
బీసీసీఐ కొత్త అధ్యక్షుడిగా మిథున్ మన్హాస్
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కొత్త అధ్యక్షుడిగా ఢిల్లీ రంజీ జట్టు మాజీ కెప్టెన్ మిథున్ మన్హాస్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆదివారం ముంబైలో జరిగిన బోర్డు వార్షిక సర్వసభ్య సమావేశంలో ఈ కీలక నియామకాన్ని అధికారికంగా ప్రకటించారు. 45 ఏళ్ల మన్హాస్ బోర్డు 37వ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు. గత నెలలో 70 ఏళ్లు నిండడంతో రాజీనామా చేసిన రోజర్ బిన్నీ స్థానంలో ఆయన నియమితులయ్యారు.
సౌరవ్ గంగూలీ, హర్భజన్ సింగ్ వంటి అంతర్జాతీయ క్రికెట్ దిగ్గజాల పేర్లు తొలుత వినిపించినా, అందరి అంచనాలను తలకిందులు చేస్తూ దేశవాళీ క్రికెట్లో సుదీర్ఘ అనుభవం, పరిపాలనా సామర్థ్యం ఉన్న మన్హాస్ను ఎన్నుకోవడం భారత క్రికెట్ వర్గాలకు ఆశ్చర్యం కలిగించింది. ఈ నెల ప్రారంభంలో న్యూఢిల్లీలో జరిగిన బోర్డు అనధికారిక సమావేశంలో మన్హాస్ పేరు ఏకగ్రీవ అభ్యర్థిగా ఖరారైంది. మన్హాస్ జమ్ము కాశ్మీర్కు చెందిన తొలి వ్యక్తిగా, అలాగే భారతదేశానికి ప్రాతినిధ్యం వహించని (అన్-క్యాప్డ్) ఆటగాడిగా బీసీసీఐ అధ్యక్ష పీఠాన్ని అధిరోహించడం చారిత్రక ఘట్టం. సౌరవ్ గంగూలీ, రోజర్ బిన్నీ తర్వాత వరుసగా మూడవ క్రికెటర్గా మన్హాస్ ఈ పదవిని చేపట్టారు.
మిథున్ మన్హాస్ ప్రస్థానం
1979 అక్టోబర్ 12న జమ్మూ కశ్మీర్లో జన్మించిన మిథున్ మన్హాస్, తన క్రికెట్ కెరీర్ను ఢిల్లీలో ప్రారంభించారు. కుడిచేతి వాటం బ్యాట్స్మన్గా, అప్పుడప్పుడు ఆఫ్-స్పిన్ బౌలర్గా ఆయన సుదీర్ఘమైన ఫస్ట్-క్లాస్ క్రికెట్ ఆడారు. 18 సంవత్సరాల పాటు సాగిన తన కెరీర్లో ఆయన 157 ఫస్ట్-క్లాస్ మ్యాచ్లలో 9,714 పరుగులు చేశారు. ఇందులో 27 సెంచరీలు, 49 అర్ధ సెంచరీలున్నాయి. ఆయన బ్యాటింగ్ సగటు 45.82 కావడం విశేషం. ఇండియన్ ప్రీమియర్ లీగ్లో ఢిల్లీ డేర్డెవిల్స్, పూణే వారియర్స్, చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడారు. జమ్మూ కశ్మీర్ నుండి ఐపీఎల్లో ఆడిన మొదటి ఆటగాడు కూడా ఆయనే.
విరాట్ కోహ్లీకి మొదటి కెప్టెన్
మిథున్ మన్హాస్ పేరు వినగానే చాలా మందికి గుర్తుకు వచ్చేది ఆయన ఢిల్లీకి సారథ్యం వహించిన సమయం. ఆయన 2007-08లో ఢిల్లీ రంజీ ట్రోఫీ గెలిచిన జట్టులో ఒక కీలక సభ్యుడు. ఈ సమయంలోనే విరాట్ కోహ్లీ తన దేశవాళీ కెరీర్ను ప్రారంభించారు. కోహ్లీ ఆడిన మొదటి రంజీ ట్రోఫీలో మన్హాస్ ఢిల్లీ జట్టు కెప్టెన్గా ఉన్నారు. యువ ఆటగాడిగా కోహ్లీ ప్రయాణం మన్హాస్ సారథ్యంలోనే మొదలైంది. కోహ్లీ అంతర్జాతీయ స్టార్గా ఎదిగిన తర్వాత కూడా మన్హాస్ను ఆయన మొదటి ఢిల్లీ కెప్టెన్గా గౌరవిస్తూ ఉంటారు.
రిటైర్ అయిన తర్వాత మన్హాస్ ఐపీఎల్లో పంజాబ్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్ జట్లకు సహాయ కోచ్గా పని చేశారు. అలాగే జమ్మూకశ్మీర్ క్రికెట్ అసోసియేషన్లో డైరెక్టర్ ఆఫ్ క్రికెట్ ఆపరేషన్స్ పదవిలో కూడా ఉన్నారు. జమ్మూ, శ్రీనగర్లలోని క్రికెట్ సౌకర్యాలను మెరుగుపరచడంలో, పిచ్లను పునర్నిర్మించడంలో కీలకపాత్ర పోషించారు. ఇది అక్కడి యువ క్రికెటర్ల ఆత్మవిశ్వాసాన్ని, ఆట స్థాయిని పెంచింది. క్రికెట్ పరిపాలనలో ఆయనకు ఉన్న అనుభవం, ఆటగాడిగా, కోచ్గా ఆయనకు ఉన్న విస్తృత పరిజ్ఞానం వల్ల ఆయన బీసీసీఐ అధ్యక్ష పదవికి ఎన్నికయ్యారు.
మన్హాస్ ఎన్నికతో పాటు బోర్డులోని ఇతర కీలక పదవుల నియామకాలు కూడా జరిగాయి. వైస్ ప్రెసిడెంట్గా రాజీవ్ శుక్లా, కార్యదర్శిగా దేవజిత్ సైకియా, ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ చైర్మన్గా అరుణ్ ధుమాల్ తమ పదవులను నిలబెట్టుకున్నారు. కోశాధికారిగా రఘురామ్ భట్ (కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్ చీఫ్), సంయుక్త కార్యదర్శిగా ప్రభ్తేజ్ భాటియా, అపెక్స్ కౌన్సిల్ సభ్యుడిగా జయదేవ్ షా (సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు) కొత్తగా ఎన్నికయ్యారు.
మహిళా క్రికెట్కు సంబంధించి, అమిత శర్మ మహిళల సెలక్షన్ ప్యానెల్ ఛైర్పర్సన్గా నియమితులయ్యారు. ఈమె నీతూ డేవిడ్ స్థానంలో కొత్తగా వచ్చారు. భారతదేశం తరఫున 116 వన్డేలు ఆడిన ఈ మాజీ ఫాస్ట్ బౌలర్తో పాటు, శ్యామా దేయ్, జయ శర్మ, శ్రవంతి నాయుడు సభ్యులుగా ఉంటారు. వీరి పదవీకాలం సెప్టెంబర్ 30 నుండి నవంబర్ 2 వరకు భారత్, శ్రీలంకలో జరగనున్న మహిళల ప్రపంచ కప్ తర్వాత ప్రారంభమవుతుంది. అలాగే మాజీ భారత అంతర్జాతీయ ఆటగాళ్లు ఆర్పీ సింగ్, ప్రజ్ఞాన్ ఓఝా పురుషుల సెలక్షన్ ప్యానెల్లో చేరారు.
స్వాగతించిన హర్భజన్ సింగ్
పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ ప్రతినిధిగా బోర్డు వార్షిక సర్వసభ్య సమావేశానికి హాజరైన టీమిండియా మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్, మన్హాస్ నియామకాన్ని స్వాగతించారు. క్రికెట్ బోర్డు పగ్గాలు ఒక క్రికెటర్ చేతిలో ఉండటం ఒక సానుకూల పరిణామం అని అన్నారు.
"ఒక క్రికెటర్ క్రికెట్ బోర్డుకు నేతృత్వం వహించినప్పుడు, అతడి అనుభవం సహాయపడుతుంది. ఇది గొప్ప నిర్ణయం. గత మూడు పర్యాయాలుగా ఇదే జరుగుతోంది. నేను మిథున్తో అండర్ 19 రోజుల నుండి క్రికెట్ ఆడాను. అతడి నియామకం పట్ల నేను చాలా సంతోషంగా ఉన్నాను’’ అని అన్నారు. మన్హాస్ తన అనుభవాన్ని ఉపయోగించి దేశవ్యాప్తంగా మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడంపై దృష్టి సారిస్తారని, యువ క్రికెటర్లను ప్రోత్సహిస్తారని భజ్జి ఆశాభావం వ్యక్తం చేశారు.
