జైలులో అతన్ని నిర్బంధించి, మొత్తం అప్పు తిరిగి వచ్చే వరకు విడుదల చెయ్యరాదని ఆదేశాలు జారీ అయ్యాయి.

కారాగారంలో రామదాసు అనేక హృదయవిదారక కీర్తనలు రచించాడు. దాశరథి శతకము, రామదాసు కీర్తనల్లోని అనేక పాదాలు రామని అనుగ్రహం కోసం అతని ఆత్మనివేదనను ప్రతిబింబిస్తాయి. చివరికి పూర్తి శరణాగతంతో ముగుస్తాయి. ఒక సంవత్సరం గడిచిన తరువాత, సుల్తాన్ తానా షాకు స్వప్నంలో శ్రీరాముడు ప్రత్యక్షమయ్యారని, నిద్రలేచినపుడు తన పక్కన రామముద్రలు, రామ మాడలు (రామచిత్రంతో స్వర్ణ నాణేలు) కనిపించాయని, వెంటనే రామదాసును విడుదల చేసి, ప్రతి రామనవమి సందర్భంగా భద్రాచలానికి ముత్యాలు పంపే సంప్రదాయాన్ని ఆరంభించాడు. ఈ ఆచారం తరువాతి నిజాం పాలకులదాకా కొనసాగింది, ఇప్పటికీ కొనసాగుతుంది.

రామదాసు భక్తి ఉద్యమంలో ప్రముఖ కవి సంతుడు. కర్ణాటక సంగీత సంప్రదాయంలో అగ్రగణ్య కీర్తనకారుడు. అతని కీర్తనలు ప్రధానంగా రామభక్తి ఆధారంగా ఉండి, పల్లవి, అనుపల్లవి, చరణం రూపకల్పనలో ప్రసిద్ధి చెందాయి. సంగీత ముద్రలు ‘రామదాసు’, ‘భద్రాచలవాస’, ‘భద్రాద్రి’, ‘భద్రగిరి’ వంటి పేర్లతో కనిపిస్తాయి. ఆయన రచనల ప్రభావం అనంతరం శతాబ్దాల వరకు కొనసాగింది. త్యాగరాజు వంటి మహానుభావులు రామదాసుకు అంకితంగా ఐదు కృతులు రచించారు. నారదుడు, ప్రహ్లాదుడు వంటి మహాభక్తులతో రామదాసును సమానంగా పేర్కొంటూ మర్యాదచేశారు.

రామదాసు రచించిన దాశరథి శతకము తెలుగు సాహిత్యంలో అత్యంత ప్రభావవంతమైన భక్తి బోధనాత్మక కవితా సంపుటాలలో ఒకటి. రామదాసుని పేరుతో ఆరు పుస్తకాలు వెలువడ్డాయి. వీటిని యక్షగానం లేదా హరికథా శైలిలో రూపొందించారు. మొత్తం 190 కృతులు అతనివని చెబుతారు. విమర్శకుల అంచనా ప్రకారం, అతను జైలుకు ముందు 37, జైలులో 64, విడుదల తర్వాత 31 పాటలు రచించాడు. మొత్తం విశ్వసనీయ కృతులు 132 గా ఉన్నాయి. దక్షిణ భారత రాగాలు 20, ఉత్తర భారత రాగాలు 17, అంటే రెండు శాస్త్రీయ సంగీత సంప్రదాయాలనూ సమన్వయం చేసిన అరుదైన కీర్తనకారుడు రామదాసే. సామాన్య ప్రచారంలో రామదాసు 300 పైగా కృతులు రచించాడని పేర్కొంటారు. ఆయన రామభక్తికి ముగ్ధుడై సుల్తాన్ కూడా ప్రభావితుడయ్యాడని నమ్మకం. చారిత్రక పత్రాలు గోపన్న 1680ల మధ్యవరకూ జైలులో ఉన్నట్టు తెలుపుతాయి. ఇంకొక ప్రజా గాథ ప్రకారం, 15వ శతాబ్దం వైష్ణవ సంతుడు కబీర్ దాసు తెలంగాణలో సంచరిస్తూ గోపన్న భక్తిని చూసి అతనికి రామదాసు అనే బిరుదు ఇచ్చాడని చెబుతారు.

ఆధునిక కాలం

భద్రాచలం దేవాలయం హైదరాబాద్ రాష్ట్రంలో భాగంగా ఉండేది. 1860లో చుట్టుపక్కల భూములు బ్రిటిష్ పాలనకు వెళ్లినా, ఆలయం మాత్రం నిజాం రాష్ట్రంలోనే నిలిచింది. పాల్వంచ సంస్థానానికి ఆ భూముల హక్కులు ఉండేవి. 1959లో ఈ ప్రాంతాలు ఖమ్మం జిల్లాలో విలీనం అయ్యాయి. 1958లో ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ ఆలయ నిర్వహణను చేపట్టింది.

అలాగే తెలంగాణ ఉద్యమ సమయంలో భద్రాచలం తెలంగాణాదా, ఆంధ్రప్రదేశ్‌దా అన్న వివాదం లేచింది. తెలంగాణ నేతలు, కార్యకర్తలు భద్రాచలాన్ని తెలంగాణలో నిలుపుకోవాలని బలంగా ప్రయత్నించారు. రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ తర్వాత, 2016లో, భద్రాచలం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భాగమైంది.

రాములోరి కళ్యాణం పరమపావనం

భద్రాచల శ్రీ సీతారాముల కళ్యాణం ప్రతి సంవత్సరం చైత్ర మాస శుద్ధ ద్వాదశి రోజున జరిగే దివ్య వైభవోత్సవం. ఈ వేళ భద్రాద్రి మొత్తం అగస్త్య మహర్షి స్తుతులతో ప్రతిధ్వనించినట్టు, వేకువజామునుంచే భక్తుల సందడి మొదలౌతుంది. వరుడు శ్రీ రాముడు, వధువు సీతమ్మ రాజసంగా అలంకరించబడి స్వర్ణవేదికపై కళ్యాణ ఘట్టంతో ఒక్కటవుతారు. వేదఘోషలు, మంగళవాయిద్యాలు, భక్తుల ‘జై శ్రీరామ్’ నినాదాలతో కళ్యాణ మహోత్సవం ఆధ్యాత్మిక ఆనందస్వరూపంగా మారుతుంది. ఈ కళ్యాణ మహోత్సవాన్ని దర్శించినవారికి లోక పరలోకాల శుభఫలితాలు కలుగుతాయని నమ్మకం.

భద్రాచల శ్రీ సీతారాముల కళ్యాణానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున తలంబ్రాలు పంపే సంప్రదాయం తానీషా పాలనకాలం నుండి అనువర్తిస్తూ వస్తున్న ప్రత్యేక ఆధ్యాత్మిక పారంపర్య పరంపర. శ్రీరాముడికి భక్తుడైన కుతుబ్‌షాహీ రాజు తానీషా, భద్రాచల దేవస్థానానికి భక్తితో బంగారం, ధాన్యాలు, తలంబ్రాలు పంపడం ప్రారంభించాడని, అప్పటి నుంచి ఆనవాయితీ ప్రకారం నిజాం ప్రభుత్వం, ఆ తర్వాత హైదరాబాదు రాష్ట్రం, చివరికి ఆంధ్రప్రదేశ్ తరవాత తెలంగాణ ప్రభుత్వాలు ఈ ఆచారాన్ని నిలబెట్టాయి. ప్రతి ఏడాది చైత్ర శుద్ధ ద్వాదశి నాడు జరిగే కళ్యాణ మహోత్సవానికి ప్రభుత్వం తరఫున ప్రత్యేక ప్రతినిధి రావడం, అధికారికంగా పసుపు, కుంకుమ, సారెలు, చీరలు, ముత్యాల తలంబ్రాల సమర్పణ చేయడం, రాజ్యమే వధువుకు బంధువులా వచ్చి ఆశీర్వాదం అందిస్తున్నట్టుగా భావిస్తారు. ఈ ఆచారం, కాలం మారినా కళ్యాణం పట్ల ప్రభుత్వ గౌరవాన్ని, భద్రాద్రి శ్రీరామునిపై ప్రతిబింబించే భక్తి విశ్వాసాన్నితెలుపుతుంది. అలాగే వైకుంఠ ఏకాదశి ఉత్తర ద్వారదర్శనం కూడా ఇక్కడ ప్రత్యేకంగా నిర్వహిస్తారు.

భద్రాచలం చుట్టుపక్కల ప్రదేశాలు

పాపికొండలు,

గోదావరిలో బోటు ప్రయాణం, భద్రాచలం నుండి 50–70 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. గోదావరిలో బోటు రైడ్, అడవులు, కొండలు, నీటి మధ్య సుందర దృశ్యాలు. పర్యాటకులను మంత్రా ముగ్ధులను చేస్తాయి.

పర్ణశాల

భద్రాచలం నుండి 35 కి. మీ, ఇక్కడే సీత రాముడు,లక్ష్మణుడు నివాసం ఉనట్లు పురాణం ఆధారాలు ఉన్నాయి. రావణుడు సీతామాతను అపహరించిన ప్రాంతం ఇదే అని చెప్పబడుతుంది. అలాగే భద్రాద్రి జిల్లాలోని సుందరమైన అరణ్య ప్రాంతం. గిరిజన ప్రాంతాల సంస్కృతి & గోదావరి ట్రైబల్ జీవనం చూడవచ్చు. దేవాలయ పక్కనే ఉన్న కళారూపాల ప్రాంతం. మట్టి బొమ్మలు, దేవాలయ కళాకృతులు లభిస్తాయి. సాయంత్రపు సమయాల్లో గోదావరి తీరంలో చేసే హారతి అద్భుతంగా ఉంటుంది. గోదావరి నది మహానది కావడంతో చుట్టూ అడవి ప్రాంతాలు, పచ్చదనం, కొండలు ఎక్కువ. అక్టోబర్ నుంచి ఫిబ్రవరి వరకు పర్యాటకులకు మంచి సీజన్. వేసవిలో కొంచెం వేడిగా ఉంటుంది.

రవాణా

భద్రాచలం రోడ్డు కనెక్టివిటీ బాగా ఉంటుంది. హైదరాబాద్ నుండి భద్రాచలం దూరం 320 కి. మీ. హైదరాబాదు - ఖమ్మం - భద్రాచలం ప్రత్యేక బస్సులు పూర్తిగా అందుబాటులో ఉంటాయి. విజయవాడ - భద్రాచలం, 180 కి. మీ దూరం జగ్గయ్యపేట - ఖమ్మం, భద్రాచలం, విశాఖపట్నం, రాజమండ్రి కాకినాడ నుండి గోదావరి బెల్ట్ నుంచి డైరెక్ట్ బస్సులు అందుబాటులో ఉంటాయి. సమీప రైల్వే స్టేషన్, భద్రాచలం రోడ్ (కొత్తగూడెం), భద్రాచలం దేవాలయం నుండి 40 కి.మీ దూరంలో ఉంటుంది. హైదరాబాద్, విజయవాడ, వరంగల్ నుండి మంచి కనెక్టివిటీ ఉంటుంది. రాజమండ్రి - 180 కి. మీ , విజయవాడ - 200 కి. మీ, హైదరాబాద్ - 320 కి. మీ దూరంలో ఎయిర్‌పోర్ట్‌లు ఉన్నాయి. అక్కడి నుండి టాక్సీలు సులభంగా లభిస్తాయి.

వసతి & ఆహారం

దేవస్థానం వసతి గృహాలు అందుబాటులో ఉన్నాయి. సాధారణ ఏ సి, నాన్ ఏ సి గదులు ఉన్నాయి. ఆన్‌లైన్ బుకింగ్ అవకాశాలు కూడా ఉన్నాయి. భ ద్రాచలంలో మోడరేట్ హోటళ్లు, ఫ్యామిలీ స్టేలు లభిస్తాయి. రివర్ వ్యూ రూమ్స్ కూడా లభిస్తాయి. శుద్ధ శాకాహార హోటళ్లు ఎక్కువ. దేవస్థానం అన్నప్రసాదం అందిస్తారు. స్థానిక వంటకాలు లభిస్తాయి.

భద్రాచలం పుణ్యక్షేత్రం ఆధ్యాత్మికత, ప్రకృతి, గోదావరి సౌందర్యం ఒకటైన ప్రదేశం.

ఇక్కడ రామాలయం దర్శనం, గోదావరి తీరం అనుభూతి, పాపికొండల ప్రకృతి, పర్ణశాల వంటి పురాణ ప్రదేశాలు మంచి పర్యటన అనుభూతిని అందిస్తాయి.