Let's talk: editor@tmv.in
భద్రాచలం దక్షిణ అయోధ్య

భద్రాచలం దక్షిణ అయోధ్య

Dantu Vijaya Lakshmi Prasanna
19 డిసెంబర్, 2025

భద్రాచలం తెలంగాణ రాష్ట్రంలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో, గోదావరి నది తీరంలో వున్న ప్రసిద్ధ పవిత్రక్షేత్రం. ఇది రామాలయంగా చిరపరిచితమైన శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయంగా ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. రామాయణంలో చెప్పబడిన పుణ్యభూమిగా భావించే ఈ ప్రాంతం “దక్షిణ అయోధ్య”గా కూడా పిలువబడుతుంది. అటవీ ప్రాంతాలకు సమీపంలో అందమైన ప్రకృతి వాతావరణంతో ఉన్న ఈ క్షేత్రం, ఆంధ్ర–తెలంగాణ ప్రాంతాల భక్తులకు అత్యంత పవిత్రమైన తీర్థక్షేత్రంగా నిలిచింది.

భద్రాచలంలో దర్శనమిచ్చే వైకుంఠ రాముడు రూపం దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రత్యేకంగా ఉంటుంది. బ్రహ్మ పురాణంలో ఈ దేవాలయ మహత్త్వం విస్తారంగా చెప్పబడింది. భద్రాచలంలో వైకుంఠ రాముని ఆరాధించే వారికి తత్త్వజ్ఞానాన్ని ప్రసాదించే శక్తి ఆయనకు ఉందని తెలుపుతుంది.

భద్రాచలం గోదావరి నది తీరంలోని దివ్యక్షేత్రాల్లో ఒకటిగా అలరారుతుంది. అందువల్ల గోదావరి పుష్కరాలు, మహా పుష్కరాలు ఇక్కడ కూడా భక్తులు అత్యంత వైభవంగా జరుపుకుంటారు. పుష్కరాలు ప్రతి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి, మహా పుష్కరాలు ప్రతి 144 సంవత్సరాలకు ఒకసారి జరుగుతాయి.

పురాణాల ప్రకారం, రామభక్తుడైన ముస్లిం సంత్ కబీర్ ను ఒకసారి ఆలయంలోకి అనుమతించలేదని పురోహితులు అడ్డుకున్నారు. అప్పుడు ఆలయంలోని విగ్రహాలు ఒక్కసారిగా కన్పించకుండా పోయాయి. ఆలయంలో ప్రత్యక్షంగా ఉన్న రామదాసు పురోహితులను ప్రార్థించడంతో, కబీర్‌ను లోపలికి అనుమతించిన తర్వాతే ఆ విగ్రహాలు మళ్లీ ప్రత్యక్షమయ్యాయి. గోపన్న భద్రాచలాన్ని భజనా సంప్రదాయం కేంద్రంగా ఉపయోగించి వైష్ణవ భక్తి భావాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాడు. ఫలితంగా తెలుగు రాష్ట్రాల్లో, ముఖ్యంగా గ్రామాల్లో, శ్రీరామాలయాల సంఖ్య పెద్దగా పెరిగింది. గోపన్న కీర్తనలు త్యాగరాజును బలంగా ప్రేరేపించాయి. త్యాగరాజు గోపన్నను తన “వ్యక్తిగత గురువుగా” భావించి, ఆయన కీర్తనలను ఆదర్శంగా తీసుకుని వైకుంఠ రాముడిని స్తుతిస్తూ అనేక కీర్తనలు రచించాడు. తరువాత గోపన్న ప్రభావంతో ప్రేరేపితుడైన నరసింహదాసు, భద్రాచలంలో ఉన్నప్పుడు రాముడిపై అనేక భక్తిగీతాలు రచించాడు. వాటి ద్వారా ఆయన నిజమైన రామభక్తునిగా, గోపన్న సంప్రదాయానికి వారసుడిగా పేరుపొందాడు.

భద్రాచలంలో ప్రారంభమైన రామకళ్యాణ వేడుకల సందర్భంగా ప్రభుత్వాలు పంపే ముత్యాలు, పట్టుచీరల బహుమతి సంప్రదాయం, తరువాత అనేక చిన్న రామాలయాల్లో కూడా అనుసరించబడుతోంది. అలాగే భద్రాచలం పరిసర ప్రాంతాల్లో కూడా రామాయణంతో సంబంధమున్న అనేక హిందూ ఆలయాలు ఉన్నాయి.

ఆలయ నిర్మాణం, విశేషాలు

భద్రాచలంలోని ప్రధాన దేవాలయం మూడు భాగాలుగా విభజించబడింది. మొదటి భాగం, భద్రుడి “తల”గా భావించబడే చోటు. ఇక్కడ భద్రునికి ప్రత్యేకంగా ఒక ఆలయం ఉంది. రాతి నిర్మాణంపై శ్రీరాముని పాద ముద్రలు కనిపిస్తాయి. వీటిని భక్తులు గుర్తించేందుకు ఆ రాతిపై తిరునామం (తెల్ల మట్టి) రాస్తారు.

రెండవ భాగం, గర్భగృహం. ఇది భద్రుని “హృదయం”గా భావించబడే స్థలం. ఇక్కడే ప్రాధాన్య విగ్రహం ప్రతిష్ఠించబడి ఉంది.

మూడవ భాగం, రాజగోపురం. ఇది భద్రుని “పాదాల” వద్ద ఉన్న గోపురం.

ఆలయానికి నాలుగు ప్రవేశ ద్వారాలు ఉన్నాయి. ప్రధాన ద్వారం చేరడానికి 50 మెట్లు ఎక్కాలి. 1974లో భక్తుల రద్దీని నియంత్రించేందుకు “వైకుంఠ ద్వారం” నిర్మించారు. గర్భగృహం ఎదుట పంచలోహంతో చేసిన బంగారు కప్పు ఉన్న ద్వజస్తంభం ఉంది. దీనిపై విష్ణువు వాహనమైన గరుడుని శిల్పాలు చెక్కబడ్డాయి.

గర్భగృహ విమానంపై ఎనిమిది ముఖాలున్న, వెయ్యి కొనలతో కూడిన సుదర్శన చక్రం ఉంది. దీనిని గోపన్న గంగగాడిలో కనుగొని ఆలయంలో ప్రతిష్ఠించాడు. విమానంపై చిన్న రూపంలో దేవుడు కూడా చూపబడతాడు. భక్తులకు ప్రత్యేక దర్శనం ఉండే వారు గర్భగృహ ప్రవేశం ఎడమవైపు నుంచి వెళ్తారు. సాధారణ భక్తులు క్యూలో వెళ్లి నేరుగా గర్భగృహంలోకి ప్రవేశిస్తారు. గర్భగృహం కుడి వైపున ఉత్సవ విగ్రహాలు, శ్రీరాముడు, సీతమ్మ, లక్ష్మణులు ప్రతిరోజూ పూజలు అందుకుంటారు.

ప్రధాన విగ్రహం

గర్భగృహంలోని ప్రధాన విగ్రహం స్వయంభూగా చెబుతారు. శ్రీరాముడు పద్మాసనంలో కూర్చొని, ఆయన ఒడిలో సీతమ్మవారు కూర్చున్నారు. రాముని నాలుగు చేతుల్లో, శంఖం, చక్రం, ధనుస్సు, బాణం ఉన్నాయి. లక్ష్మణుడు ఆయన ఎడమవైపున నిలిచి ఉంటాడు.

రంగనాథ స్వామివారి ఆలయం

ఎత్తయిన గుట్టపై గోపన్న రంగనాథుని (శ్రీరంగంలోని దేవుడు) ప్రతిష్ఠించాడు. ఇది “రంగనాయకుల గుట్ట”గా ప్రసిద్ధి. దీనికి ఎదురుగా మహాలక్ష్మీ ఆలయం ఉంది. శ్రీరంగ సంప్రదాయాన్ని అనుసరించేందుకు గోపన్న ఈ రెండు ఆలయాలను నిర్మించాడు.

ఆలయం పరిసరాల్లో మరెన్నో చిన్న ఆలయాలు ఉన్నాయి. గోదావరి ఒడ్డున, అభయాంజనేయ స్వామి. తిరువీధిలో దాసాంజనేయ స్వామి, ప్రధాన ఆలయానికి వచ్చే మార్గంలో యోగానంద నరసింహ స్వామి, రాజవీధిలో గోవిందరాజ స్వామి ఆలయాలు ఉన్నాయి.

ప్రదర్శనశాల

ఇక్కడ తానీ షా ఇచ్చిన రామ-ముద్రలు, గోపన్న తయారు చేసిన ఆభరణాలు (చింతాకు పట్టకం, కిరీటాలు, ముత్యాల హారం)లాంటివి, ఇతర విశేష వస్తువులు చూడవచ్చు.

కళ్యాణ మండపం, ఇతర నిర్మాణాలు

దేవాలయం బయటి ప్రాకారంలో నిత్యకళ్యాణ మండపం ఉంది. ఇక్కడే బ్రహ్మోత్సవాలలో శ్రీ సీతారాముల కళ్యాణం జరుగుతుంది. రంగనాయకుల గుట్టపై రామలింగేశ్వర స్వామి (శివుడు) ఆలయం ఉంది. దగ్గరలోని గోవిందస్వామి మఠంలో అనేక యతులు నివసించారు. వైకుంఠ ద్వారం ఎదుట “మిథిలా స్టేడియం” నిర్మించబడింది. దీన్ని జలగం వెంగలరావు నిర్మించారు. దక్షిణ భాగంలో అంబసత్రం ఉంది. భక్తులకు అన్నదానం జరిగేది ఇక్కడే.

ఆలయ ఆచారాలు & పూజావిధానం

రంగనాథుడు రాముని వంశమైన ఇక్ష్వాకు వంశానికి కుటుంబదేవుడు. అందుకే గోపన్న ఆ సంప్రదాయాన్ని ఇక్కడ అమలు చేశాడు. దీనికై శ్రీరంగం నుంచి పంచరాత్ర ఆగమం తెలిసిన ఐదు కుటుంబాలను ఆహ్వానించాడు. నరసింహ దాసు పది రకాల ఉత్సవాలు (దశవిధోత్సవాలు) ప్రవేశపెట్టాడు.

సుప్రభాత సేవ, బాలభోగం, అర్చన, రాజభోగం బవంటి సేవలు నోటియం కొనసాగుతాయి.

తెల్లవారుజాము 3:00 గంటలకు ఆలయం తెరుచుకుంది, అర్చనలు, దర్శన సేవ, భోజనం

పవలింపు సేవ (నిద్రా విధానం) వంటివి స్వామివారికి నిత్య కృత్యాలుగా జరిపిస్తారు. అభిషేకం ప్రధాన గర్భగృహంలో రాముని పాదాలకే చేస్తారు. లక్ష్మీ, ఆంజనేయ, నరసింహ ఆలయాల్లో వేర్వేరు రోజుల్లో అభిషేకాలు జరుగుతాయి.

ముఖ్య ఉత్సవాలు

వైకుంఠ ఏకాదశి

ఈ కార్యక్రమాన్ని శ్రీరంగం సంప్రదాయాలను అనుసరించి జరుపుతారు. ఉత్సవమూర్తులు గరుడవాహనంపై ఉత్తర ద్వారం నుంచి వచ్చే సమయంలో దర్శనం పొందితే వైకుంఠప్రాప్తి లభిస్తుందని బ్రహ్మ పురాణం చెబుతుంది. వైకుంఠ ఏకాదశికి ముందు గోదావరిలో హంస వాహనంపై ఉత్సవమూర్తుల విహారం ఒక అద్భుతం. ఇది రాత్రి విద్యుత్ దీపాలు, పటాకులతో జరుగుతుంది. బోటు నీటిలో 5 ప్రదక్షిణలు చేస్తుంది.

వసంతోత్సవం

ఇది హోళీ సందర్భంగా జరిగే ఉత్సవం. వచ్చే బ్రహ్మోత్సవాల కోసం ముత్యాల తాళంబ్రాలు సిద్ధం చేసే వేళ ఇది. వైష్ణవ మహిళలు చిత్తర‌కూట మండపంలో చేరి పసుపు గింజలు నూరడం, దానితో గోటి తాళంబ్రాలు తయారు చేయడం, శ్రీరాముడికి పసుపు అలంకారం చేయడం నిర్వహిస్తారు. ఉత్సవం చివర్లో ఉత్సవమూర్తులకు డోలోత్సవం (పాల్ని ఉయ్యాల) నిర్వహిస్తారు.

సీతారామ కళ్యాణం

భద్రాచల శ్రీ సీతారాముల కళ్యాణం ప్రతి సంవత్సరం చైత్ర మాసం లో నవమి రోజున,అబిజిత్ లగ్నంలో జరిగే దివ్య వైభవోత్సవం. సీతారాముల కళ్యాణం తో పాటు శ్రీ రామ పట్టాభిషేక ఘట్టం అపూర్వం. ఈ వేళ భద్రాద్రి మొత్తం అగస్త్య మహర్షి స్తుతులతో ప్రతిధ్వనించినట్టు, వేకువజామునుంచే భక్తుల సందడి మొదలౌతుంది. వరుడు శ్రీ రాముడు, వధువు సీతమ్మ రాజసంగా అలంకరించబడి స్వర్ణవేదికపై కళ్యాణ ఘట్టం తో ఒక్కటవుతారు. వేదఘోషలు, మంగళవాయిద్యాలు, భక్తుల ‘జై శ్రీరామ్’ నినాదాలతో కళ్యాణ మహోత్సవం ఆధ్యాత్మిక ఆనందస్వరూపంగా మారుతుంది. ఈ కళ్యాణ మహోత్సవాన్ని దర్శించినవారికి లోక పరలోకాల శుభఫలితాలు కలుగుతాయని నమ్మకం.

భద్రాచల శ్రీ సీతారాముల కళ్యాణానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున తలంబ్రాలు పంపే సంప్రదాయం తానీషా పాలనకాలం నుండి అనువర్తిస్తూ వస్తున్న ప్రత్యేక ఆధ్యాత్మిక పారంపర్య పరంపర. శ్రీరాముడికి భక్తుడైన కుతుబ్‌షాహీ రాజు తానీషా, భద్రాచల దేవస్థానానికి భక్తితో బంగారం, ధాన్యాలు, తలంబ్రాలు పంపడం ప్రారంభించాడని, అప్పటి నుంచి ఆనవాయితీ ప్రకారం నిజాం ప్రభుత్వం, ఆ తర్వాత హైదరాబాదు రాష్ట్రం, చివరికి ఆంధ్రప్రదేశ్ తరవాత తెలంగాణ ప్రభుత్వాలు ఈ ఆచారాన్ని నిలబెట్టాయి. ప్రతి ఏడాది చైత్ర శుద్ధ ద్వాదశి నాడు జరిగే కళ్యాణ మహోత్సవానికి ప్రభుత్వం తరఫున ప్రత్యేక ప్రతినిధి రావడం, అధికారికంగా పసుపు, కుంకుమ, సారెలు, చీరలు, ముత్యాల తలంబ్రాల సమర్పణ చేయడం, రాజ్యమే వధువుకు బంధువులా వచ్చి ఆశీర్వాదం అందిస్తున్నట్టుగా భావిస్తారు. ఈ ఆచారం, కాలం మారినా కళ్యాణం పట్ల ప్రభుత్వ గౌరవాన్ని, భద్రాద్రి శ్రీరామునిపై ప్రతిబింబించే భక్తి విశ్వాసాన్నితెలుపుతుంది. అలాగే వైకుంఠ ఏకాదశి ఉత్తర ద్వారదర్శనం కూడా ఇక్కడ ప్రత్యేకంగా నిర్వహిస్తారు.

బ్రహ్మోత్సవాలు

ఈ ఆలయంలోని అతి ముఖ్యమైన ఉత్సవం. 12 రోజుల బ్రహ్మోత్సవం, మార్చి–ఏప్రిల్ నెలల్లో శ్రీరామ నవమి రోజునే శ్రీ సీతారాముల కల్యాణం జరుగుతుంది. పునర్వసు, అభిజిత్ నక్షత్ర సమయములో పూజ జరుగుతుంది. గోపన్న జైలు నుంచి విడుదలైన తర్వాత తానీషా మొదలుపెట్టిన సంప్రదాయం. ముత్యాలు, పట్టుచీరలు పంపడం ఇప్పటికీ కొనసాగుతుంది. ఈ ముత్యాలే గోటి తాళంబ్రాలలో కలుపుతారు. మంగలసూత్రం మూడు బంగారు పలకలతో ఉంటుంది. దశరథుని సూచకం, జనకుని సూచకం, గోపన్న సూచకం (సీతమ్మను తన కూతురిలా భావించాడు), తరువాత బ్రహ్మోత్సవాలు పుష్పయాగంతో ముగుస్తాయి.

విజయదశమి

దసరా పది రోజుల పాటు లక్ష్మీ దేవి ఆలయంలో యాగాలతో జరుపుతారు. విజయదశమి నాడు లక్ష్మీ తాయారు నిజరూప దర్శనం ఉంటుంది. అభిషేకం, సహస్రనామ అర్చనలు జరుగుతాయి. రాముని ప్రతిమను గజవాహనం, అశ్వవాహనం మీద ఊరేగిస్తారు. అయుధపూజలో శంఖం, చక్రం, ధనుస్సు, మేసం మరియు వేదదేవతలకు సంకేతమైన బాణాలు పూజిస్తారు. రాత్రికి రామలీలా జరుగుతుంది.

ఇతర ఉత్సవాలు

హనుమ జయంతి, దాసాంజనేయ ఆలయంలో ప్రత్యేకంగా జరుగుతుంది. శబరి స్మృతి యాత్ర, గిరిజన తెగల ప్రత్యేక నృత్యాలు, బాణాసంచా ప్రదర్శనలు ఉంటాయి. ధమ్మక్క సేవా యాత్ర, గోవిందరాజ స్వామి వివాహం. గిరిజన మహిళల పూలార్చనలు ఉంటాయి.

గోపన్న, నరసింహ దాసు జయంతులు కూడా ప్రతీ ఏటా జరుపుతారు.

భద్రాచలం చుట్టుపక్కల ప్రదేశాలు

పాపికొండలు ,

గోదావరిలో బోటు ప్రయాణం, భద్రాచలం నుండి 50–70 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. గోదావరిలో బోటు రైడ్, అడవులు, కొండలు, నీటి మధ్య సుందర దృశ్యాలు. పర్యాటకులను మంత్రా ముగ్ధులను చేస్తాయి.

పర్ణశాల

భద్రాచలం నుండి 35 కి. మీ, ఇక్కడే సీత రాముడు,లక్ష్మణుడు నివాసం ఉనట్లు పురాణం ఆధారాలు ఉన్నాయి. రావణుడు సీతామాతను అపహరించిన ప్రాంతం ఇదే అని చెప్పబడుతుంది. అలాగే భద్రాద్రి జిల్లాలోని సుందరమైన అరణ్య ప్రాంతం. గిరిజన ప్రాంతాల సంస్కృతి & గోదావరి ట్రైబల్ జీవనం చూడవచ్చు. దేవాలయ పక్కనే ఉన్న కళారూపాల ప్రాంతం. మట్టి బొమ్మలు, దేవాలయ కళాకృతులు లభిస్తాయి. సాయంత్రపు సమయాల్లో గోదావరి తీరంలో చేసే హారతి అద్భుతంగా ఉంటుంది. గోదావరి నది మహానది కావడంతో చుట్టూ అడవి ప్రాంతాలు, పచ్చదనం, కొండలు ఎక్కువ. అక్టోబర్ నుంచి ఫిబ్రవరి వరకు పర్యాటకులకు మంచి సీజన్. వేసవిలో కొంచెం వేడిగా ఉంటుంది.

రవాణా

భద్రాచలం రోడ్డు కనెక్టివిటీ బాగా ఉంటుంది. హైదరాబాద్ నుండి బద్రాచలం

దూరం: 320 కి. మీ హైదరాబాదు - ఖమ్మం - భద్రాచలం ప్రత్యేక బస్సులు పూర్తిగా అందుబాటులో ఉంటాయి. విజయవాడ - భద్రాచలం, 180 కి. మీ దూరం జగ్గయ్యపేట - ఖమ్మం, భద్రాచలం, విశాఖపట్నం, రాజమండ్రి కాకినాడ నుండి గోదావరి బెల్ట్ నుంచి డైరెక్ట్ బస్సులు అందుబాటులో ఉంటాయి. సమీప రైల్వే స్టేషన్, భద్రాచలం రోడ్ (కొత్తగూడెం), భద్రాచలం దేవాలయం నుండి 40 కి.మీ దూరంలో ఉంటుంది. హైదరాబాద్, విజయవాడ, వరంగల్ నుండి మంచి కనెక్టివిటీ ఉంటుంది. రాజమండ్రి - 180 కి. మీ , విజయవాడ - 200 కి. మీ, హైదరాబాద్ - 320 కి. మీ దూరంలో ఎయిర్‌పోర్ట్‌లు ఉన్నాయి. అక్కడి నుండి టాక్సీలు సులభంగా లభిస్తాయి.

వసతి & ఆహారం

దేవస్థానం వసతి గృహాలు అందుబాటులో ఉన్నాయి. సాధారణ ఏ సి, నాన్ ఏ సి గదులు ఉన్నాయి. ఆన్‌లైన్ బుకింగ్ అవకాశాలు కూడా ఉన్నాయి. భ ద్రాచలంలో మోడరేట్ హోటళ్లు, ఫ్యామిలీ స్టేలు లభిస్తాయి. రివర్ వ్యూ రూమ్స్ కూడా లభిస్తాయి. శుద్ధ శాకాహార హోటళ్లు ఎక్కువ. దేవస్థానం అన్నప్రసాదం అందిస్తారు. స్థానిక వంటకాలు లభిస్తాయి.

భద్రాచలం పుణ్యక్షేత్రం ఆధ్యాత్మికత, ప్రకృతి, గోదావరి సౌందర్యం ఒకటైన ప్రదేశం.

ఇక్కడ రామాలయం దర్శనం, గోదావరి తీరం అనుభూతి, పాపికొండల ప్రకృతి, పర్ణశాల వంటి పురాణ ప్రదేశాలు మంచి పర్యటన అనుభూతిని అందిస్తాయి.