
బ్రహ్మోస్ డీజీ నియామకంపై క్యాట్ ఉత్తర్వులకు హైకోర్టు స్టే
తెలంగాణ హైకోర్టు బ్రహ్మోస్ డైరెక్టర్ జనరల్ నియామకంపై సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ (క్యాట్) ఇచ్చిన ఉత్తర్వులను సస్పెండ్ చేసింది. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్డీవో)కు చెందిన బ్రహ్మోస్ మిసైల్ ప్రోగ్రామ్ డైరెక్టర్ జనరల్గా జైతీర్థ్ ఆర్. జోషి నియామకాన్ని రద్దు చేస్తూ క్యాట్ గత నెలలో ఇచ్చిన ఉత్తర్వులపై హైకోర్టు ఈ నిర్ణయం తీసుకుంది.
హైదరాబాద్లోని క్యాట్ బెంచ్ డిసెంబర్లో జోషి నియామకాన్ని కొట్టివేస్తూ, ఈ కీలక పదవికి సంబంధించి సీనియర్ శాస్త్రవేత్త శివసుబ్రహ్మణియం నంబి నాయుడు అభ్యర్థనను తిరిగి పరిగణనలోకి తీసుకోవాలని రక్షణ మంత్రిత్వ శాఖను ఆదేశించింది. నాయుడు డీఆర్డీవోలో డిస్టింగ్విష్డ్ సైంటిస్ట్ (డీఎస్)గా పనిచేస్తుండగా, బ్రహ్మోస్ డీజీ పోస్టుకు ఎంపికైన ముగ్గురు అభ్యర్థుల్లో ఆయన ఒకరుగా ఉన్నారు.
జోషి నియామకాన్ని సవాల్ చేస్తూ నాయుడు నవంబర్ 2024లో క్యాట్ను ఆశ్రయించారు. తాను జోషితో పోలిస్తే ఏడేళ్లు సీనియర్నని, 2017 నుంచే ‘అవుట్స్టాండింగ్ సైంటిస్ట్’ హోదాలో సేవలందిస్తున్నానని ఆయన తన పిటిషన్లో పేర్కొన్నారు. అర్హతలు, అనుభవం పరంగా తనకు ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉందని ఆయన వాదించారు.
ఇదిలా ఉండగా, జైతీర్థ్ ఆర్. జోషి 2024 డిసెంబర్ 2న బ్రహ్మోస్ డైరెక్టర్ జనరల్గా బాధ్యతలు స్వీకరించారు. అయితే ఆయన నియామకంపై వివాదం చెలరేగడంతో, క్యాట్ ఉత్తర్వులు, తదనంతరంగా హైకోర్టు జోక్యం ప్రాధాన్యం సంతరించుకున్నాయి. భారత్ ప్రస్తుతం భారీ రక్షణ సామగ్రి సరఫరా ఆర్డర్లను అమలు చేస్తున్న కీలక సమయంలో ఈ నాయకత్వ వివాదం తెరపైకి రావడం గమనార్హం. బ్రహ్మోస్ వంటి వ్యూహాత్మక క్షిపణి ప్రాజెక్ట్కు సంబంధించిన నిర్ణయాలపై ఈ కేసు ప్రభావం చూపే అవకాశముందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
