Let's talk: editor@tmv.in
బెంగాల్‌కు 480 కేంద్ర బలగాల కంపెనీలు

బెంగాల్‌కు 480 కేంద్ర బలగాల కంపెనీలు

Pinjari Chand
3 మార్చి, 2026

త్వరలో జరిగే పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లను కట్టుదిట్టం చేస్తూ భారత ఎన్నికల సంఘం రాష్ట్రవ్యాప్తంగా 480 కేంద్ర బలగాల కంపెనీలను జిల్లా వారీగా మోహరించేందుకు తుది నిర్ణయం తీసుకుంది. ఎన్నికల షెడ్యూల్ అధికారికంగా ప్రకటించకముందే ఈ జాబితాను విడుదల చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇప్పటికే తొలి దశలో 240 కంపెనీలు రాష్ట్రానికి చేరుకుని వివిధ జిల్లాల్లో రూట్ మార్చ్‌లు నిర్వహిస్తున్నాయి. మిగిలిన 240 కంపెనీలు మార్చి 10న రాష్ట్రానికి చేరనున్నట్లు ఎన్నికల సంఘం వర్గాలు తెలిపాయి. రెండో దశ మోహరింపుతో మొత్తం 480 కంపెనీల పంపిణీ ఖరారైనట్లు పేర్కొన్నారు.

ఉత్తర బెంగాల్‌లో డార్జిలింగ్‌కు 11 కంపెనీలు కేటాయించగా, సిలిగురి పోలీస్ కమిషనరేట్‌కు 5, కాలింపాంగ్‌కు 4, అలిపుర్‌దువార్‌కు 7, జల్పాయిగురికి 10 కంపెనీలు ఇవ్వనున్నారు. ఉత్తర్ దినాజ్‌పూర్ జిల్లాలో ఇస్లాంపూర్‌కు 9, రాయ్‌గంజ్‌కు 10 కంపెనీలు మోహరించనున్నారు. దక్షిణ దినాజ్‌పూర్‌కు 10 కంపెనీలు కేటాయించారు. మాల్దాకు 18, ముర్షిదాబాద్‌కు 20, జంగిపూర్‌కు 15 కంపెనీలు రానున్నాయి. రాజధాని కొల్‌కతాకు మొత్తం 30 కంపెనీలు కేటాయించగా, వాటిలో 12 ఇప్పటికే చేరాయి. మిగిలిన 18 రెండో దశలో రానున్నాయి. హౌరా పోలీస్ కమిషనరేట్‌కు 10, హౌరా గ్రామీణ ప్రాంతానికి 11, హుగ్లీ గ్రామీణానికి 16, చందనగర్ కమిషనరేట్‌కు 11 కంపెనీలు ఇవ్వనున్నారు.

ఉత్తర 24 పరగణాల్లో బరాసత్‌కు 11, బోంగావ్‌కు 6, బసిర్హాట్‌కు 17, బరాక్‌పూర్‌కు 19 కంపెనీలు మోహరించనున్నారు. బిధాన్నగర్ కమిషనరేట్‌కు 5 కంపెనీలు కేటాయించారు. దక్షిణ 24 పరగణాల్లో బరుయిపూర్‌కు 13, డైమండ్ హార్బర్‌కు 11, సుందర్బన్స్‌కు 9 కంపెనీలు అందనున్నాయి. ఇతర జిల్లాల్లో పూర్వ మేదినిపూర్‌కు 28, పశ్చిమ మేదినిపూర్‌కు 20, జార్గ్రామ్‌కు 11, పూర్వ బర్ధమాన్‌కు 25, ఆసన్సోల్–దుర్గాపూర్ కమిషనరేట్‌కు 17, బీర్బూమ్‌కు 21, పురులియాకు 20, బ్యాంకురాకు 13 కంపెనీలు మోహరించనున్నారు. ఎన్నికల తేదీల ప్రకటనకు ముందే భారీ స్థాయిలో కేంద్ర బలగాల మోహరింపుతో ఓటర్లలో నమ్మకం పెంపొందించడం, స్వేచ్ఛాయుతం–నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించడం లక్ష్యమని ఎన్నికల సంఘం వర్గాలు వెల్లడించాయి.

బెంగాల్‌కు 480 కేంద్ర బలగాల కంపెనీలు - Tholi Paluku