Let's talk: editor@tmv.in
‘బుక్-ఎ-కాల్ విత్ బీఎల్వో’ను ప్రారంభించిన ఈసీఐ

‘బుక్-ఎ-కాల్ విత్ బీఎల్వో’ను ప్రారంభించిన ఈసీఐ

Pinjari Chand
11 జనవరి, 2026

ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ – ఎస్ఐఆర్) ప్రక్రియలో ఓటరు సేవలను మరింత సులభతరం చేయడానికి భారత ఎన్నికల కమిషన్ (ఈసీఐ) ఉత్తరప్రదేశ్‌లో ‘బుక్-ఎ-కాల్ విత్ బూత్ లెవల్ ఆఫీసర్ (బీఎల్వో)’ అనే కొత్త సౌకర్యాన్ని శనివారం ప్రారంభించింది. ఈ సవరణలో భాగంగా క్లెయిమ్స్, అభ్యంతరాల స్వీకరణ గడువు 2026 ఫిబ్రవరి 6 వరకు కొనసాగుతుందని అధికారులు తెలిపారు. అధికారిక ప్రకటన ప్రకారం, ఓటర్లు తమకు సంబంధించిన బూత్ లెవల్ ఆఫీసర్‌తో ఫోన్ కాల్ బుక్ చేసుకుని ఓటరు జాబితాకు సంబంధించిన సమాచారం లేదా సహాయాన్ని పొందవచ్చు. ఇందులో పేరు చేర్పు, తొలగింపు లేదా వివరాల సవరణకు సంబంధించిన అంశాలపై బీఎల్ఓలను నేరుగా సంప్రదించే అవకాశం ఉంటుంది.

ఈ సేవను voters.eci.gov.in వెబ్‌పోర్టల్ లేదా ECINET మొబైల్ అప్లికేషన్ ద్వారా పొందవచ్చు. నమోదు చేసుకున్న మొబైల్ నంబర్‌తో లాగిన్ అవ్వడం లేదా ఓటీపీ ద్వారా కొత్తగా రిజిస్ట్రేషన్ పూర్తి చేసిన తర్వాత, ఓటర్లు తమ ఈపీఐసీ నంబర్ లేదా రిఫరెన్స్ నంబర్‌ను నమోదు చేసి కాల్ బుక్ చేసుకోవచ్చు. ప్రత్యామ్నాయంగా రాష్ట్రం, జిల్లా, అసెంబ్లీ నియోజకవర్గం, బూత్ నంబర్ వంటి వివరాలు ఇచ్చి కూడా కాల్ బుక్ చేయవచ్చు. బుక్ చేసిన తర్వాత సంబంధిత బీఎల్ఓ 48 గంటలలోపు ఓటరిని సంప్రదిస్తారు. ఉత్తరప్రదేశ్‌కు సంబంధించిన డ్రాఫ్ట్ ఓటరు జాబితాను మంగళవారం విడుదల చేశారు. ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియలో భాగంగా 2.89 కోట్ల ఓటర్ల పేర్లు తొలగించగా, 12.55 కోట్ల ఓటర్లను జాబితాలో కొనసాగించినట్లు వెల్లడైంది.

ఓటర్లు వినియోగించుకోవాలి

ఉత్తరప్రదేశ్ ప్రధాన ఎన్నికల అధికారి నవదీప్ రిన్వా, ఎస్ఐఆర్ కు సంబంధించిన సందేహాలు, సమస్యల పరిష్కారానికి ఈ ‘బుక్-ఎ-కాల్ విత్ బీఎల్ఓ’ సౌకర్యాన్ని ఓటర్లు అధిక సంఖ్యలో వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు. ప్రధాన ఎన్నికల అధికారి విడుదల చేసిన ఎస్ఐఆర్ డైలీ బులెటిన్ ప్రకారం, క్లెయిమ్స్, అభ్యంతరాల స్వీకరణ గడువు జనవరి 6 నుంచి ఫిబ్రవరి 6, 2026 వరకు కొనసాగుతుంది. ఈ కాలవ్యవధిలో అర్హులైన ఓటర్లు జాబితాలో పేరు చేర్పు కోసం క్లెయిమ్స్, లేదా పేర్ల తొలగింపుకు అభ్యంతరాలను నిబంధనల ప్రకారం సమర్పించవచ్చు. ఎన్నికల కమిషన్ తెలిపిన వివరాల ప్రకారం, అవసరమైన ధృవీకరణ పూర్తయి, అవసరమైన ప్రకటనలు అందిన తర్వాతే ఓటరు తుది జాబితాలో పేర్లు చేర్చుతారు. రాజకీయ పార్టీలు నియమించిన బూత్ లెవల్ ఏజెంట్లు (బీఎల్ఏస్) ప్రజల నుంచి ఫారం-6 (చేర్పు), ఫారం-7 (తొలగింపు) ద్వారా వచ్చిన క్లెయిమ్స్, అభ్యంతరాలను అవసరమైన డిక్లరేషన్లతో కలిసి సమర్పిస్తున్నారని బులెటిన్ పేర్కొంది. నిబంధనలకు అనుగుణంగా ఆ ఫారాలు లేదా డిక్లరేషన్లు ఫిర్యాదులను పరిగణనలోకి తీసుకోమని స్పష్టం చేసింది. డ్రాఫ్ట్ ఓటరు జాబితా (12,55,56,025 మంది ఓటర్లు)పై జాతీయ, రాష్ట్ర రాజకీయ పార్టీల నుంచి పెద్ద సంఖ్యలో క్లెయిమ్స్, అభ్యంతరాలు వచ్చాయని బులెటిన్ తెలిపింది. శుక్రవారం వరకు జాతీయ పార్టీల్లో, బహుజన్ సమాజ్ పార్టీ 1,53,469 పేరు చేర్పు క్లెయిమ్స్, 19 తొలగింపు అభ్యంతరాలు సమర్పించగా, భారతీయ జనతా పార్టీ 1,60,605 చేర్పు క్లెయిమ్స్, 1,214 అభ్యంతరాలు దాఖలు చేసింది. భారత జాతీయ కాంగ్రెస్ 94,591 చేర్పు క్లెయిమ్స్, 19 అభ్యంతరాలు సమర్పించగా, ఆమ్ ఆద్మీ పార్టీ 5,262 చేర్పు క్లెయిమ్స్ దాఖలు చేసింది. రాష్ట్ర పార్టీల్లో సమాజ్‌వాది పార్టీ 1,56,972 పేరు చేర్పు క్లెయిమ్స్, 82 అభ్యంతరాలు సమర్పించగా, అప్నాదళ్ (ఎస్) పార్టీ 5,397 చేర్పు క్లెయిమ్స్ దాఖలు చేసింది. అలాగే డ్రాఫ్ట్ ఓటరు జాబితా ప్రచురణ అనంతరం, ఓటర్ల నుంచి నేరుగా 32,290 క్లెయిమ్స్, అభ్యంతరాలు వచ్చాయని బులెటిన్ వెల్లడించింది.