Let's talk: editor@tmv.in
'బెస్ట్' పుదుచ్చేరి కాదు.. 'బార్'ల పుదుచ్చేరి: నారాయణస్వామి

'బెస్ట్' పుదుచ్చేరి కాదు.. 'బార్'ల పుదుచ్చేరి: నారాయణస్వామి

Dantu Vijaya Lakshmi Prasanna
4 ఏప్రిల్, 2026

కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో రాజకీయ వాతావరణం మరింత వేడెక్కింది. సీనియర్ కాంగ్రెస్ నేత, మాజీ ముఖ్యమంత్రి వి. నారాయణస్వామి ప్రస్తుత ప్రభుత్వం పై తీవ్ర ఆరోపణలు గుప్పించారు. ముఖ్యమంత్రి ఎన్. రంగస్వామి నేతృత్వంలోని కేబినెట్ నకిలీ మందుల తయారీ కుంభకోణంలో చిక్కుకుందని, అలాగే రెస్టోబార్ లైసెన్స్‌ల కోసం భారీ స్థాయిలో లంచాలు తీసుకుంటున్నారని ఆయన ఆరోపించారు.

నారాయణస్వామి వెల్లడించిన వివరాల ప్రకారం, పుదుచ్చేరిలో తయారైన నకిలీ ఔషధాలు ఎనిమిది రాష్ట్రాలకు సరఫరా చేయబడ్డాయని, ఈ వ్యవహారంలో ప్రభుత్వ యంత్రాంగం మొత్తం బాధ్యత వహించాల్సి ఉందని అన్నారు. అయితే ఈ ఆరోపణలకు సంబంధించిన పూర్తి వివరాలను ఆయన వెల్లడించలేదు. ఇదే సమయంలో ఈ కేసు ప్రస్తుతం సీబీఐ దర్యాప్తులో ఉందని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ, నారాయణస్వామి మాత్రం దీనిని చిన్న విషయం కాదని, పెద్ద స్థాయి అవినీతి కుంభకోణంగా అభివర్ణించారు.

ఇక రెస్టోబార్ లైసెన్స్‌ల అంశాన్ని ప్రస్తావిస్తూ, ఒక లైసెన్స్ పొందేందుకు సుమారు రూ.40 లక్షల వరకు లంచం తీసుకుంటున్నారని ఆరోపించారు. గత ఐదేళ్లలో ఏఐఎన్ఆర్సి -బీజేపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పుదుచ్చేరిలో బార్ల సంఖ్య గణనీయంగా పెరిగిందని, ముందుగా 400 మాత్రమే ఉన్న బార్లు ప్రస్తుతం 800కు చేరాయని తెలిపారు. ఇది సామాజికంగా తీవ్రమైన సమస్యలకు దారి తీస్తోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

“ప్రతి వీధిలో ఒక రెస్టోబార్ కనిపిస్తోంది. ఒకే వీధిలో 10-11 బార్లు ఉండటం సాధారణంగా మారింది. మహిళలు రాత్రి వేళల్లో బయటకు రావడం కష్టంగా మారింది. ఇది సమాజానికి మంచిదా?” అని ప్రశ్నించారు. పుదుచ్చేరిని ఆధ్యాత్మిక, పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తామని చెప్పిన ప్రభుత్వానికి ఇది తగిన విధానమా అని ఆయన విమర్శించారు.

అదేవిధంగా పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్ లో 30 శాతం కమిషన్ వసూళ్లు జరుగుతున్నాయని, స్మార్ట్ సిటీ ప్రాజెక్టుల అమలులో కూడా ఇదే స్థాయి అవినీతి జరుగుతోందని ఆరోపించారు. ప్రాపర్టీ రిజిస్ట్రేషన్లు, పట్టాల మంజూరు వంటి అంశాల్లో కూడా అవినీతి పెరిగిందని ఆయన పేర్కొన్నారు.

తన ముఖ్యమంత్రి పదవీకాలం (2016–2021) గురించి ప్రస్తావిస్తూ, ఆ సమయంలో పుదుచ్చేరిలో చట్టం-సమాధానం పరిస్థితి మెరుగ్గా ఉందని, విద్యారంగంలో ఉత్తీర్ణత శాతం 95 వరకు చేరిందని చెప్పారు. కరోనా మహమ్మారి సమయంలో ప్రభుత్వం సమర్థంగా పనిచేసి ప్రజల ప్రాణాలను కాపాడిందని తెలిపారు. అప్పటి లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీతో ఉన్న పరిపాలనా విభేదాల మధ్య కూడా ప్రజలకు మంచి పాలన అందించామని ఆయన అన్నారు.

ప్రస్తుత పరిస్థితులపై విమర్శలు గుప్పిస్తూ, విద్యారంగం దెబ్బతిందని, ఉత్తీర్ణత శాతం ప్రస్తుతం 73కు పడిపోయిందని, ప్రతి ఏడాది సుమారు 10,000 మంది విద్యార్థులు చదువు మానేస్తున్నారని నారాయణస్వామి ఆరోపించారు. వ్యాపార రంగం కూడా జీఎస్టీ అమలుతో దెబ్బతిందని చెప్పారు.

ఇటీవల ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించిన “బెస్ట్ పుదుచ్చేరి” (బిజినెస్, ఎడ్యుకేషన్,, స్పిరిచ్యుయాలిటీ, టూరిజం విజన్‌పై కూడా నారాయణస్వామి తీవ్ర విమర్శలు చేశారు. “ఈ నాలుగు రంగాల్లో కూడా పురోగతి కనిపించడం లేదు. ముఖ్యంగా పర్యాటక రంగం అభివృద్ధి కాంగ్రెస్ పాలనలోనే జరిగింది. డైమండ్, బ్లూ, మెరినా బీచ్‌ల అభివృద్ధి మా కాలంలోనే జరిగింది,” అని అన్నారు.

ఇక ప్రభుత్వంపై తుదిమాటగా ఆయన మాట్లాడుతూ, “ఇది పనితీరు లేని, ప్రజావ్యతిరేక ప్రభుత్వం. ఉచితాల పేరుతో ప్రజలను మోసం చేస్తోంది. అవినీతి, అక్రమాలు విస్తృతంగా పెరిగాయి. ప్రజలు దీనికి తగిన సమాధానం ఇస్తారు,” అని హెచ్చరించారు.

ఇక మరోవైపు ముఖ్యమంత్రి రంగస్వామి ఈ ఆరోపణలను ఖండిస్తూ, అవన్నీ అసత్యం, ఆధారరహితమని పేర్కొన్నారు. నకిలీ మందుల కేసు సీబీఐ దర్యాప్తులో ఉన్నందున దాని గురించి వ్యాఖ్యానించడం సరికాదని తెలిపారు. దీంతో ఈ వ్యవహారం రాజకీయంగా మరింత వేడెక్కే అవకాశం కనిపిస్తోంది.