
బెంగాల్ ‘చాణక్యుడు’ ముకుల్రాయ్ ఇక లేరు
పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో ‘చాణక్యుడు’గా పేరొందిన సీనియర్ నేత ముకుల్ రాయ్(72) సోమవారం తెల్లవారుజామున దీర్ఘకాలిక అనారోగ్యంతో కన్నుమూశారు. వలస రాజకీయాలకు రూపకల్పన చేసి, ఆ తరువాత ఆ మార్గాన్నే అనుసరించిన ఆయనతో బెంగాల్ రాజకీయాల్లో ఒక అధ్యాయం ముగిసింది. 1954లో ఉత్తర 24 పరగణాల కంచ్రాపారాలో జన్మించిన రాయ్, 1980లలో యూత్ కాంగ్రెస్తో రాజకీయ ప్రస్థానం ప్రారంభించారు. 1998లో మమతా బెనర్జీ కాంగ్రెస్ను విడిచి తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) స్థాపించినప్పుడు ఆమె వెంట వచ్చిన తొలి నాయకుల్లో ఆయన ఒకరు. మాటల కంటే గణాంకాలు, బూత్ కమిటీలు, టికెట్ పంపిణీ, కూటమి వ్యూహాలు ఆయన ప్రత్యేకత. తక్కువ కాలంలోనే టీఎంసీ ప్రధాన కార్యదర్శిగా ఎదిగి, ఢిల్లీలో పార్టీ సమస్యలను పరిష్కరించడంలో తనదైన ముద్ర వేశారు. 2006లో రాజ్యసభకు ఎన్నికై, 2009లో ఎగువ సభలో టీఎంసీ నేతగా బాధ్యతలు చేపట్టారు. యూపీఏ-2 ప్రభుత్వంలో షిప్పింగ్ శాఖలో రాష్ట్రమంత్రిగా, అనంతరం 2012లో రైల్వే మంత్రిగా సేవలందించారు.
వలస రాజకీయాలకు నాంది
2011లో టీఎంసీ విజయం సాధించి 34 ఏళ్ల వామపక్షాల పాలనకు తెరదించాక, విపక్ష నేతలను పార్టీలోకి రప్పించడంలో రాయ్ కీలక పాత్ర పోషించారు. మున్సిపాలిటీలు, జిలా పరిషత్తుల్లో పెద్దఎత్తున వలసలు చోటుచేసుకున్నాయి. ఆ కాలంలో వలసలు రాజకీయ వ్యూహంగా మారి, ఆయనకు ‘బెంగాల్ చాణక్యుడు’ అనే బిరుదు తెచ్చిపెట్టాయి.
వివాదాలు, రాజకీయ మార్పులు
శారద చిట్ఫండ్ కేసు, నరదా స్టింగ్ ఆపరేషన్ వంటి వివాదాలు ఆయనను వెంటాడాయి. పార్టీ అంతర్గత సమీకరణాలు మారడంతో 2017లో టీఎంసీని వీడి భారతీయ జనతా పార్టీలో చేరారు. 2019 లోక్సభ ఎన్నికల్లో బెంగాల్లో బీజేపీ 42 స్థానాల్లో 18 గెలవడంలో ఆయన వ్యూహం కీలకమని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. 2020లో బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడిగా నియమితులయ్యారు. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో ఉత్తర్ కృష్ణనగర్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచినప్పటికీ, ఫలితాల అనంతరం తిరిగి టీఎంసీలో చేరి ‘ఇదే నా మొదటి, చివరి ఇల్లు’ అని వ్యాఖ్యానించారు. అయితే అప్పటికే క్షేత్ర స్థాయిలో ఆయన రాజకీయ ప్రభావం గణనీయంగా తగ్గిపోయింది.
చివరి దశ
ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ పదవికి రాజీనామా చేశారు. కలకత్తా హైకోర్టు ఆయనను యాంటీ-డిఫెక్షన్ చట్టం కింద అనర్హుడిగా ప్రకటించగా, సుప్రీంకోర్టు ఆ నిర్ణయాన్ని నిలిపివేసింది. పోస్ట్-2011 బెంగాల్ రాజకీయాల్లో కూటముల మార్పులు, వలసల సంస్కృతికి రూపకల్పన చేసిన వ్యూహకర్తగా ముకుల్ రాయ్ గుర్తుండిపోతారు. రంగస్థలంపై కాకుండా, సూత్రధారిగా తెరవెనుక ఉండి రాజకీయ సమీకరణాలను మలిచిన నేతగా ఆయనకు ప్రత్యేక స్థానం ఉంది.
ముకుల్ రాయ్ మృతి పట్ల తృణమూల్ కాంగ్రెస్ అధినేత, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, పార్టీ నాయకులు అభిషేక్ బెనర్జీ సంతాపం వ్యక్తం చేశారు. పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో దశాబ్దాలుగా కీలక పాత్ర పోషించిన మాజీ తృణమూల్ కాంగ్రెస్ నాయకుడు ముకుల్ రాయ్ మృతి చెందిన వార్తపై రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు.
