
బీజేపీ గూటికి టెన్నిస్ దిగ్గజం లియాండర్ పేస్
భారత టెన్నిస్ దిగ్గజం, ఒలింపిక్ పతక విజేత లియాండర్ పేస్ మంగళవారం అధికారికంగా భారతీయ జనతా పార్టీ(బీజేపీ)లో చేరారు. కేంద్ర మంత్రులు కిరెన్రిజిజు, సుకంత మజుందార్ సమక్షంలో ఆయన పార్టీ సభ్యత్వం స్వీకరించారు. రాజకీయాల్లో ఆయనకు ఇది కొత్త దశగా మారింది. పేస్ ముందుగా 2021లో ఆల్ఇండియా తృణమూల్ కాంగ్రెస్లో చేరి రాజకీయ రంగంలో అడుగుపెట్టారు. ఇప్పుడు బీజేపీలో చేరడంతో మరో రాజకీయ ఇన్నింగ్స్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా లియాండర్ పేస్ మాట్లాడుతూ ఇదే సందర్భంగా లియాండర్ పేస్ మాట్లాడుతూ, దేశ క్రీడా అభివృద్ధికి నాయకత్వం కీలకమని పేర్కొన్నారు. నేను 40 సంవత్సరాలు దేశం కోసం ఆడాను. ఇప్పుడు యువతకు సేవ చేయాల్సిన సమయం వచ్చింది. ఖేలో ఇండియా ఉద్యమం, టాప్స్ స్కీమ్ వంటి పథకాలు గొప్పవి. టోక్యో ఒలింపిక్స్లో భారత బృందం ప్రదర్శన కోసం కిరెన్రిజిజు ఎంతో కృషి చేశారు. ప్రధానమంత్రి అప్పగించిన బాధ్యతను ఆయన సమర్థంగా నిర్వర్తించారు. భారతదేశం ప్రపంచంలోనే అత్యంత యువ దేశమని పేర్కొన్న పేస్, వచ్చే 20–25 సంవత్సరాల్లో క్రీడా విద్యపై ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందన్నారు. 1986లో పశ్చిమ బెంగాల్లో క్రీడా మౌలిక సదుపాయాలు చాలా తక్కువగా ఉండేవి. ఇప్పటికీ దేశంలో ఇండోర్ టెన్నిస్ కోర్టులు తక్కువగా ఉన్నాయి. బెంగాల్, తమిళనాడు, బీహార్ రాష్ట్రాలు ఇంకా మెరుగ్గా రాణించే అవకాశముంది. క్రీడా విద్యలో యువతను ప్రోత్సహించడం, వారికి అవకాశాలు కల్పించడం చాలా అవసరం. మహిళల సాధికారత కోసం సమాన అవకాశాల స్కాలర్షిప్ కార్యక్రమాన్ని తీసుకురావడం నా కల అని ఆయన తెలిపారు.
లియాండర్ రాక గర్వకారణం
కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు మాట్లాడుతూ, పేస్ బీజేపీలో చేరడం గర్వకారణమని చెప్పారు. ఆయన చేరికతో ఖేలో ఇండియా కార్యక్రమానికి మరింత ఊపిరి వస్తుందని పేర్కొన్నారు. పేస్ 19వ శతాబ్దపు ప్రముఖ బెంగాలీ కవి, నాటక రచయిత మైఖేల్ మధుసూదన్ దత్ వారసుడని అన్నారు.
సుకాంత మజుమ్దార్ మాట్లాడుతూ, పేస్ టెన్నిస్లో సాధించిన విజయాలు బెంగాల్ యువతకు ప్రేరణగా నిలుస్తాయని అన్నారు. ఆయన చేరికతో రాబోయే ఎన్నికల్లో పార్టీకి మరింత బలం చేకూరుతుందని తెలిపారు. భారత టెన్నిస్లో అత్యంత విజయవంతమైన ఆటగాళ్లలో ఒకరైన లియాండర్ పేస్ అనేక గౌరవాలు అందుకున్నారు. ఆయనకు రాజీవ్గాంధీ ఖేల్రత్న, అర్జున అవార్డు, పద్మశ్రీ, పద్మ భూషణ్ వంటి ప్రతిష్ఠాత్మక పురస్కారాలు లభించాయి. టెన్నిస్ను భారత్లో ప్రజాదరణ పొందేలా చేసిన ప్రముఖ క్రీడాకారుడిగా ఆయన పేరు నిలిచిపోనుంది.
